ఫోన్ ట్యాపింగ్‌పై మరో బాంబ్ పేల్చిన మంత్రి పొంగులేటి.. బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఇంకా ఆ పరికరాలను వాడుకుంటుందని వ్యాఖ్యానించారు.

Published on: Feb 10, 2026 8:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్‌లోని అగ్రనేతలను సిట్ విచారణ చేసింది. అయితే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. భారత రాష్ట్ర సమితి ఇప్పటికీ ప్రజల ఫోన్‌లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం త్వరలో ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుందని చెప్పారు.

మంత్రి పొంగులేటి(ఫైల్ ఫొటో)
మంత్రి పొంగులేటి(ఫైల్ ఫొటో)

'ఇప్పటికీ అధికారులతో కాన్ఫరెన్స్ కాల్‌లో మేం జరిపిన సంభాషణలు బహిరంగంగా రావడం అనుమానాస్పదంగా ఉంది, బహుశా వారు ఇప్పటికీ ఆ పరికరాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఎవరెవరు ఇందులో పాల్గొన్నారో, ఏ ఫామ్‌హౌస్‌లు లేదా మామిడి తోటలలో పరికరాలు దాచారో త్వరలో బయటపెడతాం.' అని మంత్రి పొంగులేటి అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని విచారణ జరుగుతోంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇతర ప్రముఖ వ్యక్తుల ఫోన్‌లపై నిఘా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వారు ఏం మాట్లాడుకున్నారో వినేవారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఫిబ్రవరి 1న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ కూడా సిట్ ముందు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ ప్రశ్నించింది.

కేసీఆర్ విచారణలో భాగంగా అధికారులు పలు కీలక ప్రశ్నలు కేసీఆర్‌కు వేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా అని నేరుగా ప్రశ్నించారు. ఈ విషయం చుట్టూనే ఎక్కువగా ప్రశ్నలు వేశారు. గతంలోని పలువురి వాంగ్మూలాల ఆధారంగా సిట్ ప్రశ్నలు తయారు చేసుకుంది.

ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెుదలైందనే ప్రశ్నను కూడా కేసీఆర్‌కు అధికారులు వేశారు. కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు? అని దీనికి అనుబంధం ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా? అని కూడా అడిగారు.