FASTag : వాహనదారులకు ఝలక్! నేటి నుంచే పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు- ఎంతంటే..

FASTag annual pass price increase : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రైవేట్ వాహనదారులపై ఈ భారం పడనుంది.

Published on: Apr 1, 2026, 06:00:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైవేలపై తరచూ ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) ప్రకటించింది. పెరిగిన ధరల ప్రకారం, ఇప్పటివరకు రూ. 3,000 గా ఉన్న వార్షిక పాస్ ధర ఇకపై రూ. 3,075 కానుంది. అంటే నేటి నుంచి అదనంగా రూ. 75 భారం పడనుంది.

ఫాస్టాగ్​ యాన్యువల్​ పాస్​ ధర పెంపు..
ఫాస్టాగ్​ యాన్యువల్​ పాస్​ ధర పెంపు..

నాన్-కమర్షియల్ (ప్రైవేట్) వాహనాల కోసం గతేడాది ప్రారంభించిన ఈ ప్రీపెయిడ్ టోల్ ప్లాన్‌లో మొదటిసారిగా ధరల సవరణ జరిగింది. నేషనల్ హైవేస్ ఫీ నిబంధనలు 2008 ప్రకారం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మార్పులను ఖరారు చేసింది.

ఫాస్టాగ్​ యాన్యువల్​ పాస్​ ధర పెంపు- ఎవరికి వర్తిస్తుంది?

ఈ ఫాస్టాగ్​ యాన్యువల్​ పాస్ సదుపాయం కేవలం సొంత వాహనాలు అంటే కార్లు, జీపులు, వ్యాన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు ఈ స్కీమ్ వర్తించదు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఫాస్టాగ్​ యాన్యువల్​ పాస్​ ధర పెంపు- నిబంధనలేంటి?

ఫాస్టాగ్​ యాన్యువల్​ ధర పెరిగినప్పటికీ, ఈ పాస్ వినియోగ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు.

వాలిడిటీ: ఒక సంవత్సరం లేదా గరిష్టంగా 200 సార్లు టోల్ దాటడం (ఏది ముందు పూర్తయితే అది).

ప్రయోజనం: ప్రతిసారీ రీఛార్జ్ చేసుకునే పని లేకుండా, ఒకేసారి పేమెంట్ చేయడం ద్వారా నగదు రహితంగా ప్రయాణించవచ్చు.

ఫాస్టాగ్​ యాన్యువల్​ పాస్​కి పెరుగుతున్న ఆదరణ!

గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ ఫాస్టాగ్​ యాన్యువల్​ పాస్ విధానానికి వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం 56 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఈ ప్లాన్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా ఎన్‌సీఆర్ వంటి మెట్రో నగరాల్లో నివసించే వారు, తరచూ సొంతూళ్లకు ప్రయాణించే వారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా మారింది.

వార్షిక పాస్ ధరలో రూ. 75 పెరుగుదల పెద్ద మార్పు కాకపోయినప్పటికీ, రోజువారీ ప్రయాణికులకు ఇది కొంత అదనపు ఖర్చుతో కూడుకున్న విషయమే.

ఫాస్టాగ్ వార్షిక పాస్ - తరచుగా అడిగే ప్రశ్నలు-

1. వార్షిక పాస్ తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు టోల్ గేట్లు దాటవచ్చు? దీని కాలపరిమితి ఎంత?

వార్షిక పాస్ తీసుకున్న తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు దీనికి వాలిడిటీ ఉంటుంది. అయితే, ఈ కాలపరిమితిలో మీరు గరిష్టంగా 200 సార్లు మాత్రమే టోల్ ప్లాజాలను దాటడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ మీరు ఏడాది పూర్తికాకముందే 200 సార్లు టోల్ దాటేస్తే, ఆ తర్వాత సాధారణ పద్ధతిలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

2. ఈ వార్షిక పాస్ అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుందా?

లేదు. ఈ వార్షిక పాస్ సౌకర్యం కేవలం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే సొంత అవసరాలకు వాడే కార్లు, జీపులు, వ్యాన్‌లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. టాక్సీలు, బస్సులు లేదా లారీలు వంటి కమర్షియల్ వాహనాలకు ఈ స్కీమ్ వర్తించదు.

3. స్టేట్ హైవేలు లేదా ఇతర ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ పాస్ పని చేస్తుందా?

ఈ పాస్ కేవలం ఎన్​హెచ్​ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) పరిధిలోని సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద మాత్రమే పని చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండే స్టేట్ హైవేలు లేదా కొన్ని ప్రైవేట్ ఎక్స్‌ప్రెస్‌వేల (ఉదాహరణకు: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే) వద్ద ఈ పాస్ చెల్లదు. అక్కడ మీ ఫాస్టాగ్ వాలెట్ నుంచి సాధారణ రేట్ల ప్రకారమే నగదు కట్ అవుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More