పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ దేశాల నుంచి దాడి జరిగితే మాత్రం వదిలేది లేదు.. అధ్యక్షుడి వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి పొరుగు దేశాలపై జరిగిన దాడులకు క్షమాపణలు చెబుతూనే.. తమపై దాడుల కోసం ఆ దేశాల భూభాగాన్ని ఉపయోగిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Published on: Mar 07, 2026 2:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా, ఇజ్రాయెల్‌లతో భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ వ్యూహాత్మక అడుగు వేసింది. పొరుగు దేశాలతో అనవసర శత్రుత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి ప్రాంతీయ దేశాలపై జరిగిన దాడులకు ఆయన క్షమాపణలు చెప్పారు.

పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ దేశాల నుంచి దాడి జరిగితే మాత్రం.. (via REUTERS)
పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ దేశాల నుంచి దాడి జరిగితే మాత్రం.. (via REUTERS)

క్షమాపణలు.. హెచ్చరికలు

గత వారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన 'మధ్యంతర నాయకత్వ మండలి' (Interim Leadership Council) పొరుగు దేశాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది.

"పొరుగు దేశాలపై దాడులు చేయకూడదని, క్షిపణులు ప్రయోగించకూడదని నిర్ణయించాం. అయితే, ఆ దేశాల భూభాగం నుంచి ఇరాన్‌పై దాడులు జరిగితే మాత్రం మేము ఊరుకోం. దాడులకు సహకరించే దేశాలే లక్ష్యంగా మా ప్రతిస్పందన ఉంటుంది" అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, గతంలో జరిగిన దాడులు కేవలం కింది స్థాయి అధికారుల మధ్య జరిగిన కమ్యూనికేషన్ లోపం వల్ల సంభవించాయని ఆయన వివరించారు.

ట్రంప్ డిమాండ్‌పై నిప్పులు

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన 'బేషరతు లొంగుబాటు' (Unconditional Surrender) వ్యాఖ్యలపై పెజెష్కియాన్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ కలలు కంటున్నారని, ఆ కలను ఆయన తన సమాధితో పాటే తీసుకువెళ్లాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.

అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి. ఆ తర్వాత ఆ దేశానికి ఒక మంచి నాయకత్వాన్ని మేమే ఎంపిక చేస్తాం. అప్పుడే ఇరాన్ ఆర్థికంగా పుంజుకునేలా మేము సహకరిస్తాం" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీని 'లైట్ వెయిట్' అని అభివర్ణించిన ట్రంప్, కొత్త నాయకుడి ఎంపికలో తన ప్రమేయం ఉండాలని వ్యాఖ్యానించారు.

విదేశీ జోక్యం వద్దు: ఇరాన్ రాయబారి

ట్రంప్ వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ తీవ్రంగా ఖండించారు. తమ దేశ అంతర్గత విషయాల్లో ఏ విదేశీ శక్తినీ తలదూర్చనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఆయుధాల ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచాలని రక్షణ శాఖ అధికారులతో ట్రంప్ చర్చించిన నేపథ్యంలో, యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

యుద్ధం మిగిల్చిన విషాదం

ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో ఇరాన్‌లో ఇప్పటివరకు 1,230 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో 200 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో డజను మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆరుగురు అమెరికా సైనికులు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం కూడా బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More