వైభవంగా నాగోబా జాతర ప్రారంభం.. ఏ రోజు ఏం చేస్తారంటే?
అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో ఘనంగా ప్రారంభమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదివాసీ పండుగ క్యాలెండర్ చూసుకుంటే.. సాంప్రదాయకంగా కెరమెరి మండలంలో జంగు భాయ్ జాతరతో ప్రారంభమై ఇంద్రవెల్లిలో నాగోబా జాతరతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం పుష్య మాసం ముగింపులో అమావాస్య రాత్రి నిర్వహిస్తారు.

మేడారంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత నాగోబా జాతర రెండో అతిపెద్ద ఆదివాసీ పండుగ. మేస్రం కుటుంబ సభ్యులు నాగదేవతకు అభిషేకం చేసిన తర్వాత వేడుకలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ.. ప్రత్యేక పూజలు చేశారు.
పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు ఈ నాగోబా జాతరను మెుదలుపెడతారు. ఆచారంలో భాగంగా గోదావరి నది నుండి పవిత్ర జలాన్ని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు నుండి దాదాపు 140 కి.మీ.ల దూరం కాలినడకన కేస్లాపూర్కు తీసుకువస్తారు. జాతరకు రెండు రోజుల ముందు తెచ్చిన నీటిని ఆలయం సమీపంలోని మర్రి చెట్టుకు కట్టి, తరువాత అభిషేకానికి ఉపయోగిస్తారు. తర్వాత జాతర మెుదలవుతుంది.
జాతరకు ముందు ఆలయ కమిటీ అవగాహన కల్పించడానికి, ఏర్పాట్లు చేయడానికి ఎడ్ల బండ్లపై ప్రచారాన్ని చేపట్టింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 2,500 నుండి 3,000 మేస్రం వంశీయుల కుటుంబాలు వచ్చాయి. నాగోబా జాతరకు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో జనం వస్తారని అధికారులు భావిస్తున్నారు.
జాతర జనవరి 18న అర్ధరాత్రి ప్రారంభమైంది, 20న పెర్సపేన్, బాన్ పేన్ పూజలు, జనవరి 22న నాగోబా దర్బార్ నిర్వహిస్తారు. 23న బేతాల్ పూజ, మండగాజాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగుస్తుంది. జనవరి 25 వరకు భక్తులు సందర్శించే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం జనవరి 27 నుంచి 31 వరకు కరీంనగర్ రీజియన్ నుంచి టీజీఎస్ఆర్టీసీ సుమారు 700 ప్రత్యేక బస్సులను నడపనుంది. కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని డిపోల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.

E-Paper












