తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు పడే సూచనలున్నాయి.
ఇవాళ, రేపు వర్షాలు…!

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (ఫిబ్రవరి 24) రాష్ట్రంలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈజిల్లాలకు ఎల్లో హెచ్చకిలు జారీ అయ్యాయి.
ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తర్వాత తేదీల్లో కూడా పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు…!
మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే ఎండ తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ప్రజలు ఇబ్బందిపడుతున్న పరిస్థితులు అప్పుడే మొదలయ్యాయి. ఫిబ్రవరి నెల దాటకముందే భానుడి భగభగలు ఉండటంతో… రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.