...
...
Next Story

BRS Protest : కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై BRS పోరుబాట - 7 రోజులపాటు నిరసనలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బీఆర్ఎస్ ఏడు రోజుల నిరసన ప్రణాళికను ప్రకటించింది. సెప్టెంబర్ 2 నుండి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనుంది.

Published on: Aug 28, 2026, 11:35:03 IST
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న వేళ, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వంపై ప్రజా పోరాటానికి సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఏడు రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 2 నుండి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన బాట సాగనుంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( ఫైల్ ఫొటో)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( ఫైల్ ఫొటో)

పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి, వెయ్యి రోజులు దాటినా ప్రధాన వాగ్దానాలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. ఈ పాలనా వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయడమే బిఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఏడు రోజుల ప్రత్యేక పోరాట ప్రణాళిక:

  • సెప్టెంబర్ 1 (ఛార్జిషీట్ విడుదల) : వారం రోజుల నిరసనకు ముందే తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై బీఆర్ఎస్ అధిష్ఠానం ఒక సమగ్ర ఛార్జిషీట్‌ను విడుదల చేయనుంది.
  • సెప్టెంబర్ 2 (ఆరు గ్యారెంటీలపై ధర్నాలు ): నియోజకవర్గ కేంద్రాల్లో ఆరు గ్యారెంటీల వైఫల్యంపై నిరసనలు తెలుపుతారు. ‘420 హామీల మోసం’ పేరుతో ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ… ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీల వివరాలతో ప్రచురించిన 'బాకీ కార్డుల'ను ప్రతీ ఇంటికీ పంపిణీ చేస్తారు.
  • సెప్టెంబర్ 3 (రైతు సదస్సులు - 22ఎ భూముల నిరసన) : సాగునీరు, ఉచిత విద్యుత్, యూరియా కొరత, పంటల బీమా సమస్యలపై అన్ని నియోజకవర్గాల్లో రైతులతో చర్చా సదస్సులు నిర్వహిస్తారు. మరోవైపు హైదరాబాద్‌లో తీవ్రంగా వేధిస్తున్న 22ఏ నిషేధిత భూముల సమస్యపై బాధితులతో కలిసి ఆందోళన చేపడతారు.
  • సెప్టెంబర్ 4 (మహిళలు, వికలాంగుల నిరసనలు) : నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, తులం బంగారం హామీలను విస్మరించడంపై మహిళలతో కలిసి నిరసనలు తెలుపుతారు. నియోజకవర్గ కేంద్రాల్లో వినూత్నంగా వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • సెప్టెంబర్ 5 (యువజన ర్యాలీలు) : జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్, యూత్ డిక్లరేషన్ అమలు చేయకపోవడంపై యువతతో భారీ ర్యాలీలు నిర్వహిస్తారు. సింగరేణి, ఆదిలాబాద్ సిసిఐ ప్రాంతాల్లో కార్మికుల సమస్యలపై ప్రత్యేక సదస్సులు ఉంటాయి.
  • సెప్టెంబర్ 6 (నగర సమస్యలపై ఆటో ర్యాలీలు ): హైదరాబాద్‌లో డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, శాంతిభద్రతల లోపాలపై ఆటో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామాల్లో నిరసనలు తెలుపుతారు.
  • సెప్టెంబర్ 7 (ప్రజావాణిలో పిటిషన్లు) : జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ప్రజావాణి కేంద్రాలకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, 420 హామీల మోసంపై బీఆర్‌ఎస్ నాయకులు స్వయంగా ఫిర్యాదు లేఖలు సమర్పిస్తారు.
  • సెప్టెంబర్ 8 (మీడియా సమావేశాలు - అంబేడ్కర్ నివాళులు): వారం రోజుల ఉద్యమ తీవ్రతను ప్రతి ప్రతినిధి తమ జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్ల ద్వారా వివరిస్తారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe