TCS Nashik sexual harassment: టీసీఎస్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలపై రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

TCS Nashik sexual harassment: మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ (TCS) కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, అత్యాచారం, బలవంతపు మత మార్పిడి ఒత్తిడి వంటి దారుణ ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Published on: Apr 16, 2026 6:56 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TCS Nashik sexual harassment: మహారాష్ట్రలోని ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ బీపీఓ యూనిట్ వేధింపుల కేసుపై జాతీయ మహిళా కమిషన్ (NCW) రంగంలోకి దిగింది. అక్కడి కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం వంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయన్న వార్తలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ అరాచకాలపై క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ చేసేందుకు ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు టీసీఎస్ ఆపరేషన్స్ మేనేజర్ అశ్వినీ చైనానీని జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తున్న పోలీసులు (ANI Video Grab)
కోర్టు ఆదేశాల మేరకు టీసీఎస్ ఆపరేషన్స్ మేనేజర్ అశ్వినీ చైనానీని జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తున్న పోలీసులు (ANI Video Grab)

క్షేత్రస్థాయి విచారణకు ప్రత్యేక కమిటీ

ఈ కేసులో లోతైన విచారణ జరిపేందుకు బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సాధనా జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఇందులో హర్యానా మాజీ డీజీపీ బి.కె. సిన్హా, సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోరా, ఎన్‌సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ లీలావతి సభ్యులుగా ఉన్నారు. "ఈ కమిటీ ఏప్రిల్ 18న నాసిక్ సందర్శిస్తుంది. బాధితులు, పోలీసు అధికారులు మరియు కంపెనీ ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వాస్తవాలను సేకరిస్తుంది" అని కమిషన్ తన ప్రకటనలో పేర్కొంది. విచారణ పూర్తయిన 10 పనిదినాలలోపు నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

మతం మార్చాలని వేధింపులు.. నిందితుల అరెస్ట్

ఈ వ్యవహారంలో అసలు కథ బాధితుల వాంగ్మూలాలతో బయటపడింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి లోబర్చుకోవడం, అసభ్యకరంగా తాకడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం, మతం మార్చుకోవాలని మానసిక ఒత్తిడికి గురిచేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు 8 మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"ఈ అరాచకాలు 2022 నుంచి 2026 మధ్య కాలంలో జరిగాయి. నిందితులు బాధితులను బ్లాక్‌మెయిల్ చేస్తూ నరకయాతన చూపించారు" అని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తార్ తదితర ఐదుగురు నిందితులతో పాటు ఆపరేషన్స్ హెడ్ అశ్విని చైనానిని కూడా అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు ఏప్రిల్ 15 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

టాటా సన్స్ చైర్మన్ తీవ్ర దిగ్భ్రాంతి

ఈ అరాచకాలు వెలుగులోకి రావడంతో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్రంగా స్పందించారు. నాసిక్ బ్రాంచ్‌లో జరిగిన ఘటనలు అత్యంత ఆందోళనకరమని, మనస్తాపానికి గురిచేశాయని ఆయన పేర్కొన్నారు. "నిందితులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం. టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్తి సుబ్రమణ్యన్ నేతృత్వంలో అంతర్గత విచారణ జరుగుతోంది" అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను టాటా గ్రూప్ ఏమాత్రం సహించబోదని ఆయన పునరుద్ఘాటించారు.

పుణె ఇన్ఫోసిస్‌లోనూ కలకలం.. దేశవ్యాప్త నిరసనలు

ఒకవైపు టీసీఎస్ కేసు దర్యాప్తు జరుగుతుండగానే, పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలోనూ వేధింపుల ఆరోపణలు రావడం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాము ఇలాంటి ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, స్వతంత్ర కమిటీతో విచారణ జరుపుతామని ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్రకటించింది.

కాగా, నాసిక్ ఘటనలను నిరసిస్తూ భజరంగ్ దళ్ ఏప్రిల్ 16, 17 తేదీల్లో దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీని వెనుక 'లవ్ జిహాద్' కోణం ఉందని, ఐటీ కంపెనీల్లో ఇలాంటి చర్యలు జాతీయ భద్రతకు ముప్పని విహెచ్‌పి (VHP) ఆందోళన వ్యక్తం చేసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నాసిక్ టీసీఎస్ కేసులో జాతీయ మహిళా కమిషన్ వేసిన కమిటీ ఏం చేస్తుంది?

జస్టిస్ సాధనా జాదవ్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏప్రిల్ 18న నాసిక్ వెళ్లి బాధితులను, పోలీసులను కలిసి వివరాలు సేకరిస్తుంది. మహిళల భద్రతలో వైఫల్యాలను గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇస్తుంది.

2. టీసీఎస్ కార్యాలయంలో అసలు ఏం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి?

మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, అనుచితంగా ప్రవర్తించడం, స్టాకింగ్, బలవంతంగా మత మార్పిడికి ఒత్తిడి చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సుమారు 9 మంది ఫిర్యాదు చేశారు.

3. నిందితులపై టీసీఎస్ యాజమాన్యం తీసుకున్న చర్యలేంటి?

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను టీసీఎస్ వెంటనే సస్పెండ్ చేసింది. కంపెనీ సీఓఓ ఆర్తి సుబ్రమణ్యన్ నేతృత్వంలో ప్రత్యేక అంతర్గత విచారణకు ఆదేశించింది.

4. ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు?

పోలీసులు ఇప్పటివరకు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్ సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

tcs-nashik-sexual-harassment-ncw-investigation-and-tata-sons-response

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More