వేగంగా ఐటీ కారిడార్లోని కీలక జంక్షన్లలో మూడు మల్టీ లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం
హైదరాబాద్ ఐటీ కారిడార్లోని కీలక జంక్షన్లలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం నడుస్తోంది. రూ.800 కోట్లతో ఈ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.
హైదరాబాద్ ఐటీ కారిడార్లోని కీలక జంక్షన్లలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. రూ.800 కోట్లతో చేపట్టిన ఈ జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ మే 2028 నాటికి ట్రాఫిక్ సిగ్నల్లను తొలగించి దీర్ఘకాలిక రద్దీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్బీ సమీపంలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ల కోసం భూమి తవ్వకం, పిల్లర్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఐఐఐటీ జంక్షన్, ఖాజాగూడ, విప్రో జంక్షన్ వద్ద మూడు ఫ్లైఓవర్లను కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్.. సైబరాబాద్ ఐటీ బెల్ట్ లోపల సిగ్నల్-ఫ్రీ కారిడార్ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నెలల క్రితం మట్టి పరీక్షలు పూర్తయిన తర్వాత.. లోతైన తవ్వకం కోసం భారీ యంత్రాలను మోహరించారు. ఇప్పుడు ఐఐఐటీ జంక్షన్ స్థలంలో అధికారికంగా పిల్లర్ల పనులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాంతాలలో వాహనదారులు ఉదయం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు రద్దీ సమయాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్లను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు తీవ్రమైన వరదలకు దారితీసి పూర్తిగా రద్దీ సమస్యను చూడాల్సి వచ్చింది.
గచ్చిబౌలి నుండి లింగంపల్లి, జేఎన్టీయూ, మెహదీపట్నం వైపు విస్తరించి ఉన్న వేర్వేరు క్యూలలో కొన్నిసార్లు మూడు నుండి ఐదు గంటల సమయం ట్రాఫిక్లో చిక్కుకుపోయినట్టుగా ఐటీ నిపుణులు పలువురు చెబుతున్నారు.
ఈ నిరంతర అడ్డంకులను పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ ఈ భారీ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణంలో రూ.800 కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ ప్రణాళికలో ఐఐఐటీ జంక్షన్ వద్ద మూడు ఫ్లైఓవర్లు, ఒక ప్రత్యేక అండర్పాస్ ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత.. ప్రయాణికులు ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ను ఎదుర్కోకుండానే తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారని అధికారులు చెబుతున్నారు. ఇది ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాదు అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. మూడు ఫ్లైఓవర్లు, అండర్పాస్ను పూర్తి చేయడానికి జీహెచ్ఎంసీ మే 2028 గడువును నిర్ణయించింది.

E-Paper












