EPF Nominee: ఆన్లైన్లో ఈపీఎఫ్ నామినీని మార్చడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదిగో
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులు తమ నామినేషన్ను ఎప్పుడైనా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గతంలో పేర్కొన్న నామినీని మార్చాలనుకున్నా లేదా కొత్తవారిని వారసులుగా చేర్చాలనుకున్నా అనుసరించాల్సిన పూర్తి విధానం, దానికి కావలసిన ముఖ్యమైన వివరాలు ఈ కథనంలో చూద్దాం.
ఈపీఎఫ్ ఖాతా తెరిచే సమయంలో, ఒకవేళ ఖాతాదారుడు అకాల మరణం చెందితే ఆ అకౌంట్లో ఉన్న డబ్బు ఎవరికి చెందాలనే దానికి ఒక నామినీని ఎంచుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఉద్యోగంలో చేరిన కొత్తలో నామినీ పేరును నమోదు చేసి, ఆ తర్వాత దానిని అస్సలు పట్టించుకోరు. అయితే, ఒకసారి నమోదు చేసిన నామినీని జీవితకాలం పాటు అలాగే ఉంచాల్సిన అవసరం లేదు. మారుతున్న మీ కుటుంబ పరిస్థితులను బట్టి నామినీని మార్చుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ (EPFO) కల్పిస్తోంది.

తల్లిదండ్రుల స్థానంలో భార్య/భర్త పేరును మార్చాలన్నా, లేదా పిల్లల పేర్లను కూడా నామినీలుగా చేర్చి వాటాలను పంచాలన్నా 'ఇ-నామినేషన్' (e-nomination) సదుపాయం ద్వారా ఆన్లైన్లోనే సులభంగా పూర్తి చేయవచ్చు.
ఈపీఎఫ్ నామినీని అప్డేట్ చేయడానికి కావలసినవి:
ఆన్లైన్లో నామినేషన్ ప్రక్రియను ప్రారంభించే ముందు కింద పేర్కొన్న వివరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.
- యాక్టివేట్ అయ్యి, ఆధార్తో లింక్ అయిన యూఏఎన్ (UAN - Universal Account Number).
- ఆధార్ కార్డ్తో లింక్ చేసి ఉన్న యాక్టివ్ మొబైల్ నంబర్.
- నివాస చిరునామా, ప్రొఫైల్ ఫోటోతో అప్డేట్ చేసిన ఈపీఎఫ్ ఖాతా.
- నామినీ యొక్క స్కాన్ చేసిన ప్రొఫైల్ ఫోటో, ఆధార్ నంబర్.
- నామినీ బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్, వారి నివాస చిరునామా.
ఆన్లైన్లో ఈపీఎఫ్ నామినీని అప్డేట్ చేసే స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్:
పాత నామినీని మార్చడం అంటే కొత్తగా నామినేషన్ వేయడమే. మీరు కొత్త నామినేషన్ సమర్పించిన ప్రతిసారీ, అది పాత నామినేషన్ స్థానంలో భర్తీ అవుతుంది. ఉదాహరణకు, గతంలో భార్య పేరు ఉండి, ఇప్పుడు పిల్లల పేరును కూడా చేర్చాలనుకుంటే, కొత్తగా దరఖాస్తు చేసేటప్పుడు భార్య, పిల్లలిద్దరి వివరాలనూ మళ్లీ నమోదు చేయాల్సి ఉంటుంది. పాత నామినేషన్ను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు.
అనుసరించాల్సిన దశలు:
- మొదట ఈపీఎఫ్ఓ మెంబర్ ఇ-సేవా పోర్టల్ (EPFO Member e-Sewa Portal) వెబ్సైట్ను సందర్శించండి.
- మీ యూఏఎన్ (UAN), పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మెయిన్ మెనూలో ఉన్న ‘Manage’ ట్యాబ్ క్రింద ‘e-nomination’ ఆప్షన్ను ఎంచుకోండి.
- తదుపరి పేజీలో ‘Enter new nomination’ ఆప్షన్పై క్లిక్ చేయండి.
- స్క్రీన్పై మీ వ్యక్తిగత ప్రొఫైల్ వివరాలు కనిపిస్తాయి, అన్నీ సరిచూసుకుని ‘Proceed’ బటన్పై క్లిక్ చేయండి.
- కొత్త నామినీని చేర్చడానికి లేదా పాత నామినీ వివరాలను మార్చడానికి ‘Family Declaration’ విభాగంలో ‘Yes’ అని సెలెక్ట్ చేయండి. (గమనిక: భార్య, పిల్లలు, తల్లిదండ్రులను మాత్రమే కుటుంబంగా పరిగణిస్తారు. ఒకవేళ తోబుట్టువులను నామినీగా పెట్టాలనుకుంటే ‘Having Family’ సెక్షన్లో ‘No’ అని ఎంచుకోవాలి).
- ఇప్పుడు నామినీ వివరాలను (ఆధార్, పేరు, పుట్టిన తేదీ, చిరునామా) నమోదు చేసి, వారి ఫోటోను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ‘Save Family Details’ పై క్లిక్ చేయండి. ఒకరి కంటే ఎక్కువ మందిని చేర్చాలనుకుంటే ‘Add now’ క్లిక్ చేసి వారి వివరాలు కూడా ఇవ్వవచ్చు.
- నామినీలకు ఎంత శాతం షేర్ (డబ్బులో వాటా) ఇవ్వాలో కేటాయించి, ‘Save EPF Nomination’ బటన్పై క్లిక్ చేయండి.
ఇ-సైన్ (E-sign) ప్రక్రియ అత్యంత ముఖ్యం:
మీరు ఆన్లైన్లో సమర్పించిన ఈపీఎఫ్ ఇ-నామినేషన్ చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే 'ఇ-సైన్' ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి.
- నామినేషన్ సేవ్ చేసిన తర్వాత స్క్రీన్పై కనిపించే ‘E-sign’ లింక్పై క్లిక్ చేసి, తర్వాతి పేజీలో ఉన్న చెక్బాక్స్ను సెలెక్ట్ చేసుకోండి.
- ఆధార్ ఆధారిత అథెంటికేషన్ కోసం మీ Aadhaar Number లేదా Virtual ID (VID) ఎంటర్ చేసి వెరిఫై బటన్ నొక్కండి.
- ఇప్పుడు మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరుకు ఒక ఓటీపీ (OTP) వస్తుంది.
- ఆ ఓటీపీని నిర్దేశిత ఖాళీలో ఎంటర్ చేసి Submit బటన్ ప్రెస్ చేయండి.
- ఓటీపీ విజయవంతంగా వెరిఫై అయిన తర్వాత, మీ నామినేషన్ వివరాలు ఈపీఎఫ్ఓ డేటాబేస్లో అధికారికంగా సేవ్ అవుతాయి. దీంతో మీ ఇ-నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లే.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


