జేఈఈ, నీట్ 2026 అభ్యర్థులకు అలర్ట్.. ఎన్టీఏ కొత్త రూల్- ఇక మోసాలకు చెక్
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్టీఏ సిద్ధమైంది. 2026 నుంచి జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో అడ్మిషన్ నుంచి పరీక్ష, కౌన్సెలింగ్ వరకు ఫేషియల్ రికగ్నిషన్, లైవ్ ఫోటో క్యాప్చర్ విధానాన్ని అమలు చేయనుంది. పూర్తి వివరాలు..
దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మరింత కఠిన రూల్స్ని చూడబోతున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు రాసే 'ఇంపర్సనేషన్' అక్రమాలకు స్వస్తి పలికేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి నిర్వహించే కీలక పరీక్షల్లో అభ్యర్థుల గుర్తింపు కోసం 'ఫేషియల్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) సాంకేతికతను తప్పనిసరి చేయనుంది. దీనితో పాటు దరఖాస్తు సమయంలోనే లైవ్ ఫోటోను అప్లోడ్ చేసే విధంగా కొత్త నిబంధనను తీసుకురానుంది.

జేఈఈ మెయిన్స్ 2026తో శ్రీకారం..
ఈ కొత్త విధానాన్ని 2026 జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్ పరీక్ష నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఆ తర్వాత నీట్ వంటి ఇతర ప్రధాన పరీక్షలకు కూడా దీనిని విస్తరిస్తారు.
"వచ్చే ఏడాది జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్ నుంచే ఈ కొత్త పద్ధతి అమల్లోకి వస్తుంది. పరీక్ష ప్రక్రియలో వివిధ దశల్లో రియల్ టైమ్ ఐడెంటిఫికేషన్ చెకింగ్స్ చేయడం ద్వారా అక్రమాలకు తావులేకుండా చేయడమే మా లక్ష్యం," అని ఎన్టీఏకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్..
నిజానికి, ఈ కొత్త విధానాన్ని ముందే టెస్ట్ చేశారు. నీట్ యూజీ 2025 సమయంలో దిల్లీలోని కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆధార్ ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. యూఐడీఏఐ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎన్టీఏ నిర్ణయించింది.
రెండు ఫోటోలు.. పక్కా వెరిఫికేషన్..
ఎన్టీఏ కొత్త నిబంధనల ప్రకారం, విద్యార్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు రెండు ఫోటోలను సమర్పించాల్సి ఉంటుంది:
స్కాన్ చేసిన లేటెస్ట్ ఫోటో (జేపీజీ/జేపీఈజీ ఫార్మాట్లో).
దరఖాస్తు ఫారమ్ నింపుతున్న సమయంలో వెబ్క్యామ్ లేదా మొబైల్ ద్వారా తీసిన 'లైవ్ ఫోటో'.
"పాత ఫోటోలను ఇకపై అంగీకరించబోం. అప్లికేషన్ పెట్టిన వ్యక్తి, పరీక్షకు వస్తున్న వ్యక్తి ఒక్కరే అని నిర్ధారించుకోవడానికి ఈ రెండంచెల తనిఖీ ఉపయోగపడుతుంది," అని అధికారులు స్పష్టం చేశారు.
సాంకేతికత ఎలా పనిచేస్తుంది?
ఫేషియల్ బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థి ముఖంలోని ప్రత్యేక లక్షణాలను (కళ్ల మధ్య దూరం, ముక్కు ఆకారం వంటివి) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విశ్లేషిస్తుంది. పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థి ముఖాన్ని స్కాన్ చేసినప్పుడు, అది డేటాబేస్లో ఉన్న సమాచారంతో సరిపోలితేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.
రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు..
నీట్-యూజీ 2024లో పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో, పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చీఫ్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఎన్టీఏలో భారీ సంస్కరణలు చేపడుతున్నారు.
రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ సెంటర్, కౌన్సెలింగ్.. ఇలా మూడు దశల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉండాలని కమిటీ సూచించింది. భవిష్యత్తులో 'డిజీ యాత్ర' తరహాలో 'డిజీ-ఎగ్జామ్' ప్లాట్ఫామ్ను కూడా తీసుకురావాలని కమిటీ ప్రతిపాదించింది.
ముఖ్యమైన తేదీలు..
షెడ్యూల్ ప్రకారం 2026 జేఈఈ మెయిన్స్ పరీక్షలు జనవరి 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ పరీక్ష రాసే విద్యార్థులే మొదటిసారిగా ఈ కొత్త సెక్యూరిటీ నిబంధనలను ఎదుర్కోనున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


