పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు: ఇరాన్పై అమెరికా దాడులు.. కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ ప్రతీకారం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ప్రతిచర్యగా ఇరాన్లోని 10 సైనిక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించగా, ప్రతికారంగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా మిలిటరీ బేస్లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు గండి పడింది. ఇరాన్, అమెరికా మధ్య ఒక తాత్కాలిక అవగాహన కుదిరినప్పటికీ, ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా దళాలు ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించగా, ఇరాన్ సైన్యం కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలపై ప్రతికార దాడులు చేసింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి.
నౌకపై దాడి.. అమెరికా తీవ్ర ఆగ్రహం
హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న 'ఎంటీ కికు' (M/T Kiku) అనే వాణిజ్య చమురు రవాణా నౌకపై శనివారం ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. సుమారు 20 లక్షల బారెళ్ల ముడి చమురుతో వెళ్తున్న ఈ నౌకపై దాడిని అమెరికా తీవ్రంగా పరిగణించింది. దీనికి ప్రతిచర్యగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శనివారం రాత్రి ఇరాన్లోని 10 సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. హార్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా నౌకాదళ, వైమానిక దళ యుద్ధ విమానాలు ఈ దాడులు సాగించాయి. అమెరికా దళాలు వరుసగా రెండో రోజు కూడా ఇరాన్పై దాడులు కొనసాగించడం ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.
"కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇరాన్కు దక్కినప్పటికీ, వారు కికు నౌకపై దాడి చేసి ఆ అవకాశాన్ని స్వయంగా వదులుకున్నారు" అని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా దళాలు పూర్తి అప్రమత్తంగా, శత్రువును తుదముట్టించేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
'ఇరాన్ ఉనికి లేకుండా చేస్తాం'.. ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. తాము మిలిటరీ చర్యలను పూర్తిగా ప్రారంభించాల్సి వస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
"కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించినందుకు అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్ సైట్లపై దాడులు చేశాయి. మేము శాంతియుతంగా చర్చలు జరిపే పరిస్థితి దాటిపోవచ్చు. గతంలో విజయవంతంగా ప్రారంభించిన సైనిక చర్యను పూర్తిగా ముగించాల్సి వస్తుంది. అదే జరిగితే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశం ఇకపై ఉనికిలోనే ఉండదు" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో రాసుకొచ్చారు.
కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ ప్రతీకార దాడులు
అమెరికా దాడులకు ఇరాన్ అంతే వేగంగా స్పందించింది. ఆదివారం ఉదయం కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా మిలిటరీ కేంద్రాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడికి దిగాయి. కువైట్లోని 'అలీ అల్-సలేం' సైనిక స్థావరం, బహ్రెయిన్లోని పోర్ట్ సల్మాన్లో గల అమెరికా ఐదో నౌకాదళ (Fifth Fleet) స్థావరాలపై దాడులు చేసి, 8 కీలక సైనిక విభాగాలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తమపై జరిగే ఎలాంటి తదుపరి చర్యకైనా అంతకంతకూ ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
"శత్రువులు ఏ సాకుతోనైనా, ఎంత చిన్న లక్ష్యంపై దాడి చేసినా మా సమాధానం అత్యంత భీకరంగా ఉంటుంది" అని రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు రాబోయే రోజుల్లో 'నరకం' చూపిస్తామని ఐఆర్జీసీ నౌకాదళ కమాండ్ హెచ్చరించింది.
ఇస్లామాబాద్ ఒప్పందంలోని ఆర్టికల్ 1 ప్రకారం హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఇరానే నియంత్రిస్తుందని, నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై కఠినంగా వ్యవహరిస్తామని ఇరాన్ జాతీయ సైనిక ప్రధాన కార్యాలయ అధికారిక ప్రతినిధి ఇబ్రహీం అల్-ఫికర్ తెలిపారు. కాల్పుల విరమణను ఉల్లంఘించడం వల్ల శాంతి చర్చల ప్రక్రియ మొత్తం నిలిచిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
సందిగ్ధంలో శాంతి ఒప్పందం
ఇరాన్ అణు కార్యక్రమం, సుసంపన్నం చేసిన యురేనియం నిల్వలు, హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రక్షణ వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఈ వివరాలను ఖరారు చేయడానికి ఇరు పక్షాలకు 60 రోజుల గడువు ఉంది. అయితే, ప్రస్తుత దాడుల పరంపరతో ఈ శాంతి చర్చలు పూర్తిగా పట్టాలు తప్పే ప్రమాదం ఏర్పడింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


