...
...
Next Story

Delhi tragedy : దిల్లీలో అగ్నిప్రళయం! బిల్డింగ్​లో మంటలు- 9 మంది సజీవ దహనం..

Delhi fire accident : దేశ రాజధాని దిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివేక్​ విహార్​లోని ఒక అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. గంటల తరబడి శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి.

Published on: May 3, 2026, 09:48:54 IST
Advertisement

దేశ రాజధాని దిల్లీలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. షాదరా జిల్లాలోని వివేక్ విహార్ ఫేజ్-1లో ఉన్న ఒక నాలుగు అంతస్తుల నివాస భవనం నిప్పుల కొలిమిగా మారింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. 12 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.

అగ్ని కీలల్లో చిక్కుకున్న నాలుగు అంతస్తులు!

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..

ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:48 గంటల సమయంలో వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు ప్రమాదంపై సమాచారం అందింది. అంతకంటే ముందే, అంటే 3:35 గంటలకే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భవనంలోని ఆరు ప్లాట్లలో ఉన్న గృహోపకరణాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. మంటలు వేగంగా రెండో అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. ఉదయం 8 గంటల వరకు నిరంతరాయంగా పోరాడి మంటలను అదుపులోకి తెచ్చినట్లు డ్యూటీ ఆఫీసర్ ముకేశ్ వర్మ ధృవీకరించారు.

తాళం వేసిన మెట్ల దారి వద్దే ముగ్గురి మృతి!

రెస్క్యూ ఆపరేషన్ సమయంలో సహాయక బృందాలకు గుండెలవిసే దృశ్యాలు కనిపించాయి! భవనంలోని వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. మొదటి అంతస్తులో ఒకరు, రెండో అంతస్తులో ఐదుగురు మరణించగా.. మరో ముగ్గురు ప్రాణ రక్షణ కోసం పైకి పరుగెత్తే క్రమంలో తాళం వేసి ఉన్న మెట్ల దారి వద్దే సజీవ దహనమయ్యారు.

"సమాచారం అందిన వెంటనే నేను ఘటనా స్థలానికి చేరుకున్నాను. లోపలికి వెళ్లి చూడగా రెండో అంతస్తు వెనుక భాగంలో ఐదు మృతదేహాలు, టాప్ ఫ్లోర్‌లో మరో మూడు మృతదేహాలు కనిపించాయి. అవి ఎంతగా కాలిపోయాయంటే, కనీసం ఆడ లేదా మగ అని గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదు," అని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పంకజ్ లూత్రా ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రాణాలకు తెగించి రక్షించిన బృందాలు..

ఏసీ పేలుడే కారణమా?

ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, ఎయిర్ కండిషనర్ (ఏసీ) పేలడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. "సుమారు 3:13 గంటల ప్రాంతంలో ఏసీలో పేలుడు సంభవించి మంటలు మొదలయ్యాయి. అగ్నిమాపక వాహనాలు వచ్చేలోపే మంటలు భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి," అని రోహిత్ అనే ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా కారణమా అనేది పూర్తిస్థాయి విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఎండలు ముదురుతున్న వేళ నివాస భవనాల్లో ఏసీలు, ఎలక్ట్రికల్ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పాత వైరింగ్ మార్చుకోవడం, ఫైర్ ఎగ్జిట్ మార్గాలను క్లియర్ గా ఉంచుకోవడం వల్ల ఇటువంటి ప్రాణనష్టాన్ని నివారించవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe