...
...
Next Story

కైట్​ మాంజా కోసుకుని వ్యక్తి మృతి- చివరి క్షణాల్లో కూతురితో మాట్లాడాలని..

సంక్రాంతి వేళ గాలిపటం దారం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కర్ణాటకలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి గొంతుకు దారం చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మరణించారు. ప్రాణాపాయ స్థితిలో ఆయన తన కూతురికి ఫోన్ చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.

Published on: Jan 14, 2026 05:01 PM IST
Advertisement

పండుగ వేళ గాలిపటాల సరదా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది! ప్రాణాంతకమైన గాలిపటం దారం (మాంజా) మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కర్ణాటకలో బైక్‌పై వెళుతున్న ఓ 48 ఏళ్ల వ్యక్తి గొంతుకు గాలిపటం దారం చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయారు.

అసలేం జరిగిందంటే?

మాంజా కోసుకుని వ్యక్తి మృతి..
మాంజా కోసుకుని వ్యక్తి మృతి..

కర్ణాటకలోని బీదర్ జిల్లా తలమడగి బ్రిడ్జి సమీపంలో ఈ ఘోరం జరిగింది. సంజుకుమార్ హోసమణి అనే వ్యక్తి తన బైక్‌పై వెళుతుండగా, రోడ్డుకు అడ్డంగా ఉన్న గాలిపటం దారం ఒక్కసారిగా ఆయన గొంతుకు చుట్టుకుంది. దారం బలంగా లాగడంతో గొంతు లోతుగా తెగిపోయి తీవ్ర రక్తస్రావం మొదలైంది. బైక్ పైనుంచి కిందపడిపోయిన బాధితుడు సంజుకుమార్, మృత్యువుతో పోరాడుతూనే తన కూతురికి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. ఒళ్లంతా రక్తంతో తడిసిపోయి, వణుకుతున్న చేతులతో ఆయన ఫోన్ డయల్ చేస్తున్న దృశ్యాలు చూసేవారిని కలిచివేస్తున్నాయి.

అదే దారిలో వెళుతున్న ఒక వ్యక్తి ఇది చూసి వెంటనే స్పందించారు. గాయం నుంచి రక్తం రాకుండా గుడ్డతో అదిమి పట్టి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ, అది సమయానికి చేరుకోలేదు.

ఆ అంబులెన్స్ వచ్చేలోపే సంజుకుమార్ కన్నుమూశారు.

అధికారుల నిర్లక్ష్యంపై నిరసన..

అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే సంజుకుమార్ బతికేవారని ఆయన బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణం సంభవించిందని ఆరోపిస్తూ ప్రమాదం జరిగిన చోట స్థానికులు నిరసన చేపట్టారు. ప్రాణాంతకమైన నైలాన్ మాంజా వాడకాన్ని అరికట్టాలని, అత్యవసర సేవలను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు.

సరదా కాదు.. చావు దారం!

సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరేయడం మన సంప్రదాయం. పూర్వం గాజు పొడి పూసిన నూలు దారాలను వాడేవారు. కానీ, గత కొన్నేళ్లుగా వాటి స్థానంలో నైలాన్ దారాలు (చైనీస్ మాంజా) వచ్చాయి. తక్కువ ధర, ఎక్కువ బలం ఉండటంతో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ దారాలు తెగవు, పైగా చర్మాన్ని కోసేంత పదునుగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లైఓవర్లు, రోడ్లపై వెళ్లే బైకర్లకు ఇవి కనిపించవు. వాహనం వేగంగా ఉన్నప్పుడు ఈ దారాలు తగిలితే మెడ తెగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తాజా ఘటన మరోమారు నిరూపించింది.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మరణాలు..

ఈ వారంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రఘువీర్ ధాకర్ (45) అనే వ్యక్తి ఇదే విధంగా గొంతుకు మాంజా కోసుకుపోయి మరణించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాంతకమైన చైనీస్ మాంజా వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దిల్లీలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే నమోదయ్యాయి.

2025 జులైలో దిల్లీకి చెందిన యష్ గోస్వామి (22) అనే వ్యాపారి ఫ్లైఓవర్‌పై వెళుతుండగా గొంతు కోసుకుని చనిపోయారు.

2023లో పశ్చిమ విహార్‌లో ఏడేళ్ల చిన్నారి ఇదే మాంజాకు బలైంది.

2022లో హైదర్ పూర్ ఫ్లైఓవర్‌పై మరో బైకర్ ప్రాణాలు కోల్పోయారు.

అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేసి మాంజాను సీజ్ చేస్తున్నా, ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ప్రజలు అవగాహన పెంచుకుని, ఇలాంటి ప్రాణాంతకమైన దారాలను వాడకపోవడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe