Indians in Gulf : దుబాయ్, ఖతార్లో చిక్కుకుపోయారా? గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు హై అలర్ట్!
Indians in Dubai : ఇరాన్, ఇజ్రయెల్- అమెరికా మధ్య అనిశ్చితి ముదురుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు అక్కడి రాయబారా కార్యాలయాలు కీలక సూచనలను జారీ చేశాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలోని 14 గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయాలు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశాయి. గగనతలం మూసివేత, ప్రయాణ ఆంక్షల వల్ల తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
ఖతార్లోని భారత రాయబార కార్యాలయం తన తాజా ప్రకటనలో, భారతీయులు స్థానిక ఆదేశాలను పాటించాలని, గగనతలం ఇంకా మూసివేసి ఉన్నందున ప్రయాణాలను నివారించాలని కోరింది.
14 గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు అలర్ట్స్ ఇవి..
ఆదేశాలను పాటించండి-
ఖతార్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులను వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించాలని కోరింది.
"భారతీయ సమాజం ఖతార్ అధికారులు అధికారిక ఛానెళ్ల ద్వారా జారీ చేసే వార్తలు, మార్గదర్శకాలను నిశితంగా అనుసరించాలని కోరుతున్నాము. నివాసితులు కేవలం ధృవీకరించి, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి," అని పేర్కొంది. అబుదాబీ, దుబాయ్లోని భారత ఎంబసీలు కూడా ఇవే రకమైన ఆదేశాలను జారీ చేస్తూ స్థానిక మార్గదర్శకాలను అనుసరించాలని కోరాయి.
ఇళ్లలోనే ఉండండి -
యుద్ధం కారణంగా ఈ 14 దేశాలపై డ్రోన్లు, క్షిపణుల దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున, భారతీయులందరూ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరాయి.
సోమవారం నాడు ఒక అమెరికా యుద్ధ విమానం పొరపాటున 'ఫ్రెండ్లీ ఫైర్'లో కూలిపోవడం అక్కడి అనిశ్చితికి నిదర్శనం.
"ప్రజా భద్రత దృష్ట్యా ఇళ్లలో లేదా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు," అని ఎంబసీ తెలిపింది.
ప్రయాణాలు వద్దు-
గగనతలం మూసివేసి ఉండటం, విమాన సర్వీసులు పరిమితంగా ఉన్నందున ప్రయాణాలను నివారించడం మంచిది. దుబాయ్ విమానాశ్రయం కార్యకలాపాలను ప్రారంభించినప్పటికీ, ఖతార్ గగనతలం ఇంకా మూసివేసే ఉంది. "ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ గగనతలం మూసివేతను ధృవీకరించింది. దీనివల్ల హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గగనతలం పునరుద్ధరణ తర్వాతే ఇవి ప్రారంభమవుతాయి. ప్రయాణీకులు విమానాశ్రయానికి రావద్దు," అని ఖతార్లోని భారత ఎంబసీ సూచించింది.
Oil prices : ప్రపంచానికి 'చమురు' సెగ! బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుతుందని ఇరాన్ హెచ్చరిక!
అధికారుల సహాయం పొందండి-
భారతీయులు అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించడానికి ఫోన్, ఈమెయిల్, వాట్సాప్ నంబర్లను ఎంబసీలు విడుదల చేశాయి.
ఖతార్ (దోహా) హెల్ప్లైన్:
- 24/7 హెల్ప్లైన్: +974-55647502
- ఈమెయిల్: cons.doha@mea.gov.in
అబుదాబీ (యూఏఐ) హెల్ప్లైన్:
- టోల్ ఫ్రీ నంబర్: 800-46342
- వాట్సాప్: +971543090571
- ఈమెయిల్: pbsk.dubai@mea.gov.in , ca.abudhabi@mea.gov.in
కాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం పలు గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడి, చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. ప్రస్తుత పరిస్థితుల్లో విమాన ప్రయాణాల పరిస్థితి ఏంటి? నా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయితే నేను ఏం చేయాలి?
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల గగనతలం అనిశ్చితంగా ఉంది. ఖతార్ వంటి దేశాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దుబాయ్ వంటి చోట్ల పరిమితంగా సేవలు అందుతున్నాయి.
మీరు చేయాల్సింది: విమానాశ్రయానికి బయలుదేరే ముందే మీ ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ను సంప్రదించి ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోండి.
టికెట్ క్యాన్సిలేషన్: ఒకవేళ గగనతలం మూసివేత వల్ల విమానం రద్దయితే, చాలా ఎయిర్లైన్స్ ఉచితంగా రీ-షెడ్యూల్ లేదా రిఫండ్ ఆప్షన్లను ఇస్తాయి. వీటి వివరాల కోసం నేరుగా ఎయిర్లైన్ ప్రతినిధులను సంప్రదించండి. ఎంబసీ సూచన మేరకు.. గగనతలం తెరిచే వరకు విమానాశ్రయాలకు వెళ్లవద్దు.
2. ఎంబసీ జారీ చేసిన హెల్ప్లైన్ నంబర్లు పని చేయకపోతే లేదా లైన్ కలవకపోతే ప్రత్యామ్నాయం ఏమిటి?
యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో హెల్ప్లైన్ నంబర్లకు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి కాల్స్ కలవకపోవచ్చు. అటువంటప్పుడు ఈ కింది మార్గాలను అనుసరించండి:
సోషల్ మీడియా: భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) లేదా స్థానిక భారత రాయబార కార్యాలయాల అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) లేదా ఫేస్బుక్ పేజీలను సందేశం (డీఎం) పంపడానికి ఉపయోగించండి.
ఈమెయిల్: పైన పేర్కొన్న అధికారిక ఈమెయిల్ ఐడీలకు మీ సమస్యను, పాస్పోర్ట్ వివరాలు, కాంటాక్ట్ నంబర్తో సహా పంపండి.
మదద్ పోర్టల్: భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'MADAD' పోర్టల్ ద్వారా మీ ఫిర్యాదును లేదా సహాయం కోరుతూ రిజిస్టర్ చేయవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


