...
...
Next Story

Education Minister : భారత్​కు కొత్త విద్యాశాఖ మంత్రి- ప్రహ్లాద్ జోషి ఏం చదువుకున్నారు?

Pralhad Joshi education : కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి చదువు, రాజకీయ ప్రస్థానం గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 26, 2026, 06:45:06 IST
Advertisement

దేశంలో అత్యంత కీలకమైన పునరుత్పాదక ఇంధన వనరులు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషికి కేంద్ర ప్రభుత్వం మరో, అత్యంత బాధ్యతాయుతమైన రోల్​ని అప్పగించింది. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, ప్రహ్లాద్ జోషికి ఆ బాధ్యతలను అదనంగా కేటాయించింది. పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల వంటి సవాలుతో కూడిన శాఖలను విజయవంతంగా నడిపించిన ఈ హుబ్పళ్లి నేత.. ఇప్పుడు కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యాశాఖ పగ్గాలు చేపట్టారు.

ప్రహ్లాద్ జోషి.. (PTI)
ప్రహ్లాద్ జోషి.. (PTI)

ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవడంతో, విద్యాశాఖ బాధ్యతలు ప్రహ్లాద్ జోషికి లభించాయి. జాతీయ పోటీ పరీక్షలపై విద్యార్థుల్లో, ప్రజల్లో విచ్ఛిన్నమైన విశ్వాసాన్ని పునరుద్ధరించడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ప్రక్షాళన చేయడం, జాతీయ విద్యా విధానం (ఎన్​ఈపీ) అమలును ముందుకు తీసుకెళ్లడం, ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం వంటి భారీ సవాళ్లు ఇప్పుడు ఆయన ముందు ఉన్నాయి.

కర్ణాటకకు చెందిన ఆర్ట్స్ గ్రాడ్యుయేట్!

పార్లమెంటరీ రికార్డుల ప్రకారం.. ప్రహ్లాద్ జోషి తన పాఠశాల విద్యను హుబ్పళ్లిలో పూర్తి చేశారు. ఆ తర్వాత ధార్వాడ్‌లోని కర్ణాటక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కడసిద్ధేశ్వర ఆర్ట్స్ కాలేజీ నుంచి 1983లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) డిగ్రీ పట్టా పొందారు.

ఉత్తర కర్ణాటకలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం 1949లో స్థాపితమైంది. ఎంతోమంది రాజకీయ నాయకులను, సివిల్ సర్వెంట్లను, ప్రజా ప్రముఖులను దేశానికి అందించిన ఘనత ఈ విద్యాసంస్థకు ఉంది. తన విద్యార్థి దశలోనే ప్రహ్లాద్ జోషి ప్రజా సమస్యలు, సామాజిక సేవ, సమాజ అభివృద్ధి అంశాలపై ప్రత్యేక ఆసక్తి పెంపొందించుకున్నారు.

ఇటీవలి కాలంలో విద్యాశాఖను నిర్వహించిన చాలామంది మంత్రులు ఇంజనీరింగ్, లా లేదా మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు కలిగి ఉండగా, ప్రహ్లాద్ జోషి విద్యా నేపథ్యం మాత్రం మానవీయ శాస్త్రాల నుంచి రావడం విశేషం.

రెండు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం..

1962 నవంబర్ 27న కర్ణాటకలో జన్మించిన జోషి, 2004లో ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా ఐదుసార్లు అదే స్థానం నుంచి విజయం సాధిస్తూ బీజేపీ నుంచి అత్యంత అనుభవజ్ఞుడైన ఎంపీలలో ఒకరిగా నిలిచారు. విధాన రూపకల్పన, రాజకీయ సమన్వయం అవసరమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ నమ్మే విశ్వసనీయమైన అడ్మినిస్ట్రేటర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు.

మునుపెన్నడూ లేని కొత్త సవాలు!

ఇప్పటివరకు ఆయన నిర్వహించిన మౌలిక వసతులు లేదా ఇంధన శాఖల కంటే విద్యా మంత్రిత్వ శాఖ పరీక్ష పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే విద్యావ్యవస్థ దేశంలోని ప్రతికూల, సామాన్య కుటుంబాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. నీట్ పరీక్ష వివాదం తర్వాత ప్రవేశ పరీక్షలపై ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బలోపేతం చేయడం, జాతీయ విద్యా విధానాన్ని (ఎన్​ఈపీ) క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, పాఠశాలలు, కళాశాలల్లో అభ్యాసన ప్రమాణాలను మెరుగుపరచడం వంటి క్లిష్టమైన సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

విద్యా వ్యవస్థకు నేతృత్వం వహించడం జోషికి ఇదే తొలిసారి. సంక్లిష్టమైన శాఖలను నడిపించిన ఆయన అనుభవం, రాబోయే రోజుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు. విశ్వవిద్యాలయాల అంచనాలను అందుకునే సంస్కరణలుగా మారుతుందో లేదో వేచి చూడాల్సిందే.

ఏది ఏమైనా, ఈ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఆయన పనితీరు లేదా ప్రగతి నివేదిక అనేది బొగ్గు ఉత్పత్తి గణాంకాలతోనో లేదా పార్లమెంటరీ మెజారిటీ సంఖ్యలతోనో కొలవడం జరగదు.. కోట్ల మంది భారతీయ విద్యార్థుల నమ్మకం, దేశ విద్యావ్యవస్థ భవిష్యత్తుపై మాత్రమే ఆధారపడి ఉంటుంది!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe