Kia Syros EV : 526 కి.మీ రేంజ్, 7 వేరియంట్లు- కియా సైరోస్ ఈవీ వచ్చేసింది..
Kia Syros EV range : భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ సరికొత్త ‘సైరోస్ ఈవీ’ ఎస్యూవీని కియా ఇండియా ఆవిష్కరించింది. కేవలం రూ. 25,000 టోకెన్ అమౌంట్తో ఈ మోడల్ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. పూర్తి వివరాలు..
సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'కియా సైరోస్ ఈవీ'ని భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది కియా మోటార్స్. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ప్రీ-బుకింగ్స్ను కూడా ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఈవీని సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఈవీ వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేలా కియా దీనిని తీర్చిదిద్దింది.
కియా సైరోస్ ఈవీ- రేంజ్ అదిరింది..!
ఈ కియా సైరోస్ ఈవీని సంస్థ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కస్టమర్ల ముందుకు తెచ్చింది. బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా వీటిని ఎంచుకోవచ్చు.
42 kWh బ్యాటరీ ప్యాక్: ఇది సింగిల్ ఛార్జ్పై ఏఆర్ఏఐ సర్టిఫైడ్ 443 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
51.4 kWh బ్యాటరీ ప్యాక్: లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వారి కోసం రూపొందించిన ఈ బ్యాటరీ ప్యాక్, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 526 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్తో నడిచే ఈ కారు ఏకంగా 170 బీహెచ్పీ పవర్ని విడుదల చేస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగానూ ఈ కారు దూసుకెళ్తుంది. పెద్ద బ్యాటరీ కలిగిన 51.4 kWh వేరియంట్ కేవలం 8.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కియాకు చెందిన అధునాతన 'కే1 ప్లాట్ఫారమ్' ఆధారంగా నిర్మించిన ఈ కారులో లిక్విడ్-కూల్డ్ థర్మల్ మేనేజ్మెంట్తో కూడిన ఐపీ67 రేటెడ్ నికెల్ మాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీని ఉపయోగించారు.
కియా సైరోస్ ఈవీ- 39 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్!
ఈవీ వాహనదారులకు పెద్ద సమస్య ఛార్జింగ్ సమయం. ఈ సమస్యకు కియా సైరోస్ ఈవీ అద్భుతమైన పరిష్కారం చూపుతోంది. ఈ కారు 100 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కేవలం 39 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవడం కోసం 10.8 kW ఆన్బోర్డ్ ఏసీ ఛార్జర్ను కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐ-పెడల్, వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కారు కొనుగోలుదారుల కోసం కియా లైఫ్టైమ్ హై-వోల్టేజ్ బ్యాటరీ వారంటీ, అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్తో పాటు వినూత్నమైన 'బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్' (బీఏఏఎస్) ఆప్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
కియా సైరోస్ ఈవీ- అదిరే ఇంటీరియర్..
ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగాన్ని అత్యంత విలాసవంతంగా, డిజిటల్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. ఇందులో 30 అంగుళాల భారీ 'ట్రినిటీ పనోరమిక్ డిస్ప్లే' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
"ఈ 30 అంగుళాల డిస్ప్లే ప్యానల్లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్ప్లే కలిసి ఉంటాయి," అని కంపెనీ ప్రతినిధులు వివరించారు.
వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు 95 పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు కలిగిన 'కియా కనెక్ట్ 2.0' దీని సొంతం. ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు హర్మాన్ కార్డన్ 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, 16 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్లను జోడించారు.
కియా సైరోస్ ఈవీ- లెవెల్ 2 అడాస్ సేఫ్టీ..
భద్రత విషయంలో కియా ఎక్కడా రాజీ పడలేదు. డ్రైవింగ్ను మరింత సురక్షితం చేయడానికి 16 రకాల అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫంక్షన్లు గల 'లెవెల్ 2 అడాస్' ఫీచర్ను ఇందులో చేర్చారు. స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ప్రమాదాలను నివారిస్తాయి. ఇవి కాకుండా ప్రమాణికంగా 6 ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్లు, 360-డిగ్రీల కెమెరా వంటి పటిష్టమైన భద్రతా వలయాన్ని కల్పించారు.
మొత్తంగా ఏడు వేరియంట్లు (హెచ్టీకే, హెచ్టీకే, హెచ్టీఎక్స్, హెచ్టీకే+ఈఆర్, హెచ్టీఎక్స్ ఈఆర్, హెచ్టీఎక్స్+ఈఆర్, ఎక్స్-లైన్ ఈఆర్), తొమ్మిది ఆకర్షణీయమైన రంగుల్లో లభించే కియా సైరోస్ ఈవీ ధరల వివరాలను డెలివరీలు ప్రారంభమయ్యే సమయానికి అధికారికంగా ప్రకటించనున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


