...
...
Next Story

పశ్చిమాసియా యుద్ధం: రంగంలోకి 7 సాధికర బృందాలు.. పెట్రోల్, గ్యాస్ కష్టాలకు చెక్

పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తే చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం 7 హై-పవర్ కమిటీలను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు అమలు చేస్తూ, నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Published on: Mar 24, 2026, 20:53:34 IST
Advertisement

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయకుండా కేంద్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతినడం, ధరలు పెరగడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యాచరణ ప్రకటించారు. దీని కోసం ఏడు ప్రత్యేక సాధికార బృందాలను (Empowered Groups) ఏర్పాటు చేసినట్లు ఆయన రాజ్యసభలో వెల్లడించారు.

కోవిడ్ తరహాలోనే ‘యుద్ధ’ ప్రాతిపదికన చర్యలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Sansad TV)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Sansad TV)

గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఏ విధంగానైతే సాధికార బృందాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయో, ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి కూడా అదే తరహా వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది.

"సరఫరా గొలుసు (Supply Chain), పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై ఈ బృందాలు నిరంతరం పనిచేస్తాయి. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రభావాలను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం" అని ప్రధాని స్పష్టం చేశారు.

ఏ బృందం ఏం చేస్తుంది?

ఈ ఏడు బృందాలకు సీనియర్ అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. వీటి బాధ్యతలు ఇలా ఉన్నాయి.

  • వ్యూహాత్మక అంశాలు (Strategic Issues): విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రక్షణ, విదేశీ సంబంధాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది.
  • ఆర్థికం, సరఫరా గొలుసు: ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధ ఠాకూర్ నేతృత్వంలో ఎగుమతులు, దిగుమతులు, ఆర్ధిక స్థిరత్వంపై దృష్టి సారిస్తారు.
  • చమురు, ఇంధనం: పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్, నీరజ్ మిట్టల్ వంటి నిపుణులు చమురు నిల్వలు, గ్యాస్ సరఫరాను పర్యవేక్షిస్తారు.
  • నిత్యావసరాలు: వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ధరల నియంత్రణపై నిఘా ఉంచుతారు.

హార్ముజ్ జలసంధి ముప్పు.. భారత్ అప్రమత్తం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో త్వరగా శాంతి నెలకొనాలని, హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

ప్రజలకు భరోసా: స్టాక్ సరిపడా ఉంది

ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, దేశంలో తగినంత చమురు నిల్వలు ఉన్నాయని ప్రధాని హామీ ఇచ్చారు.

  • భారత్ ప్రస్తుతం 41 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ తన వనరులను విస్తృతం చేసుకుంది.
  • 5.3 మిలియన్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలు (Strategic Reserves) సిద్ధంగా ఉన్నాయి.
  • ఎల్‌పీజీ (LPG) పై ఒత్తిడి తగ్గించేందుకు పైపుల ద్వారా సరఫరా చేసే గ్యాస్ (PNG) వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలకు తక్షణమే పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించింది.
  • గుజరాత్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత వస్తుందన్న పుకార్ల వల్ల ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అయితే, రవాణా ఇంధనాలకు ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈ సాధికార బృందాల వల్ల సామాన్యుడికి కలిగే లాభం ఏమిటి?

యుద్ధం వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు అడ్డగోలుగా పెరగకుండా ఈ బృందాలు చర్యలు తీసుకుంటాయి. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కొరత రాకుండా ఇవి నిరంతరం పర్యవేక్షిస్తాయి.

2. భారత్ దగ్గర ఎన్ని రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి?

ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో దేశ అవసరాలను తీర్చగలవు.

3. గ్యాస్ సరఫరాలో మార్పులు ఏమిటి?

సిలిండర్లపై భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పైపుల ద్వారా వచ్చే గ్యాస్ (PNG) కనెక్షన్లను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా హాస్టళ్లు, సామాజిక వంటశాలలకు ప్రాధాన్యత ఇస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe