Railway Ticket : మీరు రిజర్వేషన్ చేసుకున్న రైల్వే టికెట్‌ను మరొకరి పేరు మీదకు బదిలీ చేయవచ్చా?

ఒకరి పేరు మీద రిజర్వేషన్ చేసుకున్న టికెట్‌ను మరొకరి పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా అని చాలా మందికి అనుమానం ఉంటుంది. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి.

Published on: Feb 25, 2026, 20:48:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్నిసార్లు రైల్వే టికెట్ మన పేరు మీద రిజర్వేషన్ చేసుకుంటాం. కానీ సమయానికి వెళ్లడం కుదరకపోవచ్చు. ఇంట్లో వేరేవాళ్లని పంపాలని నిర్ణయించుకుంటాం. ఇలాంటి సమయాల్లో రైల్వే టికెట్‌ను వారి పేరు మీదకు మార్చవచ్చా అనే అనుమానం ఉంటుంది.

భారతీయ రైల్వే
భారతీయ రైల్వే

మీ దగ్గర కన్ఫర్మ్ టికెట్ ఉండి.. ప్రయాణించలేకపోతే ఎంచుకున్న రిజర్వేషన్ కార్యాలయం చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు రైలు షెడ్యూల్ బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాలి. అలా మీరు మీ రిజర్వ్ చేసిన టికెట్‌ను మరొక ప్రయాణికుడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి.

రిజర్వ్డ్ టికెట్‌లో పేరు మార్పు అవసరమయ్యే ప్రయాణికులు ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ ప్రింటవుట్, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు రుజువుతో రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

అధికారుల ప్రకారం, సంబంధిత డివిజన్.. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా ప్రధాన స్టేషన్లలోని చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ కింది పరిస్థితులలో రిజర్వ్డ్ టికెట్‌లో పేరు మార్పును అనుమతించడానికి అధికారం కలిగి ఉన్నారు:

  • కుటుంబంలో టికెట్‌ను బదిలీ చేయడం సాధ్యమే. ఒక ప్రయాణికుడు బయలుదేరడానికి 24 గంటల ముందు రాతపూర్వక అభ్యర్థనను సమర్పించాలి. అతడు లేదా ఆమె పేరు మీద చేసిన రిజర్వేషన్‌ను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్య.. ఇలా కుటుంబంలోని మరొక సభ్యునికి బదిలీ చేయవచ్చు. రిజర్వేషన్ మార్పును అనుమతించడానికి స్టేషన్ మేనేజర్ కూడా అధికారం ఉంటుంది.
  • అధికారిక విధుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి ఆప్షన్ అందుబాటులో ఉంది. సంబంధిత అధికారి బయలుదేరడానికి 24 గంటల ముందు పేరు మార్పు కోసం లిఖితపూర్వకంగా అభ్యర్థించవచ్చు.
  • విద్యార్థులు గ్రూపుగా వెళ్తుంటే.. ఎవరిపేరైనా మార్చి వేరే ప్రయాణికుడు రావాలనుకుంటే.. ఆ విద్యా సంస్థ అధిపతి బయలుదేరడానికి 48 గంటల ముందు రాతపూర్వక అభ్యర్థనను సమర్పించవచ్చు. విద్యార్థి పేరు మీద చేసిన రిజర్వేషన్‌ను అదే సంస్థలోని మరొక విద్యార్థికి బదిలీ చేయవచ్చు.
  • అలాగే ప్రయాణికులు పెళ్లికి సంబంధించి వెళ్తుంటే.. ఆ గ్రూపులోని ఒక వ్యక్తి బయలుదేరడానికి 48 గంటల ముందు ఒక సభ్యుడి నుండి మరొక సభ్యుడికి రిజర్వేషన్‌ను బదిలీ చేయడానికి రాతపూర్వక అభ్యర్థన చేయవచ్చు.
  • నేషనల్ క్యాడెట్ కార్ప్స్(NCC) క్యాడెట్ల సమూహానికి కూడా ఇది వర్తిస్తుంది. బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు పేరు బదిలీని అభ్యర్థించవచ్చు.

అయితే అటువంటి అభ్యర్థనలు ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. అంతేకాదు గ్రూప్‌గా వెళ్తుంటే.. మొత్తం సమూహం పరిమాణంలో 10 శాతం మించి పేరు మార్పులు అనుమతించరు. రాయితీపై జారీ చేసిన టిక్కెట్లలో పేరు మార్పు సౌకర్యం కూడా అనుమతి ఉండదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More