విదేశీ విద్యార్థులతో బిలియన్ల కొద్దీ ఆదాయం సంపాదిస్తున్న దేశాలు
విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల ఆకాంక్ష అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తోంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న 'స్టడీ అబ్రాడ్' రంగం, ఇప్పుడు ఒక శక్తివంతమైన ఎగుమతి పరిశ్రమగా అవతరించింది.
లండన్, ఏప్రిల్ 2026: విదేశీ విద్య అనేది ఒకప్పుడు కేవలం ధనిక వర్గాలకో లేదా మెరుగైన చదువు కోసమో అనుసరించే ఒక ట్రెండ్ మాత్రమే. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్లుగా మారుతున్నారు. ఏ దేశాలైతే అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయో, అవే దేశాలు ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలోనూ అగ్రగామిగా నిలవడం ఇక్కడ గమనించాల్సిన అంశం.

బిలియన్ డాలర్ల ఆదాయ వనరుగా విద్యార్థులు
2024 'ఓపెన్ డోర్స్' నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ విద్యార్థులు ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.15 లక్షల కోట్లు) కంటే ఎక్కువ ఆదాయాన్ని చేకూరుస్తున్నారు. ఇది కేవలం ఫీజుల రూపంలోనే కాకుండా, అక్కడి వివిధ రంగాల్లో వేలాది ఉద్యోగాల కల్పనకు కూడా తోడ్పడుతోంది. బ్రిటన్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 2021 నాటికి యూకేలో ఉన్నత విద్య ద్వారా వచ్చే ఎగుమతి ఆదాయం 21.7 బిలియన్ పౌండ్లకు చేరింది. లండన్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం, అంతర్జాతీయ విద్యార్థుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు చేకూరే నికర ప్రయోజనం దాదాపు 37.4 బిలియన్ పౌండ్ల వరకు ఉంటోంది. సగటున ప్రతి నివాసిపై ఒక విద్యార్థి తన విద్యా కాలంలో సుమారు 560 పౌండ్ల ఆర్థిక ప్రభావాన్ని చూపుతున్నారు.
జర్మనీ వెైపు భారతీయుల చూపు
అమెరికా, బ్రిటన్ తర్వాత విద్యార్థుల హాట్ ఫేవరెట్ డెస్టినేషన్గా జర్మనీ అవతరిస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన విద్య జర్మనీ సొంతం కావడంతో, ప్రస్తుతం అక్కడ దాదాపు 4.70 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా 59,000 మంది భారతీయులే ఉండటం విశేషం. చైనాను వెనక్కి నెట్టి భారతీయులు జర్మనీలో అగ్రస్థానంలో నిలిచారు.
మారుతున్న విద్యార్థుల ఆలోచనా తీరు
"విద్యార్థులు కేవలం డిగ్రీల కోసం వెళ్లడం లేదు, తమ కుటుంబాల భవిష్యత్తును మార్చాలనే పట్టుదలతో వెళ్తున్నారు. ముఖ్యంగా భారత్, ఆఫ్రికా వంటి మార్కెట్ల నుంచి వచ్చే విద్యార్థులలో ఈ ఆశయం బలంగా కనిపిస్తోంది" అని ప్రోడిజీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ విశ్లేషించారు.
నేడు విద్యార్థులు కేవలం యూనివర్సిటీ పేరును చూసి కాకుండా.. చదువు పూర్తియ్యాక వచ్చే ఉద్యోగ అవకాశాలు (Career Outcomes), వీసా నిబంధనలు, శాశ్వత నివాసానికి ఉండే అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు న్యూజిలాండ్, సింగపూర్, యూఏఈ వంటి దేశాలు కూడా విద్యా రంగాన్ని ఒక ప్రధాన ఎగుమతి పరిశ్రమగా భావిస్తూ భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.
భారత్: ఎగుమతిదారుగానే కాదు, గమ్యస్థానంగా కూడా..
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. సుమారు 13 లక్షల మంది భారతీయులు ప్రస్తుతం విదేశాల్లో విద్యనభ్యసిస్తూ ప్రపంచ విద్యా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. అయితే, భారత్ ఇప్పుడు కేవలం విద్యార్థులను పంపే దేశంగానే కాకుండా, పొరుగు దేశాల విద్యార్థులకు ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కూడా మారుతోంది. నాణ్యమైన విద్యా సంస్థలు, తక్కువ జీవన వ్యయం వంటి కారణాలతో దక్షిణాసియా దేశాల విద్యార్థులు భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు.
మరో ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే, పాశ్చాత్య దేశాల విద్యార్థులు కూడా సాంస్కృతిక అనుభవం కోసం, ఎమర్జింగ్ మార్కెట్లలో అవకాశాల కోసం భారత్ వంటి దేశాలకు రావడం ప్రారంభించారు. ఈ ద్వైపాక్షిక విద్యార్థుల రాకపోకలు ప్రపంచ శ్రామిక శక్తిని మరింత పటిష్టం చేస్తున్నాయి. చదువు అనేది ఇప్పుడు ఒక విద్యాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ ఎకనామిక్ స్ట్రాటజీగా రూపాంతరం చెందింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థులు ఎంత మేర తోడ్పడుతున్నారు?
ఏటా సుమారు 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేకూరుస్తున్నారు. ఇది అక్కడి లక్షలాది ఉద్యోగాల కల్పనకు కూడా ఆధారమవుతోంది.
2. జర్మనీలో అత్యధికంగా ఉన్న విదేశీ విద్యార్థులు ఏ దేశానికి చెందిన వారు?
జర్మనీలో ప్రస్తుతం సుమారు 59,000 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య పరంగా భారతీయులే అక్కడ ప్రథమ స్థానంలో ఉన్నారు.
3. విద్యార్థులు గమ్యస్థానాన్ని ఎంచుకునేటప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు?
ప్రస్తుత విద్యార్థులు కేవలం యూనివర్సిటీ ఖ్యాతిని మాత్రమే కాకుండా.. ఆ చదువు వల్ల వచ్చే కెరీర్ గ్రోత్, వీసా నిబంధనలు, ఇతర దీర్ఘకాలిక అవకాశాలను ప్రధానంగా చూస్తున్నారు.
4. భారత్ ఇప్పుడు గ్లోబల్ ఎడ్యుకేషన్ మ్యాప్లో ఎలా నిలుస్తోంది?
భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా విద్యార్థులను విదేశాలకు పంపే దేశాలలో ఒకటిగా ఉండటంతో పాటు, సరసమైన ఫీజుల కారణంగా పొరుగు దేశాల విద్యార్థులకు ప్రధాన విద్యా కేంద్రంగా మారుతోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


