US Green card : అమెరికాలోని భారతీయులకు భారీ షాక్! గ్రీన్ కార్డు రూల్స్​లో పెను మార్పులు.. ఇక ఇంటికే!

Green card news for Indians : అమెరికాలో తాత్కాలిక వీసాలపై నివసిస్తూ గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే భారతీయులు, విదేశీయులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. యూఎస్​సీఐఎస్ విడుదల చేసిన సరికొత్త పాలసీ మెమోరాండం ప్రకారం.. విదేశీయులు గ్రీన్ కార్డు పొందాలంటే ఇక సొంత దేశాలకు వెళ్లి అప్లై చేసుకోవాలి.

Published on: May 23, 2026, 05:34:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Green card rules : అమెరికాలో స్థిరపడాలనే కలలతో తాత్కాలిక వీసాలపై అక్కడే నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులకు యూఎస్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది! యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మే 21, 2026 న ఒక కొత్త వివాదాస్పద పాలసీ మెమోరాండంను జారీ చేసింది. దీని ప్రకారం.. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీయులు గ్రీన్ కార్డు పొందాలంటే.. ఇకపై అమెరికాలో ఉంటూ దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు! వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లి అక్కడి యూఎస్ కాన్సులేట్ ద్వారానే ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

యూఎస్​ గ్రీన్ కార్డు రూల్స్​లో సంచలన మార్పులు..
యూఎస్​ గ్రీన్ కార్డు రూల్స్​లో సంచలన మార్పులు..

యూఎస్ గ్రీన్ కార్డు- ఇప్పటివరకు ఉన్న నిబంధనలు ఏంటి?

ఇంతకుముందు వరకు అమెరికాలో స్టూడెంట్ (ఎఫ్-1), టూరిస్ట్ (బీ-1/బీ-2) లేదా వర్క్ వీసాలపై (హెచ్-1బీ, ఎల్-1) నివసిస్తున్న వారు దేశాన్ని విడిచి వెళ్లకుండానే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఈ పద్ధతిని ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్- ఏఓఎస్’ అని పిలుస్తారు. దీని ద్వారా చాలా మంది అమెరికాలోనే ఉంటూ తమ గ్రీన్ కార్డ్ ప్రక్రియను సులభంగా ముగించేవారు.

యూఎస్ గ్రీన్ కార్డు- కొత్తగా మారిన నిబంధనలు ఇవే..

యూఎస్​సీఐఎస్ జారీ చేసిన తాజా మెమో ప్రకారం, ఇకపై ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ (ఏఓఎస్) అనేది ప్రతి ఒక్కరికీ వర్తించే సాధారణ హక్కు కాదు. దీనిని అధికారులు ‘ఒక అసాధారణమైన ఉపశమనం’ లేదా ఒక ప్రత్యేకమైన మినహాయింపుగా పరిగణిస్తారు.

స్వదేశానికి వెళ్లడం తప్పనిసరి : తాత్కాలిక వీసాపై వచ్చిన వారు తమ వీసా గడువు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలని చట్టం ఆశిస్తోంది. కాబట్టి గ్రీన్ కార్డ్ కావాలనుకునే వారు తమ సొంత దేశం నుంచే దరఖాస్తు చేసుకోవాలి.

కేస్-బై-కేస్ పరిశీలన : చాలా పరిమితమైన, అత్యంత అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే అమెరికా లోపల ఉండి గ్రీన్ కార్డు దరఖాస్తు (ఏఓఎస్) చేసుకోవడానికి అధికారులు అనుమతిస్తారు. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి, సదరు వ్యక్తికి ఉన్న ప్రత్యేక కారణాలను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు.

యూఎస్​ గ్రీన్ కార్డు- ప్రభుత్వం చెబుతున్న కారణం ఏంటి?

యూఎస్​సీఐఎస్ అధికార ప్రతినిధి జాక్ కాహ్లర్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

"మేము ఇమ్మిగ్రేషన్ చట్టం అసలు ఉద్దేశాన్ని (ఒరిజినల్ ఇంటెంట్ ఆఫ్​ ది లా) పునరుద్ధరిస్తున్నాము. తాత్కాలిక వీసాలపై వచ్చే వారు తమ కాలపరిమితి ముగిశాక వెనక్కి వెళ్లాల్సిందే. గ్రీన్ కార్డు తిరస్కరణకు గురైన తర్వాత చాలా మంది అమెరికాలోనే ఉండిపోయి ‘చట్టవిరుద్ధంగా’ మారుతున్నారు. కొత్త నిబంధనల వల్ల ఈ లూప్‌హోల్స్ (చట్టంలోని లొసుగులు) అరికడుతాము," అని ఆయన తెలిపారు.

అలాగే, ఈ మార్పుల వల్ల వీసా హ్యూమానిటేరియన్ కేసులు (మానవతా దృక్పథంతో ఇచ్చే వీసాలు), నేరాల బారిన పడిన బాధితులు, హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల వీసాలపై యూఎస్​సీఐఎస్ మరింత దృష్టి పెట్టడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.

భారతీయులపై హెచ్-1బీ వీసాదారులపై ప్రభావం ఎంత?

ఈ కొత్త పాలసీ ఇమ్మిగ్రేషన్ నిపుణులు, విదేశీ నిపుణులలో పెద్ద కలకలం రేపింది. ముఖ్యంగా భారతీయులకు గ్రీన్ కార్డు బ్యాక్‌లాగ్ దశాబ్దాల తరబడి ఉంది.

హెచ్-1బీ వీసాదారుల పరిస్థితి : హెచ్-1బీ (H-1B) వీసాలను సాధారణంగా ‘డ్యూయల్ ఇంటెంట్’ (తాత్కాలికంగా ఉంటూనే శాశ్వత నివాసానికి ప్రయత్నించే వీసా) గా పరిగణిస్తారు. కానీ ఈ కొత్త మెమో ప్రకారం.. కేవలం హెచ్-1బీ వీసా కలిగి ఉన్నంత మాత్రాన అమెరికా లోపల గ్రీన్ కార్డుకు అప్లై చేసే ప్రత్యేక హక్కు లభించదు. నెగటివ్ రికార్డులు లేదా చిన్న ఓవర్‌స్టేలు ఉన్నా అధికారులు అప్లికేషన్‌ను తిరస్కరించి స్వదేశానికి పంపే ప్రమాదం ఉంది!

నిపుణుల ఆందోళన : ఈ నిర్ణయం వల్ల అమెరికా యూనివర్సిటీల్లోని టాప్ సైంటిస్టులు, బిలియన్ డాలర్ కంపెనీల వ్యవస్థాపకులు కూడా తమ పనిని ఆపేసి గ్రీన్ కార్డు ఇంటర్వ్యూల కోసం సొంత దేశాలకు వెళ్లాల్సి వస్తుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. అయితే ఈ నిర్ణయం కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ఆశయాలకు విరుద్ధంగా ఉందంటూ త్వరలోనే కోర్టుల్లో దీనిపై చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More