...
...
Next Story

Delhi gang rape : 16ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్, హత్య! మృతదేహాన్ని పీక్కుని తిన్న కుక్కలు..

దేశ రాజధాని దిల్లీలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే దారుణ ఘటన వెలుగు చూసింది. 16ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు కలసి అత్యాచారానికి ఒడిగట్టి, కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేయడంతో వీధి కుక్కలు పీక్కుతిన్నాయి.

Published on: Sep 18, 2026, 10:45:36 IST
Advertisement

దేశ రాజధాని దిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది! ఒక 16 ఏళ్ల బాలికపై నలుగురు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి, ఆపై అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అక్కడితో ఆగకుండా ఆ పసిపాప శవాన్ని ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేసి వెళ్లారు. రోజుల తరబడి ఆ మృతదేహం అక్కడే పడి ఉండటంతో వీధి కుక్కలు పీక్కుతిన్నాయి.

గుర్తుపట్టలేనంతగా మారిన మృతదేహం!

దిల్లీలో 16ఏళ్ల బాలిక గ్యాంగ్​రేప్.. (AP Photo/Representative)
దిల్లీలో 16ఏళ్ల బాలిక గ్యాంగ్​రేప్.. (AP Photo/Representative)

సెప్టెంబర్ 13న ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. వాయువ్య దిల్లీలోని స్వరూప్ నగర్ సమీపంలో కుషక్ రోడ్డు పక్కన ఉన్న జైపాల్ రాణా చేనులో ఓ శవం పడి ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో కనిపించిన దృశ్యం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతదేహం కుళ్లిపోయి, ముఖం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. శవం నుంచి ఒక చెయ్యి తెగిపడి ఉంది. శవంలోని కొన్ని భాగాలను వీధి కుక్కలు తినివేశాయి! ప్రాథమికంగా ఆ శవం స్త్రీదా లేక పురుషుడిదా అని కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. వైద్య పరీక్షల అనంతరం అది 16 ఏళ్ల బాలికదని, ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయింది.

టెంపోలోనే మద్యం తాగి దారుణం!

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాధితురాలు, నిందితులు ఒకరికొకరు ముందే పరిచయస్తులే. అందరూ కలసి ఒక టెంపో వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. టెంపో లోపల నిందితులు మద్యం సేవించిన అనంతరం బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆ తర్వాత విషయాన్ని బయటకు చెబుతుందేమోనన్న భయంతో కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం శవాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి పరారయ్యారు.

ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. దీనితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని 50కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగిన ఒక టెంపోను గుర్తించారు. చీకటి కారణంగా వాహనం నంబర్ స్పష్టంగా కనిపిచకపోవడంతో, వరుస సీసీటీవీల ఆధారంగా దాన్ని ట్రాక్ చేశారు. సెప్టెంబర్ 15, 16 తేదీల మధ్య రాత్రి నిరంతరంగా శోధించి టెంపో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మైనర్లు సహా నలుగురు కటకటాల్లోకి..

టెంపో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఈ ఘోరానికి పాల్పడిన నలుగురిని పోలీసులు గుర్తించారు. ఇందులో ముగ్గురు మైనర్లు (16, 17 ఏళ్ల వయస్సు గలవారు) ఉండటం గమనార్హం. ప్రధాన నిందితుడిని ఖడ్డా కాలనీకి చెందిన శివం అలియాస్ సుదామా అలియాస్ చుచుగా గుర్తించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, నేరం జరిగిన సమయంలో వేసుకున్న దుస్తులతో పాటు ఆ టెంపోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్​ఎస్), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.

ఈ ఘటన దిల్లీలో కలకలం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, సోషల్​ మీడియాలో ఈ ఘటన గురించి తెలుసుకున్నవారు డిమాండ్​ చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks