...
...
Next Story

Is Netanyahu dead : ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు హతం? ఇరాన్​ మీడియా సంచలన కథనం..

Netanyahu Israel : ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు ఆచూకీపై ఇరాన్ వార్తా సంస్థ 'తస్నీమ్' సంచలన కథనాన్ని ప్రచురించింది. గత కొన్ని రోజులుగా ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో, ఇటీవల జరిగిన దాడుల్లో ఆయన మరణించి ఉండవచ్చని ఈ నివేదిక పేర్కొంది.

Published on: Mar 11, 2026, 06:45:38 IST
Advertisement

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు క్షేమ సమాచారంపై తీవ్ర సంచలనం రేగుతోంది. ఇరాన్ సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ ‘తస్నీమ్’ ప్రచురించిన ఒక బాంబు లాంటి వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల్లో నెతన్యాహు మరణించి ఉండవచ్చని లేదా ఆయనకు తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉందని ఆ కథనం పేర్కొంది. అదే సమయంలో నెతన్యాహు ఎక్కడా కనిపించకపోవడం, ఈ కథనానికి బలం చేకూరుస్తోంది!

అసలేం ఏం జరుగుతోంది?

ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు..
ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు..

సాధారణంగా నెతన్యాహు ప్రతిరోజూ వీడియో సందేశాల ద్వారా ప్రజల ముందుకు వస్తుంటారు. కానీ గత నాలుగు, ఐదు రోజులుగా ఆయన ఎక్కడా కనిపించకపోవడం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.

కేవలం రాతపూర్వక ప్రకటనలే: నెతన్యాహు అదృశ్యమైనప్పటి నుంచి ఆయన పేరుతో విడుదలవుతున్న ప్రకటనలన్నీ కేవలం రాతపూర్వక రూపంలోనే ఉన్నాయి. కనీసం ఒక్క ఫోటో లేదా వీడియో కూడా బయటకు రాకపోవడం గమనార్హం.

భారీ భద్రత: ప్రధాని నివాసం చుట్టూ మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం ఈ మిస్టరీని మరింత పెంచుతోంది.

మరికొందరు కీలక నేతలు: నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ మితవాద జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్వీర్, నెతన్యాహు సోదరుడు ఇద్దో కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తస్నీమ్ నివేదిక ఆరోపిస్తోంది. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.

అమెరికా ప్రతినిధుల పర్యటన రద్దు..

ఇరాన్ మీడియా ఇంతటి సంచలన వార్తను ప్రచురించినప్పటికీ, నెతన్యాహు కార్యాలయం కానీ, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు కానీ దీనిని ఖండించకపోవడం ఆశ్చర్య కలిగిస్తోంది.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర యుద్ధంలో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీ సహా 1,200 మందికి పైగా మరణించగా, తాజాగా నెతన్యాహుపై వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో హిజ్బుల్లాతో, యెమెన్‌లో హూతీలతో యుద్ధం తీవ్రమైంది. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 2,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. నెతన్యాహు ఆచూకీపై అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ ఉత్కంఠకు తెరపడేలా లేదు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా ఎందుకు దాడులు చేశాయి?

ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులకు ప్రధానంగా మూడు కారణాలను పేర్కొన్నాయి:

అణు కార్యక్రమం: ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేస్తోందని, దీనివల్ల ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ ఆ దేశ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

క్షిపణి సామర్థ్యం: యూరప్- అమెరికా భూభాగాలను చేరుకోగల దీర్ఘశ్రేణి క్షిపణులను ఇరాన్ అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం.

ప్రాంతీయ భద్రత: హమాస్, హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపులకు ఇరాన్ అందిస్తున్న మద్దతును దెబ్బతీయడం ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకోవడం.

2. ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన రాజకీయ లక్ష్యం ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ ఆపరేషన్‌కు 'ఎపిక్ ఫ్యూరీ', ‘రోరింగ్ లయన్’ అని పేర్లు పెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ఇరాన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమే కాకుండా, ఆ దేశంలో “ప్రభుత్వ మార్పు” తీసుకురావడం. ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని, ఇదే వారికి లభించిన అరుదైన అవకాశం అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe