పెరుగు అన్నం నైవేద్యంగా ఎందుకు పెట్టాలి, అదృష్టం కోసం మహిళలు పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏవో మీకు తెలుసా?
ఈ సందేహాలు కూడా చాలామందిలో ఉండే ఉంటాయి. పెరుగు అన్నాన్ని నైవేద్యంగా ఎందుకు పెట్టాలి, దాని వల్ల కలిగే లాభాలు ఏంటి? ఇంట్లో సంపాదన నిలవాలంటే వస్తువుల విషయంలో చేయకూడని పొరపాట్లు? స్త్రీలు పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం పెరుగుతుంది? ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.
మనం ప్రతిరోజు పూజ చేసి మనకు తోచిన వాటిని నైవేద్యంగా పెడుతూ ఉంటాం. బెల్లం ముక్క, అరటిపండ్లు, పరమాన్నం ఇలా ఎవరికి తోచిన వాటిని వారు స్వామివారికి నైవేద్యంగా పెడుతుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. “అదేంటి, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే లాభాలా?” అని ఆలోచిస్తున్నారా?

పెరుగు అన్నం నైవేద్యంగా పెడితే ఏమవుతుంది?
కులదైవాలకు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే అప్పులు తొలగి పోతాయి. శత్రు బాధలు తొలగిపోవాలంటే ఇందులో కొన్ని దానిమ్మ గింజలను కూడా కలిపి పెట్టండి. శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. తేజస్సు కూడా పెరుగుతుంది. పెరుగన్నంలో ఖర్జూరాన్ని కలిపి దానం ఇవ్వడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
ఏ విధమైన డబ్బు సమస్యలైనా సరే తొలగిపోతాయి. పెరుగన్నంలో ఉప్పు, మిరపకాయ కలిపి నైవేద్యం పెట్టినట్లయితే రోగాలు, గొడవలు, అప్పుల బాధల నుంచి సులువుగా బయటపడవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే విష్ణు సహస్రనామాన్ని ఇంట్లో పఠించి దంపతులకు పెరుగన్నాన్ని దానంగా ఇవ్వండి. ఇక రోగబాధల నుంచి సులువుగా బయటపడవచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
ఇంట్లో వీటిని జోడీగా పెడితేనే సంపద నిలుస్తుంది
ఇంట్లో చాలా సామాన్లు ఉంటాయి. వంటింట్లో సానుకూల శక్తిని తీసుకొచ్చే అనేక వస్తువులు ఉంటాయి. అయితే ఇంట్లో చాలా మందికి తెలియక వీటిని వేరువేరుగా పెడుతూ ఉంటారు. కానీ వీటిని జోడీగా పెడితే సంపద నిలుస్తుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
- చీపురు, చేటా ఎప్పుడూ ఒకే చోట పెట్టాలి.
- రోలు, రోకలి కలిసే ఉండాలి. వాటిని విడతీయకూడదు.
- బియ్యం, కొలత పాత్ర ఎప్పుడూ కలిసే ఉండాలి. వీటిని కూడా వేరు చేయకూడదు.
- రుబ్బురోలు, పొత్రం కూడా ఎప్పుడూ కలిసే ఉండాలి. ఈ రెండిటిని కూడా వేరు చేయడం మంచిది కాదు.
- కందిపప్పు, శొంఠి కూడా ఎప్పుడూ కలిపే పెట్టాలి.
- పంచదార డబ్బాలో ఎప్పుడూ లవంగాలను వేసి ఉంచాలి. ఈ రెండిటిని కూడా విడతీయకూడదు.
ఇవి కేవలం మనం నిత్యం ఉపయోగించే పదార్థాలే కాదు, అదృష్టాన్ని కాపాడే జోడీలు అని గుర్తుపెట్టుకోండి.
స్త్రీలు పుట్టింటి నుంచి ఈ వస్తువులను తెచ్చుకుంటే అదృష్టం వారితోనే ఉంటుంది..
పుట్టింటికి వెళ్లినప్పుడు చాలా మంది తల్లి ఇచ్చిన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. వీటిని తెచ్చుకుంటే మాత్రం అదృష్టం డబుల్ అవుతుంది.
1.అక్షింతలు: స్త్రీలు పుట్టింటి నుంచి అక్షింతలను తెచ్చుకోవడం వలన లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
2.బెల్లం: స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే అప్పులు త్వరగా తీరిపోతాయి. సంతోషంగా ఉండొచ్చు.
3.మట్టి కుండ: మట్టితో చేసిన కుండను పుట్టింటి నుంచి మహిళలు తెచ్చుకుంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.
4.మట్టి గాజులు: పుట్టింటి నుంచి మట్టి గాజులు తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది.
5.పసుపు, కుంకుమలు: స్త్రీలు పుట్టింటి నుంచి పసుపు, కుంకుమలు తెచ్చుకుంటే వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలుగుతుంది.
6.ఏనుగు బొమ్మలు: పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మలను తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
7.వెండి నాణెం: పుట్టింటి నుంచి వెండి నాణెం లేదా చిన్న వెండి వస్తువును తెచ్చుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ధనం కలుగుతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
8.దీపం: దీపం లేదా దీప సామాగ్రిని పుట్టింటి నుంచి తెచ్చుకోవడం వలన ప్రతికూల శక్తి తొలగి జ్ఞానం, వెలుగు, సానుకూల శక్తి వ్యాపిస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


