చాణక్య నీతి: ఈ పనులు చేస్తే ఎంతటి జ్ఞానికైనా కష్టాలు తప్పవు!
జీవితంలో ఎంతటి బుద్ధిమంతుడైనా కొన్ని తప్పులు చేస్తే మానసిక శాంతిని కోల్పోతాడని ఆచార్య చాణక్య చెప్పారు. ఎంతటి జ్ఞానికైనా కష్టాలు తెచ్చిపెట్టే ఆ పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో జీవితంలోని అన్ని ముఖ్యమైన విషయాలను చాలా వివరంగా పంచుకున్నారు. ఆయన చెప్పిన శ్లోకాలు నేటి ఆధునిక కాలంలోనూ మనకు ఎంతో చక్కగా సరిపోతాయి. చాణక్యుడి సూత్రాలను పాటించడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, వీటిని నిజ జీవితంలో అన్వయించుకున్న వారు కచ్చితంగా విజయం సాధిస్తారు. ఒక పవిత్రమైన శ్లోకం ద్వారా ఎంతటి బుద్ధిమంతుడైనా ఎలాంటి పరిస్థితుల్లో మానసిక శాంతిని కోల్పోయి కష్టాల పాలు అవుతాడో ఆచార్య చాణక్య వివరించారు. ఇక్కడ కష్టాలు అంటే శారీరక ఇబ్బందులు మాత్రమే కాదు, మనిషి మానసిక సమతుల్యత, ప్రశాంతత దెబ్బతినడం కూడా ఒక రకమైన కష్టమే.

ఆచార్య చాణక్యుడి అమూల్యమైన శ్లోకం
"మూర్ఖశిష్యోపదేశేన దుష్టాస్త్రీభరణేన చ।
దుఃఖితైః సమ్ప్రయోగేణ పండితోऽప్యవసీదతి।।"
"మూర్ఖుడికి జ్ఞానాన్ని బోధించడం, దుష్ట స్వభావం ఉన్న స్త్రీని పోషించడం, ప్రతికూల వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల ఎంతటి పండితుడైనా కష్టాల పాలు అవుతాడు," అని ఆచార్య చాణక్య తన శ్లోకంలో వివరించారు.
మూర్ఖుడికి హితబోధ చేయడం వృథా
తెలివి లేని వాడికి మంచి విషయాలు చెప్పడం వల్ల ఎలాంటి లాభం ఉండదని, పైగా అలా చెప్పడం వల్ల జ్ఞానులకే నష్టం జరుగుతుందని చాణక్యుడు హెచ్చరించారు. దీనికి ఉదాహరణగా మనం చిన్నప్పుడు చదువుకున్న పిట్ట, కోతి కథను గుర్తుచేసుకోవచ్చు. వర్షంలో తడుస్తున్న మూర్ఖపు కోతికి గూడు కట్టుకోమని మంచి సలహా ఇచ్చినందుకు, ఆ పిట్ట తన సొంత గూటినే కోల్పోవాల్సి వచ్చింది. అలాగే దుష్ట స్వభావం ఉన్న స్త్రీని పోషించడం, ఆమె బాధ్యతలను నెత్తిన వేసుకోవడం వల్ల కూడా బుద్ధిమంతులకు నిరంతరం దుఃఖమే మిగులుతుంది.
చాణక్యుడి ప్రకారం ఎల్లప్పుడూ బాధల్లో ఉండే వారు అంటే తీవ్రమైన అంటువ్యాధులతో బాధపడేవారు, సంపదను పూర్తిగా కోల్పోయి దివాళా తీసిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటువ్యాధులు ఉన్న వారి పక్కన ఉంటే ఆ వ్యాధి మనకూ సోకే ప్రమాదం ఉంది. అలాగే హఠాత్తుగా సర్వస్వం కోల్పోయిన వారిని ఒక్కసారిగా నమ్మడం కష్టంతో కూడుకున్న పని.
ఇక్కడ దుఃఖంలో ఉన్న వాడు అంటే ప్రతి చిన్న విషయానికి కుంగిపోతూ, నిరంతరం నెగెటివిటీని వ్యాపింపజేసే వాడని కూడా అర్థం చేసుకోవాలి. ప్రతికూల ఆలోచనలతో నిండిపోయే వారు ఆ బాధల నుంచి అంత సులభంగా బయటపడలేరు. అలాంటి వారి పక్కన మనం ఉంటే మనకూ అపజయాలే ఎదురవుతాయి.
ఎలాంటి వారికి సహాయం చేయాలి?
బాధల నుంచి, కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా ప్రయత్నించే వారికి కచ్చితంగా సహాయం చేయాలని చాణక్యుడు సూచించారు. కష్టాల్లో ఉన్న వారిని చూసి పారిపోయేవాడు స్వార్థపరుడు అవుతాడని ఆయన నమ్మకం. కాబట్టి ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకోవాలని చూస్తారో వారికి తోడ్పాటు అందించడం ఉత్తమమైన పని.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం పౌరాణిక నమ్మకాలు, అందుబాటులో ఉన్న వివిధ గ్రంథాల ఆధారంగా రాసినది మాత్రమే. దీనిని పూర్తిగా నిజమని మేము ధృవీకరించడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


