...
...
Next Story

Tata cars : సఫారీ ఈవీ నుంచి అవిన్యా వరకు.. టాటా క్రేజీ లైనప్! లాంచ్​ ఎప్పుడంటే..

దిగ్గజ టాటా మోటార్స్ రాబోయే 18 నెలల్లో ఆటోమొబైల్​ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. టిగోర్ ఫేస్‌లిఫ్ట్, సఫారీ ఈవీతో పాటు 2027లో నెక్సాన్ నెక్ట్స్-జెన్ మోడల్‌ను విడుదల చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Sep 14, 2026, 07:29:23 IST
Advertisement

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్, పెట్రోల్ వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకునేందుకు సిద్ధమవుతోంది. 2026లో సియెర్రా పునరాగమనం, పంచ్, టియాగో ఫేస్‌లిఫ్ట్‌లతో దూకుడు ప్రదర్శించిన టాటా.. రాబోయే నెలల్లో సరికొత్త కార్లతో రికార్డులు సృష్టించేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి రానున్న మోడళ్లతో పాటు 2027 వరకు విడుదల కానున్న కొత్త కార్ల రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా టాటా కార్లకు ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ సరికొత్త ఫీచర్లతో వీటిని తీర్చిదిద్దుతోంది.

టాటా అవిన్యా
టాటా అవిన్యా

ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో లాంచ్​కు రెడీ అవుతున్న టాటా కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

నవంబర్‌లో కొత్త టిగోర్, సఫారీ ఈవీ సందడి..

నవంబర్ నాటికి సబ్‌-4 మీటర్ సెడాన్ విభాగంలో పాపులర్ అయిన టిగోర్, టిగోర్ ఈవీల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటివరకు టిగోర్ సిరీస్‌లో రాబోతున్న అతిపెద్ద అప్‌డేట్ ఇదే కానుంది. కొత్త షార్ప్ హెడ్‌లాంప్స్, సరికొత్త బంపర్లు, ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్‌తో ఇది మరింత స్పోర్టీగా మారనుంది. క్యాబిన్ లోపల రీడిజైన్ చేసిన డాష్‌బోర్డ్, రెండు స్మార్ట్‌ఫోన్ ట్రేలు, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఆధునిక వసతులు కల్పిస్తున్నారు. అయితే ఇంజిన్, గేర్‌బాక్స్ వంటి సాంకేతిక అంశాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

అదే నెలలో అత్యంత ఆసక్తికరమైన ‘సఫారీ ఈవీ’ కూడా షోరూమ్‌లకు చేరుకోనుంది. రియర్-బయాస్డ్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్‌ను అందిస్తున్నారు. దీనివల్ల ప్రయాణం మరింత సుఖవంతంగా ఉంటుంది. హారియర్ ఈవీ మాదిరిగానే మూడు వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభించే ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. మహీంద్రా 'ఎక్స్​ఈవీ 9ఎస్' కారుకు నేరుగా పోటీ ఇవ్వడమే కాకుండా, బైడైరెక్షనల్ ఛార్జింగ్ సదుపాయంతో ఇది రానుంది.

2027లో సియెర్రా ఏడబ్ల్యూడీ, నెక్ట్స్-జెన్ నెక్సాన్ 'గరుడ్'

2027 మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ నెక్సాన్ నెక్ట్స్-జెన్ మోడల్‌ను ‘గరుడ్’ అనే కోడ్ నేమ్‌తో మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫామ్‌ను సవరించి దీనిని తయారు చేస్తారా లేక సరికొత్త సియెర్రా ప్లాట్‌ఫామ్‌ను కుదించి రూపొందిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తులో 'స్కార్లెట్' కోడ్‌నేమ్‌తో మినీ-సియెర్రాను కూడా తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

జేఎల్ఆర్ ప్లాట్‌ఫామ్‌పై ప్రీమియం ఈవీ 'అవిన్యా'

2027 చివరి త్రైమాసికంలో టాటా మోటార్స్ తన పూర్తి స్థాయి ప్రీమియం ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘అవిన్యా’ నుంచి మొదటి ప్రొడక్షన్ మోడల్‌ను పరిచయం చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించిన 'అవిన్యా ఎక్స్' కాన్సెప్ట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకోనుంది. జేఎల్ఆర్ ఈఎంఏ ప్లాట్‌ఫామ్‌కు బదులుగా, చైనా జాయింట్ వెంచర్ సీజేఎల్ఆర్ ఫ్రీల్యాండర్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మిస్తున్నారు. దీనితో డిజైన్, పరిమాణంలో కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఈ వరుస మోడళ్ల రాకతో భారత వాహన రంగంలో టాటా స్థానం మరింత సుస్థిరం కానుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks