...
...
Next Story

Financial planning : నెలకు 2లక్షల జీతం- కానీ ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు.. ఈ టెక్కీ అప్పులు చూస్తే షాక్!

High Salary Financial Mistakes : నెలకి రూ.2 లక్షలు సంపాదిస్తున్నా అప్పుల భారం తట్టుకోలేక ఆర్థికంగా నలిగిపోతున్నానంటూ ఓ 27 ఏళ్ల ఐటీ ఉద్యోగి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అతని అప్పుల లిస్ట్ చూస్తే మీరు కూడా షాక్​ అవుతారు!

Published on: Jul 24, 2026, 06:45:44 IST
Advertisement

నెలకి రూ.2 లక్షల జీతం అంటే ఏ సామాన్యుడికైనా చాలా పెద్ద మొత్తం! ఆ జీతంతో హాయిగా, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని ఎవరైనా భావిస్తారు. కానీ, అంత భారీ జీతం వస్తున్నా క్రమశిక్షణ లేని ఆర్థిక నిర్ణయాలు, ఊహించని ఖర్చులు మనిషిని ఎలా అప్పుల పాలు చేస్తాయో నిరూపించే ఒక నిజ జీవిత కథ.. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ‘రెడ్డిట్’లో వైరల్‌గా మారింది.

ఈ టెక్కీ అప్పులు చూస్తే షాక్ అవుతారు! (Representational image/Gemini AI generated)
ఈ టెక్కీ అప్పులు చూస్తే షాక్ అవుతారు! (Representational image/Gemini AI generated)

"నెలకి రూ.2 లక్షలు సంపాదిస్తున్నాను.. కానీ అప్పుల్లో మునిగిపోతున్నాను. నన్ను నేను కాపాడుకోవడానికి మంచి సలహా ఇవ్వండి," అంటూ ఓ 27 ఏళ్ల ఐటీ ఉద్యోగి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది!

ఒకేసారి చుట్టుముట్టిన సమస్యలు!

ఆ ఐటీ ఉద్యోగి పంచుకున్న వివరాల ప్రకారం.. కాగితాల మీద తన జీతం ఎంతో సౌకర్యవంతంగా కనిపిస్తున్నప్పటికీ, ఆర్థికంగా తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపాడు. గడిచిన ఏడాది కాలంలో అతని జీవితంలో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలే దీనికి కారణమని చెప్పాడు.

“గడిచిన ఏడాది కాలంలో నా జీవితంలో ఊహించని మార్పులు వచ్చాయి. నాకు పెళ్లయింది. కుటుంబ అత్యవసరాలు, ఆర్థిక బాధ్యతల కోసం చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో నగరానికి మకాం మార్చాము. అక్కడ అద్దె, ఫర్నిచర్, గృహోపకరణాలు, అడ్వాన్స్ డిపాజిట్లు అంటూ కొత్త కాపురం పెట్టడానికే ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఖర్చయింది. సరిగ్గా ఇదే సమయంలో నా భార్య ఉద్యోగం పోయింది. దానితో ఇంటి భారం మొత్తం నా ఒక్కడి పైనే పడింది,” అని సదరు టెక్కీ తన ఆవేదనను వెళ్లగక్కాడు.

అప్పుల లెక్కలు ఇవే!

బంధువుల వద్ద అప్పు: బంధువుల నుంచి రూ.20 లక్షలు అప్పుగా తీసుకుని, నెలకు రూ.25,000 చొప్పున తిరిగి చెల్లిస్తున్నాడు.

పర్సనల్ లోన్: వ్యక్తిగత రుణం కోసం నెలకు మరో రూ.25,000 ఈఎంఐ కడుతున్నాడు.

క్రెడిట్ కార్డ్ ఈఎమ్‌ఐలు: క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న వస్తువులు, ఖర్చులకు నెలకు రూ.30,000 చొప్పున చెల్లిస్తున్నాడు. (ఇవి ముగియడానికి మరో 2 నెలల సమయం పడుతుంది).

మ్యూచువల్ ఫండ్స్ లోన్: తన వద్ద ఉన్న రూ.6 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టి రూ.2.2 లక్షల రుణం తీసుకున్నాడు.

ప్రస్తుతం తన బ్యాంకు ఖాతాలో అత్యవసర నిధి గానీ, కనీస నగదు నిల్వలు గానీ లేవని అతడు అంగీకరించాడు. ఒకేసారి అనేక ఖర్చులు రావడంతో ఈఎంఐలపై ఎక్కువగా ఆధారపడటమే తాను చేసిన పెద్ద తప్పని, నెలకు మంచి జీతం వస్తున్నా చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. రాబోయే 2-3 ఏళ్లలో ఈ అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో సరైన సలహా ఇవ్వాలని నెటిజన్లను కోరాడు.

"నాపై జాలి చూపించవద్దు, నిజాయితీగా సలహాలు ఇవ్వండి," అని విజ్ఞప్తి చేశాడు.

నెటిజన్లు ఇచ్చిన క్రేజీ సలహాలు!

ఈ పోస్ట్‌పై స్పందించిన అనేకమంది నెటిజన్లు, ఆర్థిక నిపుణులు అతనికి స్పష్టమైన మార్గదర్శకత్వం చేశారు.

"నువ్వు నెలకు కడుతున్న రూ.80,000 అప్పులు పోగా, మిగిలిన రూ.1.20 లక్షలు ఖర్చులకే వెళ్తున్నాయి. అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. హంగులు, ఆర్భాటాల కోసం చేసే ఖర్చులను తక్షణమే ఆపేయ్. రోజువారీ ఖర్చులను ట్రాక్ చేయడం మొదలుపెట్టు. '50/30/20' సూత్రాన్ని కచ్చితంగా పాటించు," అని ఒక నెటిజన్ సూచించాడు.

"పార్ట్ టైమ్ లేదా ఫ్రీలాన్స్ పనులు వెతుక్కో. దాని ద్వారా వచ్చే అదనపు రాబడితో ముందుగా ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకుని, ఆపై చిన్న చిన్న అప్పులను తీర్చేయ్," అని మరొకరు సలహా ఇచ్చారు.

"ముందుగా ఉన్న అప్పులన్నింటినీ ఒక చోటకు చేర్చి ప్లాన్ చేసుకో. నీ రూ.2 లక్షల జీతంలో నెలకు రూ.1.50 లక్షలు కేవలం అప్పులు తీర్చడానికే కేటాయించు. ఈఎంఐ అనే భావననే మర్చిపో. లైఫ్‌స్టైల్‌ను తగ్గించుకోకపోతే మరింత లోతుగా అప్పుల్లో కూరుకుపోతావు," అని పలువురు హెచ్చరించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe