రణరంగంగా పశ్చిమాసియా: గల్ఫ్‌లో యూఎస్ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ప్రతిగా బాంబుల వర్షం కురిపించిన అమెరికా

అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలం కావడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో అమెరికా 49 టోమహాక్ క్షిపణులతో ఇరాన్‌పై విరుచుకుపడగా, కువైట్, బహ్రెయిన్‌లలోని యూఎస్ మిలిటరీ స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడికి దిగింది. 

Published on: Jun 11, 2026, 10:28:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించకపోవడంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. గురువారం నాడు ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు భారీ దాడులకు దిగుతూ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ చర్చలను కాలయాపన చేస్తోందని, అందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ వ్యాప్తంగా భారీ పేలుళ్లు సంభవించాయి.

అమెరికా ఇరాన్ దాడులు ప్రతిదాడులు (via REUTERS)
అమెరికా ఇరాన్ దాడులు ప్రతిదాడులు (via REUTERS)

ఇరాన్‌పై అమెరికా రెండో విడత క్షిపణి దాడులు

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్‌లోని సైనిక నిఘా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వైమానిక రక్షణ క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రెండో విడత వైమానిక దాడులను పూర్తి చేసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 49 టోమహాక్ (Tomahawk) క్షిపణులను, అత్యాధునిక యుద్ధ విమానాలను అమెరికా ఉపయోగించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. టెహ్రాన్‌కు 40 మైళ్ల దూరంలో ఉన్న స్థావరాలతో పాటు పర్షియన్ గల్ఫ్ నైరుతి తీరప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. హార్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ట్రంప్ ఈ కఠిన చర్యలకు ఆదేశించారు. "మేము వారిపై చాలా తీవ్రంగా దాడులు చేయబోతున్నాం" అని ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుండి స్పష్టం చేశారు.

యూఎస్ స్థావరాలపై ఇరాన్ ప్రతీకారం

అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గల్ఫ్ దేశాలలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. రెండు విడతలుగా జరిగిన ఈ ఆపరేషన్‌లో కువైట్‌లోని అలీ అల్-సలేం, అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్‌లతో పాటు బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్‌లోని 18 కీలక యూఎస్ లక్ష్యాలను తాము పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. అంతేకాకుండా జోర్డాన్‌లో ఒక అమెరికా జెట్‌ను కూడా తాము లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ దాడుల్లో తమ యుద్ధనౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ కొట్టిపారేసింది.

గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్.. వాయుమార్గం మూసివేత

ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో తీవ్ర కలకలం రేగింది. బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ దేశంలో అత్యవసర సైరన్లను మోగించి, పౌరులందరూ ఆందోళన చెందకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. మరోవైపు కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దేశ వాయుమార్గాన్ని (Airspace) పూర్తిగా మూసివేసి, విమానాలను ఇతర సురక్షిత విమానాశ్రయాలకు మళ్లించింది. ఇరాన్ జరుపుతున్న దురాక్రమణల కారణంగా పౌర విమానయాన భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ వెల్లడించింది.

హార్ముజ్ జలసంధి బంద్.. ట్రంప్ వెనక్కి తగ్గేదేలే

ఈ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని చమురు ట్యాంకర్లతో సహా అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు తక్షణమే మూసివేస్తున్నట్లు ఇరాన్ (IRGC) ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి ఏ నౌక ప్రయాణించినా దానిని కూల్చివేస్తామని హెచ్చరించింది. అయితే, వాణిజ్య నౌకల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని CENTCOM తెలిపింది.

ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరంగా ఉల్లంఘనకు గురైన కాల్పుల విరమణ అని ట్రంప్ అభివర్ణించారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ, ఇరాన్ చర్చల పేరుతో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోందని, ట్రంప్ ఆశించినట్లుగా ఒప్పందం కుదరకపోతే ఇరాన్ కీలక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More