అండమాన్‌లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం: సముద్రంలో కూలిన పవన్ హన్స్ హెలికాప్టర్.. ఏడుగురు ప్రయాణికులు సురక్షితం

అండమాన్ నికోబార్ దీవుల్లో పెను ప్రమాదం తప్పింది. మాయాబందర్ సమీపంలో పవన్ హన్స్ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. రన్‌వేకు కేవలం 300 మీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది. పైలట్లతో సహా ఏడుగురు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Published on: Feb 24, 2026, 12:36:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం ఉదయం పెను విమాన ప్రమాదం తప్పింది. జాతీయ హెలికాప్టర్ రవాణా సంస్థ 'పవన్ హన్స్'కు చెందిన ఓ హెలికాప్టర్ సముద్రంలోకి దూసుకెళ్లింది. అయితే, అదృష్టవశాత్తూ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

సముద్రంలో కూలిన పవన్ హన్స్ హెలికాప్టర్.. ఏడుగురు ప్రయాణికులు సురక్షితం (HT)
సముద్రంలో కూలిన పవన్ హన్స్ హెలికాప్టర్.. ఏడుగురు ప్రయాణికులు సురక్షితం (HT)

అసలేం జరిగిందంటే?

మంగళవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులతో కూడిన పవన్ హన్స్ హెలికాప్టర్ పోర్ట్ బ్లెయిర్ నుంచి ఉత్తర అండమాన్‌లోని మాయాబందర్‌కు బయలుదేరింది. గమ్యస్థానానికి చేరుకుని, ల్యాండ్ కావడానికి మరికొన్ని సెకన్ల సమయం ఉందనగా ప్రమాదం జరిగింది. రన్‌వేకు కేవలం 300 మీటర్ల దూరంలో ఉండగా హెలికాప్టర్ అదుపుతప్పి సముద్రంలో పడిపోయింది.

తక్షణమే స్పందించిన సిబ్బంది..

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు పవన్ హన్స్ ప్రతినిధి వెల్లడించారు. "హెలికాప్టర్ సముద్రంలో పడిపోయినప్పటికీ (Ditching), లోపల ఉన్న ఏడుగురిని తక్షణమే రక్షించాం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు" అని ఆయన స్పష్టం చేశారు. మాయాబందర్ రన్‌వేకు సమీపంలోనే ఈ 'షార్ట్ ల్యాండింగ్' ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అండమాన్ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడటం పెద్ద ఊరటనిచ్చింది. దీనికి సరిగ్గా ఒక రోజు ముందు, అంటే సోమవారం సాయంత్రం జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన 'బీచ్‌క్రాఫ్ట్ C90' విమానం రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తీసుకువెళ్తుండగా అడవి ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్లు వివేక్ వికాస్ భగత్, సవరాజ్‌దీప్ సింగ్‌తో పాటు డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, రోగి బంధువులు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతా ఏటీసీ (ATC)తో సంబంధాలు తెగిపోయిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగింది.

ప్రస్తుతం అండమాన్ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితులా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More