ISRO scientist : అప్పుడు జేఈఈలో ఫెయిల్- ఇప్పుడు ఇస్రోలో సైంటిస్ట్! ఈ అబ్బాయి స్టోరీ తెలుసుకోవాల్సిందే..
Sanket kumar : ఒకప్పుడు కేవలం రెండు మార్కుల తేడాతో జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత కోల్పోయిన ఓ సామాన్య యువకుడు, నేడు దేశం గర్వించే ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాడు! ఎలాంటి కోచింగ్ లేకుండా, కేవలం యూట్యూబ్, సొంత ప్రిపరేషన్తోనే ఈ అద్భుత విజయాన్ని అందుకున్న సంకేత్ కుమార్ స్ఫూర్తిదాయక కథనం..
కలలు కనడం ఎంత ముఖ్యమో.. వాటిని నిజం చేసుకోవడానికి పట్టుదలతో శ్రమించడం కూడా అంతే ముఖ్యం! జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోకుండా, వాటినే విజయానికి మెట్లుగా మార్చుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు మీరట్కు చెందిన సంకేత్ కుమార్. మీరట్లోని దివాన్ పబ్లిక్ స్కూల్ మాజీ విద్యార్థి అయిన సంకేత్ కుమార్.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సైంటిస్ట్/ఇంజనీర్గా ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించాడు.

సంకేత్ ఇస్రో సైంటిస్ట్గా ఎదిగిన ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఎన్నో ఆటంకాలు, అవమానాలను దాటుకుని అతడు ఈ స్థాయికి చేరుకున్నాడు. 2021లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో (కేవలం రెండు మార్కుల తేడాతో) అడ్వాన్స్డ్కు అర్హత సాధించే అవకాశాన్ని సంకేత్ కోల్పోయాడు. ఆ సమయంలో లాంగ్ టర్మ్ కోచింగ్ (డ్రాప్ ఇయర్) తీసుకోవద్దని, ఏదో ఒక సాధారణ కాలేజీలో చేరిపోవాలని చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చారు. కానీ, సంకేత్ ఎవరి మాటలను పట్టించుకోలేదు. తన లక్ష్యంపై నమ్మకంతో మరో ఏడాది ప్రిపేర్ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
కోచింగ్ లేకుండా.. యూట్యూబ్ సాయంతోనే..
ఆర్థిక ఇబ్బందుల వల్ల సంకేత్ ఎలాంటి పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనూ చేరలేదు. కేవలం సెల్ఫ్ స్టడీ (సొంతంగా చదవడం), యూట్యూబ్ లెక్చర్లు వినడం, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారానే ప్రిపరేషన్ కొనసాగించాడు. అతడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఆ తర్వాతి సంవత్సరమే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ రెండింటిలోనూ మంచి ర్యాంకు సాధించాడు. తద్వారా తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ' (ఐఐఎస్టీ)లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు సంపాదించాడు.
ఐఐఎస్టీలో చదువుతున్న సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రొపల్షన్, ఏరోడైనమిక్స్ వంటి పాపులర్ సబ్జెక్టులను ఎంచుకుంటే, సంకేత్ మాత్రం వైబ్రేషన్స్ అండ్ అకౌస్టిక్స్ అనే క్లిష్టమైన సబ్జెక్టును ఎంచుకున్నాడు. ఆ బ్యాచ్లోనే ఈ సబ్జెక్టును ఎంచుకున్న ఏకైక విద్యార్థి సంకేత్ కావడం విశేషం.
చదువుకునే రోజుల్లోనే జపాన్కు చెందిన ‘షిన్రా ఇంక్’ సంస్థ నిర్వహించిన అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్కు సంకేత్ ఎంపికై, మూడు నెలల పాటు అక్కడ పనిచేశాడు. ఐఐఎస్టీలో 8.2 సీజీపీఏతో కోర్సు పూర్తి చేసిన సంకేత్కు ఇస్రో ఇంటర్వ్యూ నుంచి పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలో తన ప్రతిభను నిరూపించుకుని రిక్రూట్మెంట్కు ఎంపికయ్యాడు.
సంకేత్ కుమార్ తన మొదటి పోస్టింగ్ను మహేంద్రగిరిలోని 'ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్'లో అందుకోనున్నాడు. రాకెట్లను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ముందు, వాటి ఇంజన్ల తుది పరీక్షలను నిర్వహించే అత్యంత కీలకమైన విభాగం ఇది.
తల్లిదండ్రులకు సర్ప్రైజ్ గిఫ్ట్!
మీరట్లోని మోదీపురం నివాసి అయిన సంకేత్, తన విజయానికి కారణం తన కుటుంబ సభ్యులేనని ఎంతో గర్వంగా చెబుతున్నాడు.
“నా విజయానికి పూర్తి క్రెడిట్ నా కుటుంబానికే దక్కుతుంది. వారు నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. నేను లాంగ్ టర్మ్ కోసం ఒక ఏడాది గ్యాప్ తీసుకున్నప్పుడు చుట్టుపక్కల వారు ఎన్నో మాటలు అన్నారు. కానీ మా కుటుంబం నాపై నమ్మకం ఉంచింది. ముఖ్యంగా మా అన్నయ్య నాకు బలమైన ఆర్థిక సహాయాన్ని అందించాడు,” అని సంకేత్ కుమార్ భావోద్వేగంతో చెప్పాడు.
అంతేకాదు, తాను ఇస్రో ఇంటర్వ్యూకి వెళ్తున్న విషయాన్ని కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలేదని సంకేత్ వెల్లడించాడు. ఉద్యోగం వచ్చిన తర్వాతే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని దాచినట్లు పేర్కొన్నాడు. “నేను ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు నా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. సెలెక్ట్ అయిన తర్వాతే ఒకేసారి వారికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను,” అని సంకేత్ నవ్వుతూ చెప్పాడు.
సంకేత్ ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాడనే వార్త తెలియగానే ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. సంకేత్ తల్లి సునీతా సింగ్, తండ్రి గుల్షన్ కుమార్, సోదరుడు హర్షిత్ కుమార్ తమ కుమారుడి సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతున్నారు.
“మాకు చాలా సంతోషంగా ఉంది. ఇస్రోలో మా అబ్బాయి సైంటిస్ట్ కావడం అనేది ఒక కల. ఆ కలను మా కుమారుడు నిజం చేశాడు. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలను నమ్మాలి, వారికి పూర్తి మద్దతు ఇవ్వాలి. అప్పుడు వారు తమ సొంత విజయగాథలను తామే రాసుకుంటారు,” అని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
సంకేత్ 2021లో దివాన్ పబ్లిక్ స్కూల్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ గ్రూపుతో 12వ తరగతి పూర్తి చేశాడు. ఆ స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ అసీమ్ దూబే, సంకేత్ను ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన విద్యార్థిగా గుర్తుచేసుకున్నారు.
“తాను జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో ఎప్పుడూ ఉండేవాడు. తన కెరీర్ పట్ల ఎంతో సీరియస్గా ఉంటూ, చదువుపైనే పూర్తి దృష్టి పెట్టేవాడు. సంకేత్ ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాడని వినగానే, నా విద్యార్థి ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు ఒక గురువుగా నా గుండె గర్వంతో ఉప్పొంగింది,” అని ప్రిన్సిపాల్ అసీమ్ దూబే ప్రశంసించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


