...
...
Next Story

Karnataka bandh today : నేడు కర్ణాటక బంద్- ఏవి ఓపెన్? ఏవి క్లోజ్? పూర్తి వివరాలు..

Bengaluru Bandh : తమిళనాడుకు కావేరి నీటి విడుదల నిరసిస్తూ కర్ణాటకలో ఇవాళ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బంద్ కొనసాగనుండగా.. రవాణా, పాఠశాలలు, అత్యవసర సేవలపై ప్రభావం గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 13, 2026, 09:10:23 IST
Advertisement

తమిళనాడుకు కావేరి నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటకలో కన్నడ కార్యకర్తలు, వివిధ సంస్థలు గురువారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే రెండు దక్షిణ రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులను దిగ్బంధిస్తామని ఆందోళనకారులు తీవ్రంగా హెచ్చరించారు.

కర్ణాటకలో నేడు బంద్- కారణం ఏంటి?
కర్ణాటకలో నేడు బంద్- కారణం ఏంటి?

ఈ 12 గంటల బంద్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా అమల్లో ఉంటుంది. బంద్ నిర్వహణపై తొలుత కన్నడ అనుకూల సంఘాల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, షెడ్యూల్ ప్రకారమే గురువారం కర్ణాటక బంద్ కచ్చితంగా జరుగుతుందని ఉద్యమకారుడు వాటల్ నాగరాజ్ స్పష్టం చేశారు. బంద్ అనంతరం, భవిష్యత్తు కార్యాచరణపై అన్ని సంస్థలు త్వరలోనే సమావేశమై నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.

“బెళగావి నుంచి చామరాజనగర్ వరకు, మంగళూరు నుంచి కోలార్ వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం 2,000 పైగా సంస్థలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. విద్యార్థులు కూడా తమ సంఘీభావం ప్రకటించారు,” అని వాటల్ నాగరాజ్ పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

“బంద్‌కు ఎవరూ వ్యతిరేకత తెలపలేదు, అందరూ మద్దతు ఇస్తున్నారు. మా (కన్నడ సంఘాలు, కార్యకర్తల) మధ్య ఎలాంటి విభేదాలు లేవు,” అని ఆయన స్పష్టం చేశారు.

కర్ణాటక బంద్- ఏ సేవలు ప్రభావితం అవుతాయి?

కర్ణాటక బంద్​ కారణంగా బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజా రవాణా, ట్యాక్సీలు, ఆటోరిక్షా సేవలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వీటితో పాటు హోటళ్లు, దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు కూడా మూతపడే ఛాన్స్ ఉంది.

మరీ ముఖ్యంగా బెంగళూరు నగరంపై ఈ బంద్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆందోళనకారులు అనేక ప్రధాన రహదారులను దిగ్బంధించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కార్యాలయాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి.

అదే సమయంలో ఆసుపత్రులు, ఫార్మసీలు, బ్యాంకుల వంటి అత్యవసర సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా పనిచేస్తాయి.

కర్ణాటక బంద్- పాఠశాలలు తెరిచి ఉంటాయా?

తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేయాలని కావేరి వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఇచ్చిన ఆదేశాలను కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమర్థించడంతో ఈ బంద్‌కు పిలుపునిచ్చారు.

తమ రిజర్వాయర్లలో నీటి నిల్వ తక్కువగా ఉందని పేర్కొంటూ కర్ణాటక ప్రారంభంలో పొరుగు రాష్ట్రానికి నీటిని విడుదల చేయలేమని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత కర్ణాటకలోని క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రం కావేరి నీటిని విడుదల చేయడం ప్రారంభించింది.

ఈ ఆందోళనకారులు మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “మేకెదాటు ప్రాజెక్ట్ లేకపోతే భవిష్యత్తులో బెంగళూరు తాగునీటి కొరతను ఎదుర్కొంటుంది. అప్పుడు బెంగళూరు ప్రజలు ఏం చేస్తారు? బెంగళూరులో తమిళం, ఇతర భాషలు మాట్లాడే ప్రజలు కూడా నివసిస్తున్నారు, నీరు లేకపోతే మీరు ఏం చేస్తారు?” అని వాటల్ నాగరాజ్ ప్రశ్నించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe