అమెరికాలో టాకో బెల్ కలకలం: వేలాది మందిని పడకేయించిన పారసైట్ ఇన్ఫెక్షన్

ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ 'టాకో బెల్'కు లెట్యూస్ సరఫరా చేసే కాలిఫోర్నియా సంస్థ టేలర్ ఫార్మ్స్ వల్ల అమెరికాలో తీవ్రమైన 'సైక్లోస్పోరియాసిస్' ఇన్ఫెక్షన్ వ్యాపించింది. ఇప్పటికే వేలాది మంది అనారోగ్యానికి గురికాగా, దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి.

Published on: Jul 17, 2026, 07:22:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్ 'టాకో బెల్' వినియోగదారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ రెస్టారెంట్లకు లెట్యూస్ (ఆకుకూర) సరఫరా చేసే కాలిఫోర్నియాకు చెందిన 'టేలర్ ఫార్మ్స్' సంస్థే ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అమెరికా వ్యాప్తంగా వేలాది మందిని ఆందోళనకు గురిచేస్తున్న 'సైక్లోస్పోరియాసిస్' (Cyclosporiasis) వ్యాప్తికి ఈ సంస్థ సరఫరా చేసిన ఐస్‌బర్గ్ లెట్యూస్ కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.

అమెరికాలో టాకో బెల్ కలకలం: వేలాది మందిని పడకేయించిన పారసైట్ ఇన్ఫెక్షన్
అమెరికాలో టాకో బెల్ కలకలం: వేలాది మందిని పడకేయించిన పారసైట్ ఇన్ఫెక్షన్

వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది సైక్లోస్పోరియాసిస్ ఇన్ఫెక్షన్ ఆగ్నేయ మిచిగాన్‌లో అత్యధికంగా కేంద్రీకృతమైంది. అక్కడ ఇప్పటికే 4,300 కంటే ఎక్కువ కేసులు వెలుగుచూడగా, కనీసం 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. మిచిగాన్‌తో పాటు కెంటుకీ, ఓహియో, వెస్ట్ వర్జీనియా వంటి నాలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసులకు ఒకే ఉమ్మడి మూలం ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అధికారులు వెల్లడించారు.

దర్యాప్తులో తేలింది ఏంటి?

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) జరుపుతున్న దర్యాప్తులో లెట్యూస్‌తో పాటు మరికొన్ని కూరగాయల పాత్రపై అధికారులు దృష్టి పెట్టారు.

"అనారోగ్యానికి గురైన వారిలో అత్యధిక శాతం మంది టాకో బెల్‌లో ఆహారం తిన్నట్లు చెప్పారు. వారు కామన్‌గా తిన్న పదార్థాల గురించి ఆరా తీయగా, లెట్యూస్ పేరు పదే పదే వినిపించింది" అని దర్యాప్తుతో సంబంధం ఉన్న ఒకరు తెలిపారు.

దీనిపై ఎఫ్‌డీఏ (FDA) టాకో బెల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, తమకు మిచిగాన్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని రెస్టారెంట్లకు కాలిఫోర్నియాకు చెందిన టేలర్ ఫార్మ్స్ నుంచే లెట్యూస్ సరఫరా అవుతున్నట్లు స్పష్టం చేసింది.

మిచిగాన్‌లో తీవ్ర ప్రభావం

ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన 1,000 మందికి పైగా రోగులను విచారించగా, లెట్యూస్ వల్లే ఈ వ్యాధి వ్యాపించినట్లు మిచిగాన్ ఆరోగ్య అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం అమెరికాలోని 34 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు చివరి నాటికి ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇన్ఫెక్షన్ తీవ్రత నేపథ్యంలో డెట్రాయిట్ ప్రాంతంలోని కొన్ని టాకో బెల్ రెస్టారెంట్ల వెలుపల బోర్డులను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కొన్ని ఆహార పదార్థాల ఉపసంహరణ (Recall) ప్రక్రియ జరుగుతున్నందున ప్రస్తుతానికి లెట్యూస్, కొత్తిమీర ఉల్లిపాయలు, పికో డి గాలో, గ్వాకామోల్ వంటి పదార్థాలను విక్రయించలేకపోతున్నామని బోర్డుల్లో పేర్కొన్నారు.

టాకో బెల్ స్పందన

ఈ సంక్షోభంపై టాకో బెల్ యాజమాన్యం స్పందించింది. ఆరోగ్య అధికారుల మార్గదర్శకాలను తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రకటించింది. వినియోగదారుల ఆరోగ్య భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని, ముందుజాగ్రత్త చర్యగా కొన్ని ఎంపిక చేసిన రెస్టారెంట్లలో కొన్ని పదార్థాల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.

దర్యాప్తుపై ఇంటర్నేషనల్ ఫ్రెష్ ప్రొడ్యూస్ అసోసియేషన్ విమర్శలు

ఆరోగ్య అధికారుల దర్యాప్తు తీరుపై ఇంటర్నేషనల్ ఫ్రెష్ ప్రొడ్యూస్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసోసియేషన్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ మాక్స్ టెప్లిట్స్కీ మాట్లాడుతూ, కేవలం పేషెంట్ల జ్ఞాపకశక్తి ఆధారంగానే కూరగాయలపై నిందలు వేస్తున్నారని, ఇది సగం కేసులకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. సైక్లోస్పోరా అనేది సంక్లిష్టమైన పారసైట్ (పరాన్నజీవి) అని, దీనిని వాతావరణంలో గుర్తించడం చాలా కష్టమని, పరీక్షా పద్ధతుల్లో కూడా లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అసలు సైక్లోస్పోరియాసిస్ అంటే ఏమిటి?

సిడిసి (CDC) సమాచారం ప్రకారం, సైక్లోస్పోరియాసిస్ అనేది 'సైక్లోస్పోరా కయెటానెన్సిస్' అనే సూక్ష్మ పరాన్నజీవి (పారసైట్) వల్ల వచ్చే జీర్ణకోశ వ్యాధి. ఈ పరాన్నజీవి సోకిన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల మనుషులకు ఇన్ఫెక్షన్ వస్తుంది. సాధారణంగా ఇది ప్రాణాంతకం కాదు. ఇన్ఫెక్షన్ సోకిన 2 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. నీళ్ల విరేచనాలు, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కడుపులో తిప్పడం, గ్యాస్ సమస్యలు, అలసట దీని ప్రధాన లక్షణాలు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More