Delhi blast : అదృష్టం అంటే ఇతనిదే! ఒక్క నిమిషంలో ప్రాణాలు కాపాడుకున్నాడు..
ఒక్క నిమిషం తేడాలో దిల్లీ పేలుడు నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి కథ ఇది! సోమవారం సాయంత్రం 6:52కి పేలుడు సంభవిచంగా.. అజయ్ సింగ్ అనే వ్యక్తి, 6:51కి అదే ప్రాంతంలోని మెట్రో టికెట్ కొనుగోలు చేశారు. తొలుత క్యాబ్ తీసుకుందామని ఆలోచించినా, చివరి నిమిషంలో మనసు మార్చుకుని మెట్రో ఎక్కారు.
విధి ఆడే వింత నాటకం మనిషికి అంతుచిక్కదు! కొన్ని క్షణాల్లోనే జీవితం మారిపోతుంది అనేందుకు హిమాచల్ ప్రదేశ్ వాసి అజయ్ సింగ్కి జరిగిన సంఘటన చక్కటి ఉదాహరణ! సోమవారం జరిగిన దిల్లీ పేలుడు నుంచి అతను ఒక్క నిమిషం వ్యవధిలో తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే..

చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం.. ప్రాణాన్ని నిలబెట్టింది..
సోమవారం సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే, సోమవారం సాయంత్రం అజయ్ సింగ్ అదే ప్రాంతంలో ఉన్నారు! తొలుత క్యాబ్లో ఇంటికి వెళ్లాలని అనుకున్న అతను, అనూహ్యంగా మనసు మార్చుకుని మెట్రో ఎంచుకున్నారు. పేలుడు సంభవించడానికి కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషం ముందు, అంటే 6:51 గంటలకు ఆయన మెట్రో టికెట్ కొనుగోలు చేశారు.
మెరాకీ హాస్పిటాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అజయ్ సింగ్, తన అనుభవాన్ని లింక్డ్ఇన్లో పంచుకున్నారు. ప్లాన్లో ఆకస్మిక మార్పు తన ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించారు.
“నిన్న సాయంత్రం నేను చాందినీ చౌక్లో ఉన్నాను. ఇంటికి తిరిగి వెళ్లడానికి క్యాబ్ తీసుకోవడానికి రెడ్ ఫోర్ట్ వైపు నడుస్తున్నాను. కానీ, అకస్మాత్తుగా - ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు - నా మనసు మారి, మెట్రో తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను 6:51 పీఎంకి టికెట్ కొన్నాను. ఆ అనాలోచిత నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, నేను సరిగ్గా పేలుడు జరిగిన ప్రాంతంలోనే, లేదా దానికి చాలా దగ్గరగా ఉండేవాడిని.”
'ఎప్పుడూ మెట్రోలో ఇంటికి వెళ్లలేదు'
తృటిలో మృత్యువు నుంచి తప్పించుకోవడంపై స్పందిస్తూ.. మెట్రో ఎక్కడం తనకెప్పుడూ అలవాటు లేదని అజయ్ తెలిపారు. "ఇక్కడ విచిత్రం ఏంటంటే - నమ్మండి, నేను ఎప్పుడూ మెట్రోలో ఇంటికి తిరిగి వెళ్లలేదు. చేతిలో చాలా షాపింగ్ బ్యాగ్లు ఉన్నందున, క్యాబ్ తీసుకోవడం సహజమైన ఎంపిక. అయినప్పటికీ, ఏదో తెలియని కారణం వల్ల నేను మెట్రోను ఎంచుకున్నాను," అని వివరించారు.
"బహుశా అది ఇన్స్టింక్ట్ కావచ్చు. బహుశా అదృష్టం కావచ్చు. లేదా... కర్మ కావచ్చు. కొన్నిసార్లు, జీవితం మనకు సూక్ష్మమైన సంకేతాలను ఇస్తుంది - మనం ఊహించలేని దాని నుంచి మనల్ని దూరంగా ఉంచే సున్నితమైన తోసేస్తుంది. ఈ చిన్న నిర్ణయానికి, కనబడని రక్షణకు, ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తున్న పెద్ద శక్తి ఒకటి ఉందని గుర్తుచేసినందుకు నేను ఈ రోజు చాలా కృతజ్ఞుడను," అని ఆయన అభిప్రాయపడ్డారు.
హిమాలయాల్లో కొత్త జీవితం..
చండీగఢ్లో రక్షణ రంగ కుటుంబంలో జన్మించి, చెన్నైలో పెరిగిన అజయ్.. తన ఇరవైలలో మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, హిమాలయాల్లో మరింత సంతృప్తికరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం, ఆయన కంఫర్ట్, కమ్యూనిటీ, సాహసాలను కలిపి అందించే బౌటిక్ ఎయిర్బీఎన్బీ స్టే సముదాయం అయిన మెరాకీ హాస్పిటాలిటీకి నాయకత్వం వహిస్తున్నారు.
"నా 20 ఏళ్ల ప్రారంభంలోనే, మంచి జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలి, హిమాలయాలను అన్వేషించడం, ఇతరులు కూడా దాని మ్యాజిక్ను అనుభవించేందుకు సహాయం చేయడం వంటి మరింత ఉత్తేజకరమైన దానిని ఎంచుకున్నాను!" అని ఆయన తన ప్రొఫైల్లో పంచుకున్నారు.
అజయ్ సింగ్ కథ... జీవితం క్షణాల్లో మారిపోతుంది అనే సత్యాన్ని మనందరికీ గుర్తు చేస్తుంది!













