Bhadrachalam : భద్రాచలం దేవస్ధాన అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - 3 దశల్లో పనులు..!
Bhadrachalam Temple Master Plan : భద్రాచలం దేవస్ధాన అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - 3 దశల్లో పనులు..! భద్రాచలం దేవస్ధాన అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ది చేయనున్నారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం కాగా…. సీఎం సూచనల తర్వాత తుది రూపు ఇవ్వనున్నారు. ఆగమ శాస్త్రం ప్రకార… మొత్తం మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ది చేయనున్నారు.

భద్రాచలం ఆలయ రూపురేఖలను మార్చేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం సచివాలయంలోని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందుకు జిల్లా మంత్రులు తుమ్మలతో పాటు పొంగులేటి కూడా హాజరయ్యారు. భద్రాద్రిని ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని మంత్రులు వెల్లడించారు.
3 దశల్లో ఆలయాభివృద్ధి….
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…. 200 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత మాస్టర్ ప్లాన్కు తుదిరూపునివ్వాలని సమావేశంలో నిర్ణయించారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి భద్రాచలంలో పుష్కర ఘాట్తో పాటు మొదటి దశ ఆలయ అభివృద్ది పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్గా మారుస్తామన్నారు. భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గోదావరి పుష్కరాలలో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కొరివి వీరభద్రస్వామి దేవాలయం, మల్లూరు లోని నరసింహాస్వామి దేవాలయాలను కూడా అభివృద్ది చేయాలని సూచించారు.
ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి - మంత్రి కొండా సురేఖ
ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి నిలయమన్నారు. ఆలయం, పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
యాత్రికుల సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్కింగ్ సదుపాయాలు, రహదారుల విస్తరణ, పరిశుభ్రత పరిరక్షణ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాడ వీధుల అభివృద్ధి, కల్యాణ మండప నిర్మాణం, రామవనం అభివృద్ధి, డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, తాగునీటి సరఫరా, శుభ్రమైన మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ఈ నెల 27న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. కల్యాణ మండపాన్ని ఆకర్షణీయంగా అలంకరించడంతో పాటు లైటింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను సమృద్ధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక చర్యలు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

