Electric cars : రాబోయే 15 నెలల్లో మార్కెట్లోకి 6 కొత్త ఈవీలు- టాటా, హ్యుందాయ్ నుంచి బడ్జెట్ మోడల్స్..

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతోంది. ఫిబ్రవరి 2026లోనే 20,000 పైగా ఈవీలు అమ్ముడయ్యాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు టాటా, హ్యుందాయ్, కియా వంటి దిగ్గజాలు రాబోయే 12-15 నెలల్లో 6 కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్నాయి. వాటి వివరాలు..

Published on: Mar 25, 2026, 11:21:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని వేగంతో వృద్ధి చెందుతోంది. ఈవీల విక్రయాలు స్థిరంగా పెరుగుతున్నాయి. కేవలం 2026 ఫిబ్రవరి నెలలోనే దేశవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవడం ఇందుకు విశేషం. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఇప్పటికే అనేక మోడల్స్​ని లాంచ్​ చేశాయి. అంతేకాదు రానున్న 12 నుంచి 15 నెలల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్​లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఆ మోడల్స్ ఏవో ఇప్పుడు చూద్దాము..

ఇండియాలో ఎలక్ట్రిక్​ కార్ల జాతర..!
ఇండియాలో ఎలక్ట్రిక్​ కార్ల జాతర..!

1. టాటా సియెర్రా ఈవీ..

భారతీయులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ ఇది. 2027 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది టాటా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీల మధ్య సెగ్మెంట్‌లో ఉండనుంది. ఇందులో రియర్-వీల్-డ్రైవ్ (ఆర్​డ్ల్యూడీ), ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) ఆప్షన్లతో పాటు.. వీ2వీ (వెహికల్ టు వెహికల్) ఛార్జింగ్, వీ2ఎల్​ (వెహికల్ టు లోడ్) సపోర్ట్ మరియు లెవల్ 2 అడాస్ వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి.

ఈ టాటా సియెర్రా ఈవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

2. కియా సైరోస్ ఈవీ..

కియా సంస్థ నుంచి భారత్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా ఇది నిలవనుంది. 2026 రెండో అర్ధభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ 42 కేడబ్ల్యూహెచ్​, 49 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌లతో రావచ్చు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 369 కిమీ రేంజ్ ఇస్తుందని సమాచారం. మధ్యతరగతి కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కియా దీనిని రూపొందిస్తోంది.

3. టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ 2026..

దేశంలోనే అత్యంత విజయవంతమైన బడ్జెట్ ఈవీ అయిన టియాగో ఇప్పుడు కొత్త రూపంలో రాబోతోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కానుంది. కొత్త డిజైన్, మెరుగైన బ్యాటరీ ఆప్షన్లు, మరిన్ని ఫీచర్లతో ఇది సిటీ యూజర్లను ఆకట్టుకోనుంది.

టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్​లో రాబోతున్న అతిపెద్ద మార్పులలో ఒకటి దాని లైటింగ్ సెటప్. స్పై చిత్రాల ప్రకారం, హెడ్‌ల్యాంప్ ఇంటర్నల్స్ అప్‌డేట్ అయ్యాయి. కొత్త ఎల్​ఈడీ డీఆర్​ఎల్​ డిజైన్‌ను జోడించారు. ఇప్పటివరకు బంపర్‌పై ఉన్న ఎల్​ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు (డీఆర్​ఎల్​) ఇప్పుడు ప్రధాన హెడ్‌ల్యాంప్ యూనిట్‌లోకి మారాయి. ఇది కారుకు ‘ఐబ్రో’ స్టైల్ లైటింగ్ సిగ్నేచర్‌ను ఇస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

4. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

హ్యుందాయ్ కూడా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై పనిచేస్తోంది. ఇది క్రెటా ఈవీ కంటే తక్కువ ధరలో లభించనుంది. బాక్సీ డిజైన్, ఫ్లాట్ రూఫ్‌లైన్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లతో రానున్న ఈ కారు 2026 చివరి నాటికి అందుబాటులోకి రావచ్చు.

5. మహీంద్రా బీఈ.07..

మహీంద్రా తన కొత్త 'బీఈ' బ్రాండ్ కింద 2027లో ఈ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారవుతున్న ఈ కారు 59 కేడబ్ల్యూహెచ్​, 79 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. మహీంద్రా ఈవీ విభాగంలో ఇది అత్యంత కీలకమైన మోడల్ కానుంది.

6. హోండా 0 ఆల్ఫా ఈవీ..

హోండా నుంచి భారత్‌లో రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే. 2025 జపాన్ మొబిలిటీ షోలో దీనిని ప్రదర్శించారు. సుమారు 500 కిమీ రేంజ్‌తో రానున్న ఈ ఈవీ మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది 2026-27 ఆర్థిక సంవత్సరంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ అత్యంత ఖరీదైన భాగం. దీని జీవితకాలం పెరగాలంటే బ్యాటరీ ఛార్జింగ్‌ను ఎప్పుడూ 20% కంటే తగ్గనివ్వకూడదు, 80% కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు (దీనిని 20-80 రూల్ అంటారు). అలాగే, ప్రతిరోజూ 'ఫాస్ట్ ఛార్జింగ్' వాడటం కంటే సాధారణ ఏసీ ఛార్జర్‌ను వాడటం బ్యాటరీ ఆరోగ్యానికి మంచిది. కారును నేరుగా ఎండలో కాకుండా నీడలో పార్క్ చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కకుండా ఉంటుంది.

2. ఈవీలలో ఇంజిన్ ఉండదు కదా, మరి వీటికి సర్వీసింగ్ అవసరమా?

అవును, పెట్రోల్/డీజిల్ కార్లతో పోలిస్తే ఈవీలలో కదిలే భాగాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. అయితే, వీటికి కూడా క్రమం తప్పకుండా సర్వీసింగ్ అవసరం. ఇందులో ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన పని లేకపోయినా.. బ్రేక్ ఫ్లూయిడ్, కూలెంట్ (బ్యాటరీని చల్లబరచడానికి), క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లను నిర్ణీత సమయంలో తనిఖీ చేసి మార్చుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More