29.9 కేఎంపీఎల్​ మైలేజీతో రికార్డులు సృష్టించిన టాటా సియెర్రా.. స్పీడ్​లో కూడా తోపు!

ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్న టాటా సియెర్రా ఎస్​యూవీ సరికొత్త రికార్డును సృష్టించింది! టెస్ట్​ డ్రైవ్​లో 29.9 కేఎంపీఎల్​ మైలేజీని సాధించి “ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌”లో చోటు దక్కించుకుంది! అంతేకాదు 222 కేఎంపీహెచ్​ టాప్​ స్పీడ్​ సైతం నమోదు చేసింది! ఈ టెస్ట్​ డ్రైవ్​కి సంబంధించిన వివరాలు..

Published on: Dec 12, 2025 9:11 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాటా మోటార్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న టాటా సియెర్రా ఎస్‌యూవీ తాజాగా “ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌”లో చోటు దక్కించుకుంది! ఇండోర్‌లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ పరీక్షా కేంద్రంలో నిర్వహించిన 12 గంటల టెస్ట్ రన్‌లో ఈ ఎస్‌యూవీ 29.9 కేఎంపీఎల్​ మైలేజీని నమోదు చేసింది.

టాటా సియెర్రా ఎస్​యూవీ..
టాటా సియెర్రా ఎస్​యూవీ..

నవంబర్ 30, 2025న నిర్వహించిన ఈ ట్రయల్‌ను పిక్సెల్ మోషన్ బృందం చేపట్టింది. ఈ పరీక్షలో డ్రైవర్లను మార్చడానికి మాత్రమే స్వల్ప విరామాలు తీసుకున్నారు. మిగతా సమయమంతా వాహనాన్ని నిరంతరంగా నడిపారు.

డాక్యుమెంటేషన్ ప్రకారం, ఈ బృందం ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు సియెర్రాను నిరంతరంగా నడిపింది. తద్వారా, నిర్దిష్ట సమయ పరిమితిలో గరిష్ఠ మైలేజీ సాధించిన మునుపటి జాతీయ ప్రమాణాన్ని ఈ టాటా సియెర్రా అధిగమించింది.

కొత్త 'హైపెరియన్' పెట్రోల్ ఇంజిన్‌ ప్రత్యేకతలు..

ఈ టెస్ట్ రన్ టాటాకు చెందిన సరికొత్త 1.5-లీటర్ హైపెరియన్ పెట్రోల్ ఇంజిన్ ఫస్ట్​ రియల్-వరల్డ్ ప్రదర్శనగా నిలిచింది. ఇంజనీర్ల అభిప్రాయం ప్రకారం, ఈ ఇంజిన్‌ను ఎస్‌యూవీ సామర్థ్యాన్ని తగ్గించకుండా, మెరుగైన మైలేజీని అందించేలా రూపొందించారు.

ఈ సుదీర్ఘ పరీక్ష సమయంలో, ఇంజిన్ టార్క్-రిచ్ మిడ్-రేంజ్, అప్‌డేట్ చేసిన కంబషన్ సెటప్ స్థిరమైన ఇంధన సరఫరాను నిర్వహించడానికి సహాయపడ్డాయి.

ఇంజిన్‌లో ఇంటర్నల్​ ఫిక్షన్​ తగ్గడం కూడా మైలేజీకి దోహదపడింది. దీనివల్ల సియెర్రా ట్రాక్‌పై స్థిరంగా దూసుకెళ్లగలిగింది.

టాటా సియెర్రా- మైలేజీ టెస్ట్‌తో పాటు అత్యధిక వేగం..

మైలేజీ టెస్ట్‌తో పాటు ఇండోర్‌లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ పరీక్షా కేంద్రం ట్రాక్‌లోనే విడిగా నిర్వహించిన ఒక పరీక్షలో సియెర్రా ఎస్​యూవీ 222 కేఎంపీహెచ్​ అత్యధిక వేగాన్ని కూడా అందుకుంది. కొత్త పవర్‌ట్రైన్ గరిష్ఠ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ సమాంతర పరీక్షను నిర్వహించారు.

అయితే, వినియోగదారులకు అందించే వాహనాలు ఈ వేగంతో ప్రయాణించలేవని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాల్లో భాగంగా, తయారీ మోడళ్లలో వేగం 190 కేఎంపీహెచ్​ వద్ద ఎలక్ట్రానిక్‌గా పరిమితం చేయడం జరిగింది.

టాటా మోటార్స్ విజ్ఞప్తి: రోడ్లపై ఇలా ప్రయత్నించవద్దు!

ఈ రికార్డు టాటా సియెర్రాపై ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, ఈ రెండు పరీక్షలను శిక్షణ పొందిన నిపుణులు మాత్రమే, నియంత్రిత వాతావరణంలో నిర్వహించారని టాటా మోటార్స్ ఉద్ఘాటించింది. ఓనర్లను ఉద్దేశిస్తూ, ఇలాంటి ప్రయత్నాలను పబ్లిక్ రోడ్లపై చేయవద్దని, వేగ, సాధారణ ట్రాఫిక్ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ ఘనత సాధించడంపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మోహన్ సావర్కర్ మాట్లాడుతూ, "సియెర్రా ప్రయాణం ప్రారంభంలోనే జాతీయ మైలేజీ రికార్డును నెలకొల్పడం మాకు గర్వకారణం. పెట్రోల్ పవర్‌ట్రైన్‌ల సామర్థ్యాన్ని పెంచడానికి హైపెరియన్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాం, ఈ మైలురాయి ఆ ప్రయత్నాన్ని ధృవీకరిస్తుంది. ఇది కస్టమర్‌ల కోసం సియెర్రా వాల్యూ ప్రతిపాదనను బలోపేతం చేస్తుంది. అధునాతన, సమర్థవంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సాంకేతికతలను మార్కెట్‌కు తీసుకురావాలన్న టాటా మోటార్స్ నిబద్ధతను ఇది చాటుతుంది," అని తెలిపారు.