రెండు రోజుల్లో 15శాతం డౌన్- ఐటీసీ షేర్లను ఇప్పుడు కొనొచ్చా?
కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై కొత్త ఎక్సైజ్ సుంకాన్ని విధించడంతో ఐటీసీ షేర్లలో పతనం కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్లో 5 శాతానికి పైగా నష్టపోయి 52 వారాల కనిష్ట స్థాయికి ఐటీసీ షేర్లు చేరాయి. మరి ఇప్పుడు ఈ ఐటీసీ స్టాక్ని కొనుగోలు చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..
ఇన్వెస్టర్లు సేఫ్ బెట్గా భావించే ఐటీసీ స్టాక్లో భారీ కుదుపు! గురువారం ట్రేడింగ్ సెషన్లో 10శాతం పతనమై రూ. 50వేల కోట్ల మార్కెట్ క్యాపిటల్ని కోల్పోయిన ఈ ఎఫ్ఎంసీజీ దిగ్గజం, శుక్రవారం కూడా నష్టాలను చూస్తోంది.

పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించడంతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఐటీసీ షేర్లు ఒకానొక దశలో 5శాతానికి పైగా క్షీణించి, 52 వీక్- లో అయిన రూ. 345.35ని టచ్ చేశాయి. ఉదయం 11 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ సంస్థ షేర్లు దాదాపు 4శాతం నష్టాలతో రూ. 350 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
గత ఏడాది కాలంలో ఐటీసీ షేరు సుమారు 25 శాతం మేర నష్టపోయింది. ఒక్క గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ 13 శాతం మేర క్షీణించింది.
ఖరీదు కానున్న సిగరెట్లు..
డిసెంబర్ 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సిగరెట్ల పొడవును బట్టి ప్రతి 1,000 స్టిక్స్పై రూ. 2,050 నుంచి రూ. 8,500 వరకు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 40 శాతం జీఎస్టీకి ఇది అదనం.
ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల సిగరెట్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐటీసీ షేర్లను ఇప్పుడు కొనొచ్చా?
దీర్ఘకాలంలో మంచి రిటర్నులు ఇచ్చిన హిస్టరీ ఐటీసీకి ఉంది. ఎఫ్ఎంసీజీ లీడింగ్ స్టాక్స్లో ఇదొకటి. రెండు ట్రేడింగ్ సెషన్స్లో దాదాపు 15శాతం డౌన్ అవ్వడంతో ఐటీసీ షేర్లను ఇప్పుడు కొనొచ్చా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
"ఈ కొత్త సుంకం వల్ల 75–85 ఎంఎం పొడవున్న సిగరెట్ల తయారీ వ్యయం 22 శాతం నుంచి 28 శాతం వరకు పెరుగుతుంది. ఐటీసీ విక్రయాల్లో ఈ కేటగిరీ వాటా 16 శాతంగా ఉంది. పెరిగిన పన్ను భారాన్ని తట్టుకోవడానికి కంపెనీ ఒక్కో సిగరెట్పై రూ. 2 నుంచి రూ. 3 వరకు ధర పెంచే అవకాశం ఉంది," అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిపుణులు విశ్లేషించారు. ఐటీసీ షేర్లలో లాంగ్ పొజిషన్లు తీసుకున్న వారు ప్రస్తుతానికి వాటి నుంచి వైదొలగాలని వారు సూచించారు.
పొడవైన సిగరెట్లపై పన్ను భారం ఎక్కువగా ఉండటం వల్ల ప్రీమియం బ్రాండ్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని, అయితే భారత్లో సిగరెట్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా, ధరలు పెరిగినా విక్రయాలు పెద్దగా తగ్గకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సిగరెట్లపై కొత్త ఎక్సైజ్ సుంకం వల్ల స్వల్పకాలంలో ఐటీసీ లాభాలపై ఒత్తిడి ఉంటుందని రెలిగేర్ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.
"ధరల పెంపు, ఖర్చుల నియంత్రణ ద్వారా కంపెనీ ఈ ప్రభావాన్ని అధిగమించగలదు. అలాగే ఐటీసీకి కేవలం సిగరెట్లే కాకుండా ఎఫ్ఎంసీజీ, హోటళ్లు, అగ్రి బిజినెస్ వంటి ఇతర వ్యాపారాలు ఉండటం ఆ సంస్థకు కలిసొచ్చే అంశం," అని రెలిగేర్ వెల్లడించింది. ప్రస్తుతానికి మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఐటీసీ పుంజుకుంటుందని ఆ సంస్థ ధీమా వ్యక్తం చేసింది. కంపెనీ తన ధరల వ్యూహాన్ని ప్రకటించిన తర్వాత ఇన్వెస్టర్లు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమమని సూచించింది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం ఉత్తమం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


