...
...
Next Story

NSE IPO : ఇంకొన్ని రోజుల్లో ఎన్​ఎస్​ఈ ఐపీఓ ఓపెన్- అప్లై చేయాలా? వద్దా? నిపుణుల రివ్యూ..

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ఐపీఓ తేదీలు, ప్రైస్ బాండ్ అధికారికంగా ఖరారయ్యాయి. సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్న ఈ ఇష్యూకి సబ్‌స్క్రైబ్ చేయవచ్చా? బ్రోకరేజ్ నివేదికలు, కంపెనీ ఆర్థిక బలాలు, రిస్క్‌ల సమగ్ర విశ్లేషణ ఇక్కడ చూడండి.

Published on: Sep 12, 2026, 10:02:07 IST
Advertisement

భారతీయ స్టాక్ మార్కెట్ వర్గాలు, దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలకు సమయం ఆసన్నమైంది. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్​ఛేంజ్ అయిన 'నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్' (ఎన్​ఎస్​ఈ) పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ వారంలోనే సబ్​స్క్రిప్షన్​కు ఓపెన్ కానుంది. ఈ భారీ పబ్లిక్ ఇష్యూ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఎన్​ఎస్​ఈ ఐపీఓ డేట్స్..

ఎన్​ఎస్​ఈ ఐపీఓ అప్డేట్స్..
ఎన్​ఎస్​ఈ ఐపీఓ అప్డేట్స్..

వచ్చే వారం సెప్టెంబర్ 17న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఈక్విటీ షేరు ఫేస్​ వాల్యూ రూ. 1 కాగా, ప్రైజ్​ బాండ్‌ను రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించారు. పెద్ద ఇన్వెస్టర్లు (యాంకర్ ఇన్వెస్టర్లు) సెప్టెంబర్ 16న తమ కేటాయింపులను పొందుతారు. బిడ్డింగ్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 22న షేర్ల అలాట్‌మెంట్, సెప్టెంబర్ 24న స్టాక్ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఐపీఓ పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్​ఎస్) రూపంలో వస్తోంది. అంటే, ఈ ఆఫర్ ద్వారా సమీకరించే నిధులన్నీ తమ వాటాలను విక్రయిస్తున్న ప్రస్తుత వాటాదారులకే (పన్నులు, ఇతర ఖర్చులు పోను) వెళతాయి. ఈ ఇష్యూ ద్వారా ఎన్‌ఎస్‌ఈ కంపెనీ ఖాతాలోకి నేరుగా ఎలాంటి నిధులూ చేరవు.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ సబ్‌స్క్రైబ్ చేయొచ్చా? బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ..

ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘సామ్‌కో సెక్యూరిటీస్’ మొదటిసారిగా తమ విశ్లేషణను వెల్లడిస్తూ, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు అని రికమండ్ చేసింది.

భారత క్యాపిటల్ మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ మోనోపోలీ స్థాయి ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. రెడ్‌సీర్ నివేదిక ప్రకారం.. 2001 ఆర్థిక సంవత్సరం నుంచి క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్ టర్నోవర్‌లో ఎన్‌ఎస్‌ఈ దేశంలోనే నంబర్ వన్ ఎక్స్​ఛేంజ్​గా నిలిచింది.

మార్కెట్ వాటా: క్యాష్ మార్కెట్ టర్నోవర్‌లో ఎన్‌ఎస్‌ఈ దాదాపు 93 శాతానికి పైగా వాటాను కలిగి ఉండగా, ఈక్విటీ ఫ్యూచర్స్‌లో 99.7 శాతం పైగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ఆర్థిక బలం: 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 18,713.37 కోట్లకు చేరింది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్​వై27) నిర్వహణ ఆదాయం 13.10 శాతం పెరిగి రూ. 4,560.41 కోట్లకు, నికర లాభం (ప్యాట్) 6.71 శాతం వృద్ధితో రూ. 3,120.08 కోట్లకు చేరింది. కంపెనీ ఎబిట్​డా మార్జిన్ ఏకంగా 78.81 శాతంగా నమోదు కావడం విశేషం.

అప్పుల్లేని కంపెనీ: ఎన్‌ఎస్‌ఈకి ఎలాంటి అప్పులు లేవు. పైగా భారీగా ట్రెజరీ పెట్టుబడులు ఉన్నాయి!

భారీ కస్టమర్ బేస్: జూన్ 30, 2026 నాటికి ఎన్‌ఎస్‌ఈలో నమోదైన ఇన్వెస్టర్ల సంఖ్య 13.23 కోట్లు దాటింది. మైక్రో సెకన్ల వ్యవధిలో ట్రేడింగ్ ఆర్డర్లను ప్రాసెస్ చేసే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ దీనికి ఉండటంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఎన్​ఎస్​ఈవైపే మొగ్గుచూపుతుంటారు.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- ఎక్స్​ఛేంజ్ రిస్క్​లు ఏంటి?

ఎన్‌ఎస్‌ఈకి తిరుగులేని బలాలు ఉన్నప్పటికీ, కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు:

డెరివేటివ్స్‌పై ఆధారపడటం: ఎన్‌ఎస్‌ఈకి వచ్చే ఆదాయంలో మెజారిటీ భాగం ఎఫ్‌ అండ్ఓ ట్రేడింగ్ లావాదేవీల రుసుముల నుంచే వస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర నిర్వహణ ఆదాయంలో ట్రాన్సాక్షన్ ఛార్జీల వాటా 78.65 శాతం కాగా, కేవలం ఆప్షన్ల నుంచే 60.22 శాతం ఆదాయం వచ్చింది.

మార్కెట్ వాటా తగ్గుదల: ఈక్విటీ ఆప్షన్ల మార్కెట్ వాటా (ప్రీమియం టర్నోవర్ ఆధారంగా) ఎఫ్​వై24లోని 96.86 శాతం నుంచి క్యూ1 ఎఫ్​వై27 నాటికి 68.48 శాతానికి పడిపోయింది.

సెబీ నిబంధనలు- ఎస్టీటీ ప్రభావం: వీక్లీ ఎక్స్‌పైరీలపై సెబీ విధించిన నూతన ఆంక్షలు, పెరిగిన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్​టీటీ) డెరివేటివ్ వాల్యూమ్‌లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

కొద్దిమంది బ్రోకర్లపైనే ఆధారపడటం: క్యూ1 ఎప్​వై27 నాటికి టాప్ 10 ట్రేడింగ్ మెంబర్ల నుంచే ఎన్‌ఎస్‌ఈకి 47 శాతం ఆదాయం లభిస్తోంది. అందులో ఒకే ఒక్క పెద్ద బ్రోకర్ నుంచి 7.72 శాతం ఆదాయం వస్తుండటం గమనార్హం.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్ వృద్ధితో ఎన్‌ఎస్‌ఈ నేరుగా అనుసంధానమై ఉంది. స్వల్పకాలిక రెగ్యులేటరీ మార్పుల వల్ల కొన్ని రిస్క్‌లు ఉన్నప్పటికీ, సుదీర్ఘ కాలానికి భారత స్టాక్ మార్కెట్ అభివృద్ధిలో భాగం కావాలనుకునే ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ఒక గొప్ప అవకాశమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks