...
...
Next Story

ప్రధాని మోదీ వీడియో తొలగింపు వ్యవహారం: కేంద్ర ప్రభుత్వానికి 'మెటా' క్షమాపణలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ వీడియోను నిలిపివేయడంపై దిగ్గజ సోషల్ మీడియా సంస్థ 'మెటా' కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరణ ఇచ్చింది.

Published on: Aug 6, 2026, 07:10:22 IST
Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన ఫేస్‌బుక్ వీడియోను ఐదు గంటల పాటు నిలిపివేసిన వ్యవహారంలో సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' దిగొచ్చింది. ఈ పొరపాటుపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి సంస్థ గ్లోబల్ చీఫ్ ఆఫీసర్ జోయల్ కాప్లాన్ నేరుగా క్షమాపణలు చెప్పారు.

ప్రధాని మోదీ వీడియో తొలగింపు వ్యవహారం: కేంద్ర ప్రభుత్వానికి 'మెటా' క్షమాపణలు
ప్రధాని మోదీ వీడియో తొలగింపు వ్యవహారం: కేంద్ర ప్రభుత్వానికి 'మెటా' క్షమాపణలు

"ప్రధాని మోదీ పోస్ట్‌ను పొరపాటున నిలిపివేసినందుకు మెటా తరఫున కేంద్ర మంత్రికి క్షమాపణలు తెలియజేశాను" అని జోయల్ కాప్లాన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పార్లమెంటరీ కమిటీ తీవ్ర హెచ్చరిక

పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ జులై 28న ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి చేసిన వీడియో పోస్ట్ అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ఉదయం 5:30 గంటల వరకు ఫేస్‌బుక్‌లో కనిపించకుండా పోయింది. దీనిపై పార్లమెంటరీ ఐటీ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్రంగా స్పందించారు. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఐటీ చట్టం ప్రకారం దక్కే చట్టపరమైన రక్షణను (Safe Harbour) ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మెటా ఉన్నతాధికారులకు సమన్లు పంపింది.

ఈ వివాదానికి కొన్ని రోజుల ముందే, విద్యార్థుల ఆందోళనల నడుమ అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యం ఉంది.

కేంద్రం అసంతృప్తి - సాంకేతిక లోపం సాకు చెల్లదన్న ఐటీ శాఖ

ప్రధాని వీడియో వ్యవహారంతో పాటు ప్లాట్‌ఫామ్‌లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CSAM), మహిళలను తక్కువ చేసి చూపించే మెటీరియల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ మెటాను ఆదేశించింది. బీబీసీ ఐ (BBC Eye) నిర్వహించిన విచారణలో బాలల లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా దాదాపు 30 ప్రకటనలు ఉన్నట్లు వెల్లడికావడంతో మెటా కంటెంట్ పరిశీలన వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

"కంటెంట్ నియంత్రణ, బాలల రక్షణ, కృత్రిమ మేధతో సృష్టించే నకిలీ సమాచారం (AI/Deepfakes), ప్రముఖుల వెరిఫైడ్ ఖాతాలకు ఉండాల్సిన భద్రతా ప్రమాణాలపై మెటా అధికారులతో మాట్లాడాము. వ్యవస్థలు సరిగ్గా ఎందుకు పనిచేయడం లేదో, వారు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం" అని ఐటీ కార్యదర్శి ఎస్.కృష్ణన్ వివరించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe