భారత్ బంద్.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?
ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్కు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందా? అనే విషయంపై చాలా మందికి క్లారిటీ లేదు.
ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్లో పలు రంగాలకు చెందిన 30 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల ప్రకటించిన భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం, కేంద్రం కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఈ సమ్మెను నిర్వహిస్తోంది. 10 ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి.

నేడు భారత్ బంద్ జరుగుతుందని భావిస్తున్నందున తెలంగాణ అంతటా ప్రజలు బ్యాంకులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా వంటి రోజువారీ సేవలు పనిచేస్తాయా లేదా అనే దానిపై చాలా మందికి గందరగోళం ఉంది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంయుక్త కిసాన్ మోర్చా (SKM) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది భారతీయ రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వాదించింది. దిగుమతి చేసుకున్న వస్తువులు దేశీయ మార్కెట్లలోకి ప్రవేశించవచ్చని, స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు పోటీ పడటం కష్టమవుతుందని హెచ్చరించింది.
సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ హన్నన్ మొల్లా ఈ ఒప్పందాన్ని రైతులకు చేసిన ద్రోహంగా అభివర్ణించారు. పెరుగుతున్న దిగుమతులు వ్యవసాయ ఆదాయాలను బలహీనపరుస్తాయన్నారు. జీవనోపాధికి ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. రైతు సంఘాలు ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 11 మధ్య అనేక రాష్ట్రాల్లో అవగాహన ప్రచారాలను నిర్వహించాయి. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
మరోవైపు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈ వాణిజ్య ఒప్పందాన్ని సమర్థించారు. కీలక వ్యవసాయ రంగాలను రక్షించామని చెప్పారు. పాల ఉత్పత్తులు, ప్రధాన ఆహార ధాన్యాలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు సుంకాల రాయితీల కింద చేర్చలేదని కేంద్రం తెలిపింది.
అయితే భారత్ బంద్ కారణంగా బ్యాంకులు, పాఠశాలలు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ అధికారుల నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ రాలేదు. అయితే నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగితే కొన్ని ప్రాంతాలలో ప్రజా రవాణా, రాకపోకలకు అంతరాయం కలగవచ్చు. ప్రయాణించే ముందు స్థానిక అధికారులు, రవాణా అధికారులు జారీ చేసిన అప్డేట్స్ ఫాలో కావాలి.
స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపారాలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణలో భారత్ బంద్ గురించి తాజా సమాచారం కోసం అధికారిక అప్డేట్స్ చూస్తూ ఉండాలి. రవాణా ఇబ్బందులు ఉండే అవకాశంతో కొన్ని చోట్ల విద్యాసంస్థలు మూసివేసే అవకాశం ఉంది.

E-Paper












