...
...
Next Story

Dharmendra Pradhan resign : విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా? వీడియో వైరల్​- నిజమెంత?

Dharmendra Pradhan resignation news : కేంద్ర విద్యారంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వైరల్ వీడియో పూర్తిగా నకిలీదని పీఐబీ తెలిపింది. అదే సమయంలో ఆయన రాజీనామాపై ప్రభుత్వం తేల్చి చెప్పాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పట్టుబడుతోంది.

Published on: Jul 25, 2026, 13:27:07 IST
Advertisement

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపడుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో సాగుతున్న ఈ ఆందోళనల నడుమ సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రెస్ మీట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా తన రాజీనామాను ప్రకటిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?

“వ్యక్తిగత కారణాల వల్ల నేను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు,” అంటూ ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

వైరల్ వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..

అయితే, ఈ వీడియో పూర్తిగా నకిలీదని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. సాంకేతికంగా డిజిటల్‌గా మార్చిన (మానిప్యులేటెడ్) ఫేక్ వీడియోగా దీనిని నిర్ధారించింది.

“కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవి గురించి ప్రకటన చేస్తున్నట్లు వస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది పూర్తిగా డిజిటల్‌గా మార్చిన #Fake వీడియో. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అలాంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదు,” అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో స్పష్టం చేసింది.

మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరించింది. శుక్రవారం నాడు కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు జరిపిన చర్చల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఈ చర్చలపై సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా స్పందిస్తూ.. నష్టపరిహారం, నమోదు చేసిన కేసుల ఉపసంహరణ వంటి న్యాయపరమైన అంశాలపై చర్చలు సానుకూలంగా జరిగాయని, త్వరలోనే లిఖితపూర్వక హామీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, తమ ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం ఎలాంటి పురోగతి లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేది లేదని వార్తా సంస్థల కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే, ప్రభుత్వం ఆ విషయాన్ని సూటిగా తేల్చి చెప్పాలి. రాజీనామా లేనప్పుడు ఈ చర్చలు పొడిగించడంలో అర్థం లేదు. ప్రభుత్వం స్పష్టత ఇస్తేనే మేము మా తదుపరి కార్యాచరణను నిర్ణయించుకుంటాం. ప్రభుత్వం ఇదే ధోరణి కొనసాగిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు,” అని అశుతోష్ రాంకా హెచ్చరించారు.

కేంద్రం నుంచి తమకు "అవును లేదా కాదు" సమాధానం మాత్రమే కావాలని సీజేపీ స్పష్టం చేసింది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 47 మంది అధికారులను తొలగించడంపై స్పందిస్తూ — అధికారులపై చర్యలు తీసుకోవడం మంచిదే అయినా, ప్రశ్నాపత్రాల లీకేజీలు, తద్వారా విద్యార్థులు ఎదుర్కొన్న మనోవేదనకు విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధానే నేరుగా బాధ్యత వహించాలని, ఆయన రాజీనామా చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పునరుద్ఘాటించారు.

మరోవైపు కేంద్ర మంత్రులు- సీజేపీ మధ్య ఈరోజు మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబడుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe