Modi task force : ఇన్ఫీ కో-ఫౌండర్​ నుంచి ఇస్రో మాజీ ఛైర్మన్​ వరకు.. మోదీ ‘టాస్క్​ ఫోర్స్​’ సభ్యులు వీరే

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత పారదర్శకంగా, లీకేజీలు లేని సురక్షితమైన వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరిన్ని చర్యలు చేపట్టారు. నందన్ నిలేకని సారథ్యంలో విభిన్న రంగాల దిగ్గజాలతో ప్రధాని ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

Published on: Jul 27, 2026, 05:26:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రశ్నాపత్రాల లీకేజీలు, సాంకేతిక అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక “ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌”ను ఏర్పాటు చేశారు.

మోదీ టాస్క్​ ఫోర్స్​లోని సభ్యులు.. (HT/PTI files)
మోదీ టాస్క్​ ఫోర్స్​లోని సభ్యులు.. (HT/PTI files)

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, డిజిటల్ విప్లవ రూపశిల్పి నందన్ నిలేకని ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో సాంకేతికత, భద్రత, లాజిస్టిక్స్, పరిపాలన రంగాలకు చెందిన దిగ్గజ నిపుణులను సభ్యులుగా చేర్చారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా, 100% నమ్మకమైన డిజిటల్ భద్రతా వ్యవస్థను రూపొందించడం కోసం ప్రభుత్వం వీరికి పూర్తి బాధ్యతలను అప్పగించింది. త్వరలోనే ఈ టాస్క్‌ఫోర్స్ తన సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.

టాస్క్‌ఫోర్స్ సభ్యులు - వారి ప్రధాన రంగాలు:

నందన్ నిలేకని (ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు)-

ఆధార్, యూపీఐ వంటి ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రాజెక్టులను విజయవంతంగా తీర్చిదిద్దిన అనుభవం నందన్ నిలేకనికి ఉంది. ఈ అనుభవంతో పరీక్షల డేటా హ్యాకింగ్‌కు గురికాకుండా ఉండేలా 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్' ప్లాట్‌ఫామ్‌ను రూపొందించనున్నారు. అలాగే, పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత తనిఖీల ద్వారా ఇతరుల పేర్లతో పరీక్ష రాసే అక్రమాలకు స్వస్తి పలకనున్నారు.

వి. కామకోటి (ఐఐటీ మద్రాస్ డైరెక్టర్)-

కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో (సీబీటీ) సైబర్ దాడులు జరగకుండా సాఫ్ట్‌వేర్, సర్వర్ భద్రతను పటిష్టం చేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ప్రతీ కంప్యూటర్‌లో ప్రశ్నల వరుసక్రమం స్వయంచాలకంగా మారేలా ఏఐ సాంకేతికతను రూపొందిస్తారు. దీనివల్ల లోకల్ సర్వర్ల హ్యాకింగ్, స్క్రీన్ షేరింగ్ వంటి సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుంది.

ఎస్. సోమ్‌నాథ్ (ఇస్రో మాజీ ఛైర్మన్)-

అంతరిక్ష ప్రయోగాల్లో వాడే 'జీరో-ఎర్రర్' (సున్నా లోపాల) విధానాన్ని పరీక్షల వ్యవస్థలో అమలు చేసేందుకు ఎస్. సోమ్‌నాథ్ ప్రణాళికలు రచిస్తారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి ఫలితాల విడుదల వరకు ప్రతి దశలోనూ బహుళ అంచెల తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేసి, మానవ పొరపాట్లు లేదా సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూస్తారు.

తపన్ దేకా (ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్)-

పరీక్షల మాఫియా, పేపర్ లీక్ ముఠాల గుట్టురట్టు చేసేందుకు అవసరమైన రియల్ టైమ్ సైబర్ నిఘా వ్యవస్థను, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను రూపొందించడంలో దేకా సహాయపడతారు. లీకేజీలు జరిగే ముందే అనుమానాస్పద కార్యకలాపాలను పసిగట్టడంతో పాటు పరీక్షా కేంద్రాల భద్రతపై కఠినమైన ఆడిటింగ్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

అమృత్ లాల్ మీనా (లాజిస్టిక్స్ నిపుణుడు)-

ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, రవాణా, స్టోరేజ్ ప్రక్రియలను డిజిటల్ లాకింగ్, జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల ద్వారా పర్యవేక్షించే భద్రతా విధానాలను వీరు అమలు చేస్తారు. నిర్దేశిత సమయం, ప్రదేశంలో మాత్రమే తెరుచుకునే డిజిటల్ తాళాలను వాడటం వల్ల ట్రంక్ పెట్టెల నుంచి పేపర్లు కనపడకుండా పోవడం లేదా దృశ్యాలను ఆక్రమంగా ఫోటోలు తీయడం వంటి చర్యలకు వీలుండదు.

అనితా కర్వాల్ (కేంద్ర విద్యారంగ మాజీ కార్యదర్శి)-

సీబీఎస్ఈ మాజీ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవంతో, అకడమిక్ సంస్కరణలు, విద్యార్థుల విధానాలపై అనిత సలహాలు అందిస్తారు. గ్రేస్ మార్కుల విధానం, ఆన్సర్ కీ వివాదాల పరిష్కారం, పరీక్షా కేంద్రాల ప్రామాణిక నిబంధనల అమలు ద్వారా మూల్యాంకన ప్రక్రియను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దనున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More