India Vs Pakistan : పాక్​ యూ-టర్న్​! ఇండియాతో టీ20 మ్యాచ్​కు​ ఒప్పుకున్నట్టేనా?

టీ20 ప్రపంచకప్​ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్​ ఇప్పుడు యూ-టర్న్​ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఐఐసీ ఘాటు హెచ్చరికల అనంతరం పీసీబీ తన మొండి వైఖరిని పక్కనపెట్టి, మ్యాచ్​ని కొనసాగించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

Published on: Feb 9, 2026, 07:30:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచ కప్​ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్​ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్​.. ఇప్పుడు యూ-టర్న్​ కొట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పీసీబీ (పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు) ఐసీసీ మధ్య ఆదివారం జరిగిన కీలక సమావేశం అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి!. పలు మీడియా కథనాల ప్రకారం.. ఇండియాతో మ్యాచ్​ని బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్​ని ఐసీసీ హెచ్చరించింది. ఇండియాతో టీ20 మ్యాచ్​ని కొనసాగిస్తేనే మంచిదని ఈ భేటీ అనంతరం అనేక మంది పీసీబీ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం.

ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ టీ20 వరల్డ్​ కప్​..
ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ టీ20 వరల్డ్​ కప్​..

ఇదే విషయంపై పీసీబీ సభ్యులు పాక్​ ప్రధాని షెహబాజ్ షరీఫ్​ని మరోసారి సంప్రదించి, తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ టీ20 వరల్డ్​ కప్​ 2026- చర్చల నేపథ్యం..

ఆదివారం ఉదయం పీసీబీ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం లాహోర్ వెళ్లారు. అనంతరం, డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా నేతృత్వంలోని ఐసీసీ బృందం కూడా లాహోర్ చేరుకుని చర్చలు జరిపింది. ఈ చర్చల ఫలితాలు అధికారికంగా వెలువడలేదు. కానీ ఐసీసీ మాత్రం పీసీబీని తీవ్రంగానే హెచ్చరించినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ ఎత్తుగడ- ఐసీసీ స్పందన

చర్చల్లో బంగ్లాదేశ్‌ను కూడా ఒక భాగస్వామిగా ఉంచాలని పాక్ భావించింది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించడంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి టీమిండియాతో ఆడకూడదన్న తమ నిర్ణయానికి కూడా ఇదే కారణం అని పాక్​ ఇప్పటికే పలుమార్లు చెప్పింది.

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రివర్గంతో మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయం "బంగ్లాదేశ్‌కు అండగా నిలవడానికే" అని స్పష్టం చేశారు. ఐసీసీ తన ద్వంద్వ ప్రమాణాలను వీడాలని పాక్ ఆరోపిస్తోంది.

అయితే, ఐసీసీ మాత్రం ఎటువంటి "అసంబద్ధమైన డిమాండ్లను" అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న వాణిజ్య విలువ దృష్ట్యా.. ఒప్పంద పత్రాలను సాక్ష్యంగా చూపుతూ ఐసీసీ పీసీబీపై ఒత్తిడి పెంచింది.

‘ఫోర్స్ మేజ్యూర్’, పరిణామాలు..

ప్రభుత్వ ఆదేశాల వల్ల తాము మ్యాచ్ ఆడలేకపోతున్నామని, దీనిని 'ఫోర్స్ మేజ్యూర్' (ఊహించని అసాధారణ పరిస్థితులు) కింద పరిగణించాలని పీసీబీ కోరింది. దీనికి సమాధానంగా, ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఐసీసీ ప్రశ్నించింది. ఈ పరిణామాల మధ్యే.. చట్టపరంగా తాము బలహీనంగా ఉన్నామని గ్రహించిన పీసీబీ చర్చలకు అంగీకరించింది.

ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే పీసీబీ ఎదుర్కోవాల్సిన నష్టాలు ఇవే:

మ్యాచ్ ఆడకపోవడం వల్ల వచ్చే వాణిజ్య నష్టాలను పీసీబీనే భరించాల్సి ఉంటుంది.

ఐసీసీ ఇచ్చే ఆదాయంలో వాటా కోల్పోవాల్సి వస్తుంది.

ప్రపంచ క్రికెట్ సమాజంలో పాకిస్థాన్ ఒంటరయ్యే ప్రమాదం ఉంది.

ఇండియాతో మ్యాచ్​- పీసీబీ కొత్త డిమాండ్లు..

పాక్ మీడియా సమాచారం ప్రకారం, పీసీబీ ఇప్పుడు కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చే అవకాశం ఉంది:

ఐసీసీ రెవెన్యూలో వాటా పెంపు.

భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ.

టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ (చేతులు కలపడం) వంటి సంప్రదాయాలను పాటించడంపై ప్రశ్నలు.

ఆటగాళ్ల స్పందన..

ఈ ఉత్కంఠ మధ్య ఆటగాళ్లు కూడా అయోమయంలో ఉన్నారు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా దీనిని "ప్రభుత్వ నిర్ణయం" అని పేర్కొనగా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "మా మైండ్‌సెట్ క్లియర్​గా ఉంది. మేము ఆడమని చెప్పలేదు, వారే నిరాకరించారు. మేము విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నాము, కొలంబో వెళుతున్నాము," అని ధీమాగా చెప్పారు.

ఏదేమైనా.. ఫిబ్రవరి 15 సమీపిస్తున్న తరుణంలో ఈ హై-డ్రామ్​ ఇంకొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. పీసీబీ వైఖరిపై ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వస్తూనే ఉంటాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More