...
...
Next Story

రూ. 1కోటి జీతం సంపాదించే భారత టెక్​ ఉద్యోగి వీసాను రద్దు చేసిన అమెరికా!

అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్​లో పాల్గొనేందుకు వెళ్లాలనుకున్న భారత టెక్​ ఉద్యోగికి షాక్​ ఎదురైంది! రూ. 1కోటి సంపాదించే ఆ టెక్​ ఉద్యోగిని కేవలం 3 ప్రశ్నలే అడిగి, వీసా అప్లికేషన్​ని రిజెక్ట్​ చేసి పంపించేశారు.

Published on: Nov 2, 2025, 11:27:00 IST
Advertisement

అమెరికాలో జరిగే ఒక ప్రముఖ టెక్నాలజీ సదస్సులో పాల్గొనాలన్న ఓ భారతీయ సాంకేతిక నిపుణుడి కల నిమిషంలోనే చెదిరిపోయింది! దిల్లీలోని యూఎస్ ఎంబసీలో ఇతని బీ1/బీ2 వీసా ఇంటర్వ్యూ కేవలం మూడు ప్రశ్నలకే ముగిసిపోయింది. ఆ మూడు ప్రశ్నలు అడిగి అతడి వీసాను వెంటనే తిరస్కరించారు అధికారి.

క్లౌడ్ నేటివ్ ప్లాట్‌ఫారమ్‌లపై పనిచేసే ఆ సీనియర్ టెక్నికల్ లీడ్.. తన అనుభవాన్ని పంచుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి సలహాల కోసం సామాజిక మాధ్యమం రెడిట్​ను ఆశ్రయించారు. ఈ పోస్ట్ వెంటనే ఇతర ఐటీ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. ఇంత త్వరగా వీసా ఎందుకు తిరస్కరణకు గురైంది? అర్థం చేసుకోవడానికి వారందా పోస్ట్​ని చూస్తున్నారు.

తన రెడిట్ పోస్ట్‌లో, ఆ టెక్ నిపుణుడు ఇలా రాశారు: “ఈ రోజు దిల్లీలోని యూఎస్ ఎంబసీలో నా బీ1/బీ2 వీసా ఇంటర్వ్యూ జరిగింది. కేవలం మూడు ప్రశ్నలు అడిగి, నిమిషంలోనే నన్ను తిరస్కరించారు. ఏం తప్పు జరిగిందో, తదుపరిసారి ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.”

కాన్సులేట్‌లో ఏం జరిగింది?

దరఖాస్తుదారు ఆ ఇంటర్వ్యూ ప్రక్రియను, వీసా త్వరితగతిన తిరస్కరణకు గురికావడాన్ని వివరించారు. అతని కథనం ప్రకారం, అధికారి అతనిని కేవలం మూడు ప్రశ్నలు మాత్రమే అడిగారు:

ప్రయాణానికి గల కారణం ఏమిటి?

గతంలో ఇతర దేశాలకు ప్రయాణించారా?

అమెరికాలో మీకు ఏదైనా కుటుంబ సభ్యులు లేదా పరిచయస్తులు ఉన్నారా?

అలాగే తాను గతంలో లిథువేనియా, మాల్దీవులు, ఇండోనేషియాకు ప్రయాణించినట్లు ధృవీకరించారు. అయితే, అమెరికాలో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఉన్నారా అని అడిగినప్పుడు "లేదు" అని సమాధానం ఇచ్చారు.

ఇంటర్వ్యూ ముగిసిన కొద్దిసేపటికే అతనికి 214(బి) రిజెక్షన్​ స్లిప్​ ఇచ్చారు.

దరఖాస్తుదారు నేపథ్యం..

వీసా త్వరగా తిరస్కరణకు గురికావడం పట్ల ఆ టెక్ లీడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతదేశానికి తిరిగి రావడానికి తనకు గట్టి కారణాలు ఉన్నాయని, తన వృత్తిపరమైన, వ్యక్తిగత నేపథ్యం పటిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. "నేను గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో స్థిరమైన ఉద్యోగం చేస్తున్నాను. ఏడాదికి దాదాపు కోటి రూపాయల జీతం సంపాదిస్తున్నాను. నాకు ఎనిమిది నెలల కుమార్తె ఉంది. కాబట్టి, భారతదేశానికి తిరిగి రావడానికి నాకు చాలా బలమైన ప్రేరణలు ఉన్నాయి," అని హెచ్‌టీతో మాట్లాడుతూ చెప్పారు.

ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో లేనందున, తాను దీనికి చాలా ముందుగానే సిద్ధమయ్యానని కూడా అతను తెలిపారు. "సదస్సు లైవ్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో లేదు, అందుకే నేను వ్యక్తిగతంగా హాజరు కావడానికి ప్రతిదీ ప్లాన్ చేసుకున్నాను," అని ఆయన పేర్కొన్నారు. అట్లాంటా సదస్సు, హోటల్ గదుల రిజర్వేషన్లు, వివరణాత్మక షెడ్యూల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని కూడా తెలిపారు.

తన తిరస్కరణకు గల కారణాన్ని ఊహించాల్సిందిగా, వీసాకు తిరిగి దరఖాస్తు చేసే ముందు ఏ చర్యలు పాటించాలో సూచించాల్సిందిగా అతను ఇతర రెడిట్ వినియోగదారులను కోరారు.

ఏంటీ ఈ బీ1/బీ2 వీసా?

బీ1 వీసా అనేది సదస్సులు, సమావేశాలు, లేదా ఒప్పందాల చర్చలు వంటి చిన్న వ్యాపార పర్యటనల కోసం ఇసాతారు. బీ1 వీసా ఉన్నవారు అమెరికాలో సంప్రదాయ పద్ధతిలో పనిచేయలేరు. అయితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి అనుమతి ఉంటుంది.

మరోవైపు, బీ2 లేదా టూరిస్ట్ వీసా అనేది పర్యాటకం, విహారయాత్ర లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులను సందర్శించడం వంటి ప్రయోజనాల కోసం ఇస్తారు. ఇది కొన్ని వైద్య చికిత్సలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కూడా కవర్ చేస్తుంది. చాలా సందర్భాలలో, బీ1/బీ2 వీసా రెండూ కలిపి జారీ చేస్తారు. దీనివల్ల వీసా హోల్డర్ వ్యాపారం, పర్యాటకం రెండింటికీ ప్రయాణించడానికి అనుమతి లభిస్తుంది.

అమెరికా​ వీసా అనేది హక్కు కాదు, కేవలం ఒక ప్రత్యేక సదుపాయం అని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ స్పష్టంగా పేర్కొంది. దరఖాస్తుదారు నిజాయితీపరుడు కాదని లేదా నమ్మదగిన వ్యక్తి కాదని అధికారి భావిస్తే, వీసాను తిరస్కరించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఈ నిబంధన కింద.. స్వదేశంతో ఉన్న సంబంధాల్లో చిన్నపాటి పొరపాట్లు లేదా ఆరోపణలు ఉన్నా కూడా దరఖాస్తు రిజెక్ట్​ అవుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe