...
...
Next Story

Lemon Price : వామ్మో.. చికెన్ ధరలతో పోటీ పడుతున్న నిమ్మకాయలు.. కేజీ ఎంత?

Lemon Price : తెలంగాణలో నిమ్మకాయల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు చికెన్ ధరతో నిమ్మకాయలు పోటీ పడుతున్నాయి. దీంతో జనాలు కొనాలంటే ఆలోచన చేస్తున్నారు.

Published on: Sep 7, 2026, 16:22:57 IST
Advertisement

హైదరాబాద్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. మిగతా కూరగాయల ధరలు ఒకింత స్థిరంగా ఉన్నప్పటికీ, చిల్లర మార్కెట్లలో నిమ్మకాయల ధరలు కిలో రూ. 220 నుండి రూ. 250 వరకు పలుకుతున్నాయి. చివరికి చికెన్ ధరతో నిమ్మకాయల ధర పోటీ పడటం గమనార్హం.

నిమ్మకాయ ధరలు
నిమ్మకాయ ధరలు

మరింత విస్తుపోయే విషయమేమిటంటే, ఆన్‌లైన్ క్విక్ కామర్స్, డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో నిమ్మకాయల ధరలు ఏకంగా కిలో రూ. 320 నుండి రూ. 340 వరకు చేరాయి. సాధారణ సూపర్ మార్కెట్లలో సైతం అధిక ధరలకే విక్రయిస్తున్నారు. ధరల మంట కారణంగా సామాన్యులు నిమ్మకాయలు కొనాలంటేనే భయపడిపోతున్నారు.

గతంలో రూ. 20లకే దొరికే ఆరు నిమ్మకాయలకు ఇప్పుడు ఏకంగా రూ. 40 లేదా 50 వెచ్చించాల్సి వస్తోందంటున్నారు జనాలు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిస్థితి చూసుకుంటే.. ఇక్కడ రిటైల్‌లో కిలో రూ. 220 నుండి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ. 140 నుండి రూ. 150 ఉన్న ధరలు, గత 20 రోజులుగా నిరంతరం పెరిగాయి.

హోల్‌సేల్ మార్కెట్‌లో నిమ్మకాయల ధర కిలో రూ. 150 నుండి రూ. 180 వరకు ఉండగా, చిల్లర మార్కెట్‌లో రూ. 200 నుండి రూ. 250 వరకు అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన నిమ్మకాయల దిగుమతులు బాగా తగ్గిపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లకు ప్రధానంగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి సరుకును దిగుమతి చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి రవాణా చేయడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, ఆ భారం వినియోగదారులపై పడుతోంది.

గత వారంతో పోలిస్తే కొన్ని కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, నిమ్మకాయల రేట్లు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. రాబోయే రోజుల్లో దిగుమతులు పెరిగితే తప్ప నిమ్మకాయల ధరలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe