Iran War : 14 రోజుల్లోనే 50 లక్షల టన్నుల విషవాయువుల విడుదల.. పర్యావరణానికి పెను ముప్పు!

Iran war update : గడిచిన రెండు వారాలుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు కేవలం ప్రాణ, ఆస్తి నష్టమే కాకుండా పర్యావరణానికి కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి! కేవలం 14 రోజుల్లోనే 50 లక్షల టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలయ్యాయని తాజా నివేదిక వెల్లడించింది.

Published on: Mar 23, 2026, 09:10:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం పర్యావరణానికి పెను శాపంగా మారుతోంది! భూగోళాన్ని వేడెక్కిస్తోంది. క్లైమేట్ ఫోకస్డ్ అనాలిసిస్ ప్రకారం.. గత రెండు వారాల్లోనే ఈ యుద్ధం కారణంగా 50 లక్షల టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యాయి. బాంబుల మోత, క్షిపణి దాడులు ప్రపంచానికి హాని చేస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమాసియాలోని ఒక ప్రాంతంలో ఇలా.. (AFP)
పశ్చిమాసియాలోని ఒక ప్రాంతంలో ఇలా.. (AFP)

భవనాల విధ్వంసమే అతిపెద్ద శత్రువు!

ఈ ఉద్గారాలకు ప్రధాన కారణం పౌర నివాసాల విధ్వంసం. ఇరాన్ రెడ్ క్రెసెంట్ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 20,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భవనాల కూల్చివేత, తదనంతర పరిణామాల వల్ల సుమారు 24 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన (tCO2e) వాయువులు విడుదలయ్యాయి. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తోంది.

ఆయిల్ ప్లాంట్లపై దాడులు.. యాసిడ్ వర్షాలు..

టెహ్రాన్, ఇతర ప్రాంతాల్లోని చమురు క్షేత్రాలపై జరిగిన దాడులు పర్యావరణాన్ని మరింత కలుషితం చేశాయి. దాదాపు 25 లక్షల నుంచి 59 లక్షల బ్యారెళ్ల చమురు ఈ దాడుల్లో కాలిపోయింది. దీనివల్ల 18.8 లక్షల టన్నుల tCO2e విడుదల కావడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో విషపూరితమైన 'యాసిడ్ వర్షాలు' కురిసేలా చేశాయి! ఇది లక్షలాది మంది ఆరోగ్యానికి ముప్పుగా మారింది.

గాలిలో 'కార్బన్' నింపుతున్న యుద్ధ విమానాలు..

అమెరికాకు చెందిన భారీ బాంబర్లు, ఫైటర్ జెట్లు నిరంతరం వినువీధిలో చక్కర్లు కొట్టడం ఈ ఉద్గారాల్లో రెండో అతిపెద్ద వాటాగా నిలిచింది. ఇంగ్లాండ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు గత 14 రోజుల్లో సుమారు 15 కోట్ల నుంచి 27 కోట్ల లీటర్ల ఇంధనాన్ని వినియోగించాయి. తద్వారా 5.29 లక్షల టన్నుల tCO2e వాతావరణంలోకి చేరింది.

లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన బెంజమిన్ నేమార్క్ దీనిపై స్పందిస్తూ, "యుద్ధ నౌకలు ‘ఫ్లోటింగ్ సిటీస్’ వంటివి. అక్కడ ఉండే వేలాది మంది సైనికులకు ఆహారం, వసతి, విద్యుత్ కోసం భారీగా శక్తిని వినియోగించాల్సి వస్తుంది. ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది," అని వివరించారు.

నష్టపోయిన సైనిక సామగ్రి..

యుద్ధంలో ధ్వంసమైన సైనిక పరికరాల వల్ల కూడా కార్బన్ ఉద్గారాలు పెరిగాయి.

అమెరికా నష్టం: 4 యుద్ధ విమానాలు.

ఇరాన్ నష్టం: 28 యుద్ధ విమానాలు, 21 యుద్ధ నౌకలు, సుమారు 300 క్షిపణి లాంచర్లు.

ఈ విధ్వంసం వల్ల మరో 1.72 లక్షల టన్నుల tCO2e విడుదలయింది.

కువైట్ వంటి దేశాల వార్షిక ఉద్గారాలతో సమానం..

ఈ 14 రోజుల యుద్ధం వల్ల విడుదలైన 5,055,016 టన్నుల tCO2e అనేది కువైట్ లేదా ఐస్లాండ్ వంటి దేశాల మొత్తం వార్షిక ఉద్గారాలతో సమానం.

"ప్రతి క్షిపణి దాడి భూగోళాన్ని మరింత అస్థిరంగా, వేడెక్కేలా చేస్తోంది. ఇది ఎవరికీ రక్షణనివ్వదు," అని క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన డైరెక్టర్ పాట్రిక్ బిగ్గర్ హెచ్చరించారు.

మరోవైపు, పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధం వల్ల ఇప్పటికే 3.3 కోట్ల టన్నుల CO2e విడుదలైనట్లు 'వన్ ఎర్త్' పరిశోధన పేర్కొంది. శిలాజ ఇంధనాల కోసం జరిగే రాజకీయ యుద్ధాలు జీవించదగ్గ గ్రహాన్ని నాశనం చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. యుద్ధం వల్ల పర్యావరణంపై పడే ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితమా?

కాదు. యుద్ధం వల్ల విడుదలయ్యే గ్రీన్‌హౌస్ వాయువులు (CO2 వంటివి) వాతావరణంలో కలిసిపోయి భూగోళం మొత్తం వేడెక్కడానికి (Global Warming) కారణమవుతాయి. అయితే, చమురు క్షేత్రాల దాడుల వల్ల వచ్చే 'యాసిడ్ వర్షాలు', విషపూరితమైన పొగ మాత్రం యుద్ధం జరుగుతున్న ప్రాంతం, దాని పొరుగు దేశాలపై తక్షణ ప్రభావం చూపుతాయి. ఇది గాలి నాణ్యతను దెబ్బతీసి లక్షలాది మందికి శ్వాసకోస సమస్యలను కలిగిస్తుంది.

2. 14 రోజుల్లోనే 50 లక్షల టన్నుల ఉద్గారాలు అంటే అది ఎంతటి తీవ్రమైన విషయం?

ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ప్రపంచంలోని 84 చిన్న దేశాలు కలిసి ఒక ఏడాదిలో ఎంత కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయో, ఈ యుద్ధం కేవలం రెండు వారాల్లోనే అంత మొత్తాన్ని విడుదల చేసింది. ఒక మధ్యస్థాయి దేశం (ఉదాహరణకు కువైట్ లేదా ఐస్లాండ్) ఏడాది పొడవునా పారిశ్రామికంగా విడుదల చేసే కాలుష్యంతో ఇది సమానం. అంటే, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రపంచ దేశాలు పడుతున్న శ్రమను ఇటువంటి యుద్ధాలు కొద్ది రోజుల్లోనే బూడిద చేస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More