Maruti Suzuki Victoris : అదరగొట్టిన విక్టోరిస్- 8 నెలల్లోనే 1లక్ష సేల్స్! ఇప్పుడు ఆఫర్లు కూడా..

Maruti victoris : మారుతీ సుజుకీ విక్టోరిస్ మార్కెట్​లో సరికొత్త మైలురాయిని అందుకుంది. 2025 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీ, కేవలం ఎనిమిది నెలల కాలంలోనే 1 లక్ష యూనిట్ల విక్రయాల మార్కును దాటింది. అంతేకాదు, సంస్థ నుంచి అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎస్​యూవీగా నిలించింది. వివరాల్లోకి వెళితే..

Published on: Jun 8, 2026, 17:29:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Maruti Suzuki Victoris price : భారత ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా కంపెనీ నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ ‘విక్టోరిస్’ మార్కెట్​లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2025 సెప్టెంబర్‌లో మార్కెట్​లోకి అడుగుపెట్టిన ఈ కారు, లాంచ్ అయిన ఎనిమిది నెలల కాలంలోనే ఒక లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని విజయవంతంగా దాటేసింది.

మారుతీ సుజుకీ విక్టోరిస్ ఇదిగో..
మారుతీ సుజుకీ విక్టోరిస్ ఇదిగో..

విక్టోరిస్ కారు మార్కెట్​లోకి వచ్చిన కేవలం ఐదు నెలల్లోనే మొదటి 50,000 యూనిట్ల అమ్మకాల మార్కును అందుకుంది. ఆ తర్వాత సరిగ్గా 2026 జనవరిలో ఈ మోడల్ అత్యధికంగా 15,240 యూనిట్ల నెలవారీ విక్రయాలను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అదే నెలలో మారుతీ సుజుకీ విక్రయించిన మొత్తం యుటిలిటీ వెహికల్స్ అమ్మకాల్లో (75,609 యూనిట్లు) ఒక్క విక్టోరిస్ వాటాయే 20 శాతంగా ఉండటం విశేషం.

దీనితో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎర్టిగా (17,892 యూనిట్లు), బ్రెజ్జా (17,486 యూనిట్లు) తర్వాతి స్థానంలో నిలిచి అత్యధికంగా అమ్ముడైన మూడవ యుటిలిటీ వాహనంగా విక్టోరిస్ నిలిచింది.

తోటి కార్ల కంటే ఎంతో వేగంగా..

మారుతీ సుజుకీ సంస్థలోనే, ఇదే ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన 'గ్రాండ్ విటారా' 1 లక్ష యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవడానికి పూర్తి ఏడాది సమయం పట్టింది. దీనితో పోలిస్తే విక్టోరిస్ కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ మార్కును దాటి, మారుతీ సుజుకీ చరిత్రలోనే అత్యంత వేగంగా 1 లక్ష యూనిట్ల విక్రయాలను సాధించిన ఎస్‌యూవీగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

అయితే, ఈ సెగ్మెంట్‌లో అత్యంత వేగంగా లక్ష యూనిట్లను విక్రయించిన రికార్డు మాత్రం సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ పేరిట ఉంది. 2024 జనవరి మధ్యలో లాంచ్ అయిన క్రెటా కేవలం ఆరు నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది.

మారుతీ సుజుకీ సంస్థ 2025 ఆగస్టు నుంచి 2026 మే మధ్య కాలంలో విక్రయించిన మొత్తం 7 లక్షలకు పైగా యుటిలిటీ వాహనాలలో విక్టోరిస్ వాటానే 14 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్, మే) లో నమోదైన 24,554 యూనిట్ల అమ్మకాలను పరిశీలిస్తే.. ఫ్రాంక్స్, ఎర్టిగా, బ్రెజ్జా తర్వాత మారుతీ సుజుకీలో అత్యధికంగా అమ్ముడవుతున్న నాల్గొవ యుటిలిటీ కారుగా విక్టోరిస్ నిలిచింది. ఇదే విధమైన అమ్మకాల జోరు మున్ముందు కూడా కొనసాగితే, మరో కొన్ని నెలల్లోనే విక్టోరిస్ 1.5 లక్షల యూనిట్ల మార్కును సులభంగా దాటగలదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ల కోసం ఈ కారును ‘అక్రాస్’ అనే పేరుతో రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తుండగా, 2026 మార్చి నాటికి భారత్ నుంచి 4,899 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేశారు.

పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు- మైలేజ్ ఎంతంటే..

మారుతీ సుజుకీ విక్టోరిస్ కారు గ్రాండ్ విటారా తరహాలోనే ఇంజన్ ఆప్షన్లను పంచుకుంటుంది. ఇందులో వినియోగదారుల కోసం మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది:

మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్: 103హెచ్​పీ పవర్ ఇచ్చే 1.5-లీటర్ ఇంజన్. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది.

స్ట్రాంగ్-హైబ్రిడ్: 116హెచ్​పీ పవర్ ఇచ్చే 1.5-లీటర్ ఇంజన్‌తో వస్తుంది. దీనికి ఈ-సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జతచేశారు.

పెట్రోల్-సీఎన్జీ : బడ్జెట్ వినియోగదారుల కోసం 89హెచ్​పీ పవర్ ఇచ్చే 1.5-లీటర్ సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.

మైలేజ్ పరంగా చూస్తే, స్ట్రాంగ్-హైబ్రిడ్ విక్టోరిస్ లీటరుకు ఏకంగా 28.56 కిలోమీటర్ల (ఏఆర్​ఏఐ సర్టిఫైడ్) మైలేజ్ ఇస్తూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక విక్టోరిస్ సీఎన్జీ వేరియంట్ కేజీకి 27.02 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, మైల్డ్-హైబ్రిడ్ మోడళ్లు మ్యాన్యువల్‌లో 21.18 కిమీ, ఆటోమేటిక్‌లో 21.06 కిమీ, ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ 19.07 కిమీ మైలేజీని అందిస్తాయి.

భద్రత విషయానికి వస్తే భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మారుతీ సుజుకీ విక్టోరిస్.. 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుని అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. కాగా గ్రాండ్ విటారా కారును ఇంకా భారత్ ఎన్‌సిఎపి పరీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్​లో మారుతీ సుజుకీ విక్టోరిస్ ధర రూ. 10.77 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ రూ. 19.72 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

మారుతీ సుజుకీ విక్టోరిస్​పై ఆఫర్లు..

ఈ జూన్ నెలలో ఈ కారులోని ఎంపిక చేసిన కొన్ని వేరియంట్లపై కస్టమర్లు గరిష్టంగా రూ. 90,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా విక్టోరిస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్లపై ఎక్స్​ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో ఈ భారీ ఆఫర్లు లభిస్తున్నాయి.

మరోవైపు, మారుతీ సుజుకీ విక్టోరిస్ సీఎన్జీ వేరియంట్లపై రూ. 80,000 వరకు, అలాగే పెట్రోల్ వేరియంట్లపై రూ. 60,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి.

మారుతీ సుజుకీకి సంబంధించిన వివిధ కార్లపై ఈ జూన్​ నెలలో లభిస్తున్న డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More