...
...
Next Story

US crime new : అమెరికాలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపిన భారత సంతతి యువకుడు- చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్!

అమెరికాలోని మసాచుసెట్స్‌లో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల బాలుడు.. తన తల్లిని, తమ్ముడిని హత్య చేశాడు. చాట్‌జీపీటీ సాయంతో ఈ దారుణానికి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Published on: Aug 13, 2026, 10:00:44 IST
Advertisement

అమెరికా మసాచుసెట్స్‌కు చెందిన యాక్టన్ ప్రాంతంలోని ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన 17ఏళ్ల యువకుడు.. తన తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు! స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా తీవ్ర గాలింపు చర్యల అనంతరం పోలీసులు బుధవారం తెల్లవారుజామున నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అమెరికాలో భారత సంతతి మహిళ, కుమారుడి హత్య..
అమెరికాలో భారత సంతతి మహిళ, కుమారుడి హత్య..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధా వెంకటేశన్ (45), ఆమె చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ (14)లను హత్య చేసినట్లు ఆరోపిస్తూ 17 ఏళ్ల అర్జున్ అరవింద్‌పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు రెండు కేసులు, అనుమతి లేకుండా వాహనాన్ని వాడటం, మోటార్ వాహనం దొంగిలించడం వంటి పలు తీవ్రమైన అభియోగాలు మోపారు.

నేరం ఎలా జరిగింది?

యాక్టన్-బాక్స్‌బరో రీజినల్ హైస్కూల్‌లో చదువుతున్న అర్జున్, మంగళవారం తన ఇంటిలోపల.. తల్లిని, తమ్ముడిని దారుణంగా దాడి చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం తన తల్లికి చెందిన హోండా అకార్డ్ కారులో అక్కడి నుంచి పరారయ్యాడు.

బోస్టన్‌కు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్తా లేన్‌లోని వారి ఇంట్లో ఈ హత్యలు జరిగాయని మిడిల్‌సెక్స్ జిల్లా అటార్నీ మారియన్ రయాన్, యాక్టన్ పోలీస్ చీఫ్ డగ్లస్ స్టర్నియోలో వెల్లడించారు.

మంగళవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ట్యూటర్ ఒకరు ఆ కుటుంబం ఇంటికి చేరుకుంది. కానీ ఎంత తలుపు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో, ఆమె అర్జున్ తండ్రికి ఫోన్ చేసింది. ఆయన ఎంత ప్రయత్నించినా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో ఆయన యాక్టన్ పోలీస్ శాఖను సంప్రదించి, ఇంటి వద్దకు వెళ్లి అంతా క్షేమంగా ఉందో లేదో తనిఖీ చేయాలని కోరారు.

మిడిల్‌సెక్స్ జిల్లా అటార్నీ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లోపలికి వెళ్లి చూడగా సుధా వెంకటేశన్, సిద్ధార్థ్ విగతజీవులుగా పడి ఉన్నారు. సుధా వెంకటేశన్ మృతదేహం ఇంటి బేస్‌మెంట్‌లో లభించగా, ఆమె కుమారుడు సిద్ధార్థ్ మృతదేహం మొదటి అంతస్తులో పడి ఉంది.

ఇద్దరు బాధితుల శరీరంపై స్పష్టమైన గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతికి అసలు కారణం ఏంటి? ఏ పద్ధతిలో హత్య చేశారు? అనే పూర్తి వివరాలను చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ఈ హత్యలకు ఏ రకమైన ఆయుధాన్ని ఉపయోగించారనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.

పోలీసుల గాలింపుతో అరెస్ట్..

పరారీ అనంతరం అర్జున్ ఆచూకీ కోసం దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మొదట్లో ఎలాంటి ఫలితం రాలేదు. బుధవారం తెల్లవారుజామున మసాచుసెట్స్‌లోని వేలాండ్ పోలీసులు ఒక పార్కింగ్ స్థలంలో వేరే విషయానికి సంబంధించి వచ్చిన అలారమ్ కోసం వెళ్లగా.. అక్కడ అర్జున్ ఉన్న కారు కనిపించింది. పోలీసులు ఎలాంటి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ప్రతిఘటించలేదు.

చాట్‌జీపీటీ హిస్టరీ వెలుగులోకి..

“అర్జున్ అరవింద్ ఇటీవల ఆందోళనకరమైన ప్రవర్తనను ప్రదర్శించినట్లు ఈ ఘటనపై జరిగిన తదుపరి దర్యాప్తులో తేలింది. తన కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే దానిపై ఇంటర్నెట్‌లో, చాట్‌జీపీటీలో రకరకాల సిద్ధాంతాలు, ఫాంటసీల కోసం వెతికాడు,” అని మిడిల్‌సెక్స్ కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

అంతేకాకుండా 'గోథిక్ నవల' తరహా కథలను సృష్టించడంలో సహాయం చేయమని, కొన్ని ప్రశ్నలు అడుగుతూ వివిధ పాత్రలను సృష్టించమని అర్జున్ ఆ ఏఐ చాట్‌బాట్‌ను అడిగినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

అర్జున్‌ను బుధవారం లోవెల్ జువెనైల్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే జువెనైల్ కోర్టుకు హత్య అభియోగాలపై విచారణ జరిపే అధికారం లేనందున, ఆ హత్య కేసు. దానికి సంబంధించిన దాడి కేసులపై తదుపరి కోకార్డ్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరగనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe