గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గెలిపిస్తే అభివృద్ధి జరగదు : సీఎం రేవంత్
పాలమూరు ప్రాజెక్టులను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని గతంలో ఏ నేత కూడా అనుకోలేదని విమర్శించారు.
నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనాలకు, మక్తల్-నారాయణపేట మధ్య నాలుగు లైన్ల రోడ్డు, మక్తల్ క్రీడాభవనంతోపాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దానికంటే ముందు వనపర్తి జిల్లా ఆత్మకూరులోనూ పర్యటించిన రేవంత్ రెడ్డి రూ.151.92 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మక్తల్ పట్టణ కేంద్రంలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

'ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారు. మక్తల్ నుంచి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మక్తల్, నారాయణపేట, కొడంగల్కు సాగునీరు ఇవ్వాలని ఎవరికీ అనిపించలేదు. మన కష్టాలను తీర్చడానికి మీ సోదరుడిగా, మీతోపాటు పెరిగిన బిడ్డగా ముఖ్యమంత్రిగా వచ్చాను. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
గతంలో కేసీఆర్ను గెలిపించి సీఎంగా చేస్తే మన జిల్లాలో ఎలాంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.12 కోట్లు కేటాయించిన సంగంబండ రిజర్వాయర్ పూర్తి చేయలేదన్నారు. మంత్రి మండలి సహకారంతో ఇక్కడ అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. రెండు సంవత్సరాలలో నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఎవరైనా అడ్డుపడితే ఊరుకోమని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చిన మెుదట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత 75 ఏళ్లలో ఎవరూ కాలేదన్నారు. ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డారన్నారు. అనేక దశబ్దాలుగా పాలమూరు జిల్లా కరవు, వలసలకు మాత్రమే పేరు పొందిందని చెప్పారు.
కేసీఆర్ చేసిన రూ.8లక్షల కోట్ల అప్పులు తీరుస్తూనే.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించొద్దన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గెలిపిస్తే.. గ్రామం అభివృద్ధి చెందదన్నారు. మంత్రుల వద్దకు వెళ్లి గ్రామానికి నిధులు అడిగే నేతలను సర్పంచ్లుగా గెలిపించుకోవాలన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లను మాజీ మంత్రి కేటీఆర్ అండ్ కో రెచ్చగొడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'మా ప్రభుత్వంలో పేదలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు చర్యలు చేపట్టాం. దేశానికి, రాష్ట్రానికి పాలమూరుని ఆదర్శంగా మారుస్తాం. ఇరిగేషన్, ఎడ్యుకేషన్కు ప్రాధాన్యాత ఇస్తున్నాం.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.













