రైల్వే అభ్యర్థులకు అలర్ట్: జేఈ, పారామెడికల్, టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
జేఈ, పారామెడికల్, టెక్నీషియన్ పోస్టుల పరీక్షా తేదీలను ప్రకటించింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఫిబ్రవరి 19 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం, కాల్ లెటర్ వివరాలను అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రైల్వేలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. జూనియర్ ఇంజనీర్ (జేఈ), పారామెడికల్, టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీట్) షెడ్యూల్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) విడుదల చేసింది. అభ్యర్థులు తమ ప్రాంతీయ ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ల ద్వారా ఈ పూర్తి షెడ్యూల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రైల్వే పరీక్షల కాలపట్టిక ఇలా..
జేఈ (జేఈ/డీఎంఎస్/సీఎంఏ) పోస్టులు: ఈ పరీక్షలు 2026, ఫిబ్రవరి 19, 20, మార్చి 3వ తేదీల్లో జరుగుతాయి.
టెక్నీషియన్ (గ్రేడ్-I సిగ్నల్, గ్రేడ్-III): టెక్నీషియన్ పోస్టులకు మార్చి 5 నుంచి మార్చి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పారామెడికల్ పోస్టులు: పారామెడికల్ కేటగిరీకి మార్చి 10 నుంచి మార్చి 12వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
హాల్ టికెట్లు, ఎగ్జామ్ సిటీ వివరాలు..
పరీక్షా కేంద్రం (సిటీ), తేదీ వివరాలను తెలుసుకోవడానికి, అలాగే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఉచిత ప్రయాణ పాస్లను డౌన్లోడ్ చేసుకోవడానికి పరీక్షకు 10 రోజుల ముందు లింక్ అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ కాల్ లెటర్లను (హాల్ టికెట్లు) డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో సమర్పించిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును (ఐడీ ప్రూఫ్) తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు అని గుర్తుపెట్టుకోవాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు తమ ఆధార్ అకౌంట్ యూఐడీఏఐ సిస్టమ్లో 'అన్లాక్' స్థితిలో ఉందో లేదో ముందే చూసుకోవాలి. దీనివల్ల పరీక్షా కేంద్రం వద్ద బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.
ఆర్ఆర్బీ ఎగ్జామ్ షెడ్యూల్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
స్టెప్ 1- ముందుగా మీ ప్రాంతీయ ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే "JE, Paramedical and Technician Exam Dates Notice" లింక్పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- వెంటనే పరీక్షా తేదీలతో కూడిన ఒక పీడీఎఫ్ ఫైల్ స్క్రీన్పై కనిపిస్తుంది.
స్టెప్ 4- ఆ ఫైల్ను డౌన్లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లను గమనిస్తూ ఉండాలని బోర్డు సూచించింది.
జేఈ పరీక్ష తేదీల వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పారామెడికల్ పరీక్ష తేదీల వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టెక్నీషియ్ పరీక్ష తేదీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్ఆర్బీ ఏఎల్పీ పరీక్ష తేదీలు కూడా..
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఉద్యోగం కోసం 2025 నోటిఫికేషన్కు సంబంధించి రాత పరీక్షల షెడ్యూల్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవలే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 9,970 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్ష షెడ్యూల్, విధానం:
రైల్వే బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ పరీక్షలు 2026, ఫిబ్రవరి 16 నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయి.
సీబీటీ-1 పరీక్ష: ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఇందులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను తదుపరి దశ అయిన సీబీటీ-2కు ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు తాము ఏ ప్రాంతీయ ఆర్ఆర్బీని ఎంచుకున్నారో, ఆ జోన్ పరిధిలోని అభ్యర్థుల మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఎగ్జామ్ సిటీ, కాల్ లెటర్లు:
అభ్యర్థులు తమ పరీక్షా నగరం ఎక్కడ పడిందో పరీక్షకు 10 రోజుల ముందే తెలుసుకోవచ్చు. ఇక హాల్ టికెట్లు లేదా ఈ-కాల్ లెటర్లను పరీక్షా తేదీకి సరిగ్గా 4 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అందుబాటులోకి వస్తుంది.
నోటీసును డౌన్లోడ్ చేయడం ఎలా?
అభ్యర్థులు అధికారిక సమాచారం కోసం ఈ కింది స్టెప్స్ని అనుసరించవచ్చు:
స్టెప్ 1- ముందుగా మీ ప్రాంతీయ ఆర్ఆర్బీ (ఉదాహరణకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్) అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో ఉన్న "RRB ALP Exam Dates 2025" నోటీసు లింక్పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- వెంటనే పరీక్షా తేదీలతో కూడిన ఒక పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
ఆ ఫైల్ను డౌన్లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింట్ అవుట్ దగ్గర పెట్టుకోవడం మంచిది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


