Dhoni retirement : ధోనీ చివరి మ్యాచ్ నేడే? 5 ఏళ్ల క్రితం తలా చెప్పిన ముచ్చట నిజం కాబోతుందా?

CSK vs SRH : ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగుస్తున్నా చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, సోమవారం రాత్రి చెపాక్‌ వేదికగా ఎస్​ఆర్​హెచ్ మ్యాచ్‌తో ధోనీ రీఎంట్రీ ఇచ్చి, ఇక ఐపీఎల్​కే రిటైర్మెంట్​ ప్రకటిస్తాడని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 

Published on: May 18, 2026, 12:25:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

MS Dhoni IPl retirement : ఐపీఎల్​ 2026 లీగ్​ స్టేజ్​ ముగిపు దశకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్​ కింగ్స్​కి ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి నేడు (మే 18) సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరగనుంది. ఈ సీజన్​లో హోమ్​ గ్రౌండ్​లో ఆ జట్టుకు ఇదే చివరి మ్యాచ్. అందుకే ఇప్పుడు అందరి ఫోకస్​ లెజెండ్ ఎంఎస్​ ధోనీపై పడింది! గాయం కారణంగా ఈ సీజన్​లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​ కూడా ఆడని ధోనీ.. ఈరోజు ఆడేసి, ఆటకి గుడ్​బై చెప్పేస్తాడా? అని అందరు ఆలోచిస్తున్నారు. ఇందుకు కారణం కూడా ధోనీయే!

ఎంఎస్​ ధోనీ.. (PTI)
ఎంఎస్​ ధోనీ.. (PTI)

5 ఏళ్ల క్రితం ధోనీ చెప్పిన మాట నిజమవుతుందా?

ప్రస్తుతం చెపాక్‌లో నెలకొన్న వాతావరణం, ఐదేళ్ల క్రితం ధోనీ స్వయంగా చేసిన ఒక ప్రకటనకు సరిగ్గా సరిపోతోంది. 2021లో సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంబరాల్లో ధోనీ మాట్లాడుతూ.. తన కెరీర్ చివరి టీ20 మ్యాచ్‌ చెన్నైలోనే ఆడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

"నేను ఎప్పుడూ నా క్రికెట్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటాను. నా చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నా సొంతూరైన రాంచీలోనే ఆడాను. కాబట్టి, నా చివరి టీ20 మ్యాచ్ కూడా చెన్నైలోనే ఉంటుందని ఆశిస్తున్నాను. అది వచ్చే ఏడాది కావచ్చు లేదా ఐదేళ్ల తర్వాత కావచ్చు, అది మనకు తెలియదు," అని ధోనీ 2021లో రిటైర్మెంట్ టైమ్‌లైన్‌పై హింట్ ఇచ్చాడు.

ధోనీ చెప్పిన ఆ ఐదేళ్ల టైమ్‌లైన్ ఈ రాత్రితో ముగియనుంది! షెడ్యూల్ ప్రకారం.. ఈ మ్యాచ్ తర్వాత చెన్నై వేదికగా ఎలాంటి మ్యాచ్‌లు లేవు. అందువల్ల చెపాక్ ప్రేక్షకులు ధోనీని తమ హోమ్ గ్రౌండ్‌లో చూడటానికి ఇదే ఆఖరి అవకాశం అని గట్టిగా నమ్ముతున్నారు.

ఎస్​ఆర్​హెచ్​పై ధోనీ బరిలోకి దిగే ఛాన్స్ ఉందా?

ధోనీ దీర్ఘకాల అంతర్జాతీయ జట్టు సభ్యుడు, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాటలు అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

"నాకైతే హైదరాబాద్‌పై ధోనీ ఆడతాడనే అనిపిస్తోంది. గత రెండు మూడు మ్యాచ్‌ల నుండే అతను మైదానంలోకి దిగడానికి పూర్తిగా ఫిట్‌గా, సిద్ధంగా ఉన్నాడని నేను విన్నాను," అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు, ధోనీ సెలెక్షన్‌కు అందుబాటులో లేడంటూ సీఎస్కే యాజమాన్యం అధికారికంగా చెబుతున్నప్పటికీ.. తెర వెనుక మరో ప్రచారం జరుగుతోంది. 44 ఏళ్ల ధోనీ భవిష్యత్తు కోసం జట్టును సిద్ధం చేసేందుకే ఇన్నాళ్లూ పక్కన కూర్చున్నాడని, ఇప్పుడు సడన్‌గా జట్టులోకి వస్తే టీమ్ కాంబినేషన్ దెబ్బతినే ప్రమాదం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి.

అటు సోషల్​ మీడియాలో కూడా ఈ వ్యవహారంపై మీమ్స్​ పేలుతున్నాయి. “ధోనీ ఎప్పుడే రిటైర్ అయిపోయాడు.. సీఎస్కే మేనేజ్​మెంట్​ ఆ విషయం చెప్పట్లేదు,” అని కొందరు భావిస్తున్నారు. ఐపీఎల్​ 2026 ముగిసిన తర్వాత ధోనీ రిటైర్మెంట్​ గురించి చెబుతాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ, ధోనీ రిటైర్మెంట్​పై ఊహాగానాల నేపథ్యంలో ఫ్యాన్స్​ ఎమోషనల్​ అవుతున్నారు. టీమ్​లో తలా లేని లోటు పూడ్చలేమని అంటున్నారు.

మరి ఈరోజు జరగనున్న సీఎస్కే వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​లో ధోనీ ఆడతాడా? లేదా? అనేది తెలుసుకోవాలంటే టాస్​ టైమ్ వరకు వేచి చూడాల్సిందే!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More